iDreamPost
android-app
ios-app

లార్డ్స్‌ పిచ్‌పై ఇంగ్లండ్‌తో కబాడ్డీ ఆడిన టీమిండియా! కోహ్లీసేన విధ్వంసానికి 3 ఏళ్లు!

  • Published Aug 16, 2024 | 12:32 PM Updated Updated Aug 16, 2024 | 12:32 PM

IND vs ENG, Lord's, Virat Kohli: ఇంగ్లండ్‌ గడ్డపై టీమిండియా చేసిన సింహగర్జనకు నేటితో 3 ఏళ్లు నిండాయి. ‘60 ఓవర్లలో నరకం చూపించాలి’ అనే కోహ్లీ రెచ్చగొట్టే స్పీచ్‌కు బౌలర్లు రెచ్చిపోయిన ఆ మ్యాచ్‌ గురించి ఇప్పుడు మరోసారి తెలుసుకుందాం..

IND vs ENG, Lord's, Virat Kohli: ఇంగ్లండ్‌ గడ్డపై టీమిండియా చేసిన సింహగర్జనకు నేటితో 3 ఏళ్లు నిండాయి. ‘60 ఓవర్లలో నరకం చూపించాలి’ అనే కోహ్లీ రెచ్చగొట్టే స్పీచ్‌కు బౌలర్లు రెచ్చిపోయిన ఆ మ్యాచ్‌ గురించి ఇప్పుడు మరోసారి తెలుసుకుందాం..

  • Published Aug 16, 2024 | 12:32 PMUpdated Aug 16, 2024 | 12:32 PM
లార్డ్స్‌ పిచ్‌పై ఇంగ్లండ్‌తో కబాడ్డీ ఆడిన టీమిండియా! కోహ్లీసేన విధ్వంసానికి 3 ఏళ్లు!

సరిగ్గా మూడేళ్ల క్రితం.. క్రికెట్‌ మక్కా లార్డ్స్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. అది అలాంటి ఇలాంటి సాధారణ మ్యాచ్‌ కాదు.. కోహ్లీ కెప్టెన్సీలో టెస్టు క్రికెట్‌ను భారత్‌ శాసిస్తున్న కాలం, ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో బౌలర్లను రెచ్చగొట్టి.. ఇంగ్లండ్‌ పైకి వేటాడే సింహాల్లా పంపాడు విరాట్‌ కోహ్లీ. ‘ఈ 60 ఓవర్లలో వాళ్లకు నరకం చూపించాలి’ అంటూ కోహ్లీ చెప్పిన మాటతో టీమిండియా బౌలర్లు బోన్‌ నుంచి బయటపడిన సింహాల్లో రెచ్చిపోయి వేటాడారు. కోహ్లీ ఇచ్చిన టార్గెట్‌ కంటే.. మరో 8 ఓవర్లు మిగిలి ఉండగానే.. ఇంగ్లండ్‌ ఖేల్‌ ఖతం చేసి.. లార్డ్స్‌ గడ్డపై అద్భుత విజయాన్ని అందుకున్నారు. 2021 ఆగస్టు 16న అందించిన ఆ అద్వితీయ విజయానికి నేటితో మూడేళ్లు నిండాయి. మరి ఆ సూపర్‌ విక్టరీ గురించి ఇప్పుడు మరోసారి వివరంగా తెలుసుకుందాం..

5 టెస్టుల సిరీస్‌ ఆడేందుకు కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియా ఇంగ్లండ్‌కు వెళ్లింది. ఇంగ్లండ్‌ను వాళ్ల దేశంలో టెస్ట్‌ మ్యాచ్‌లో ఓడించడం అంటే సాధారణ విషయం కాదు.. ఈ క్రమంలోనే జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఇక లార్డ్స్‌ వేదికగా రెండో టెస్టు ప్రారంభం అయింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ అదిరిపోయే ఆరంభం అందించారు. తొలి వికెట్‌కు 126 పరుగులు జోడించారు. రోహిత్‌ శర్మ 83 పరుగులు చేసి కొద్దిలో సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. రాహుల్‌ 129 పరుగులు చేసి అదరగొట్టాడు. పుజరా 9 రన్స్‌ మాత్రమే చేసి నిరాశపర్చినా.. కెప్టెన్‌ కోహ్లీ 42 రన్స్‌ చేసి పర్వాలేదనిపించాడు. ఇక చివర్లో పంత్‌ 37, జేడజా 40 పరుగులు చేయడంతో టీమిండియా 364 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.

3 years of destruction of Kohli Sena!

బదులుగా ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులు చేసింది. కెప్టెన్‌ జో రూట్‌ 180 పరుగులు చేసి ఇంగ్లండ్‌కు చిన్న లీడ్‌ అందించాడు. ఇక సెకండ్‌ ఇన్నింగ్స్‌లో టీమిండియా.. 8 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసి.. ఇన్నింగ్స్‌ను డిక్టేర్‌ చేసి డేరింగ్‌ డిసిషన్‌ తీసుకుంది. డూ ఆర్‌ డై నినాదంతో.. గెలవాలి లేదా ఓడాలి అంటూ ఆ డేరింగ్‌ స్టెప్‌ తీసుకుంది. ఇక ఆట చివరి రోజు రెండు సెషన్స్‌ మిగిలి ఉన్నాయి. టీమిండియా చేతుల్లో 60 ఓవర్లు ఉన్నాయి. ఇంగ్లండ్‌కు 10 వికెట్లు చేతిలో ఉన్నాయి.. టార్గెట్‌ 272. 60 ఓవర్లలో వన్డే తరహా బ్యాటింగ్‌ చేసి.. 272 చేస్తే ఇంగ్లండ్‌ గెలుస్తుంది. అదే 60 ఓవర్లలో ఇంగ్లండ్‌ను 271 పరుగుల లోపల ఆలౌట్‌ చేస్తే టీమిండియా చరిత్ర సృష్టిస్తుంది. ఇలాంటి పరిస్థితిల్లో.. టీమిండియా బౌలింగ్‌కు దిగేముందు.. ఇషాంత్‌ శర్మ, జస్ప్రీత్‌ బుమ్రా, మొహమ్మద్‌ షమీ, మొహమ్మద్‌ సిరాజ్‌ పేస్‌ దళానికి కోహ్లీ చెప్పిన మాట ఒక్కటే.. ‘ఈ 60 ఓవర్లు వాళ్లు నరకం చూడాలి’.

కెప్టెన్‌ చెప్పిన మాటతో టీమిండియా బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్‌ చేశారు. వారికి టీమ్‌ నుంచి ఫీల్డింగ్‌ పరంగా సూపర్‌ సపోర్ట్‌ కూడా లభించింది. మధ్య మధ్యలో కోహ్లీ మార్క్‌ స్లెడ్జింగ్‌ కూడా ఇంగ్లండ్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. భారత బౌలర్ల దెబ్బకు ఇంగ్లండ్‌ బ్యాటర్లు వణికిపోయారు. ఓపెనర్లిద్దరూ డకౌట్‌. వారితో పాటు మరో ముగ్గురు సున్నా పరుగులకే పెవిలియన్‌ చేరారు. ఏకంగా 8 మంది బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే అవుట్‌ అయ్యారు. కెప్టెన్‌ రూట్‌ 33 రన్స్‌తో ఇంగ్లండ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా ఏ బ్యాటర్‌ కూడా 26 పరుగుల మార్క్‌ను అందుకోలేకపోయారు. బుమ్రా 3, సిరాజ్‌4, షమీ 1, ఇషాంత్‌ శర్మ 2 వికెట్లతో.. ఇంగ్లండ్‌కు.. ఇంగ్లండ్‌లోనే పోయించారు. భారత బౌలర్లు సృష్టించిన విధ్వంసంతో.. టీమిండియా అపూర్వ విజయం అందుకోవడమే కాదు.. 5 టెస్టుల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. మరి మూడేళ్ల క్రితం లార్డ్స్‌లో భారత్‌ సృష్టించిన చరిత్రపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.