సెంచరీ దిశగా టమాట ధర.. ఒక్కసారిగా పెరగడానికి కారణమేంటంటే!

సెంచరీ దిశగా టమాట ధర.. ఒక్కసారిగా పెరగడానికి కారణమేంటంటే!

వానాకాలం ప్రారంభం అయ్యింది అంటే.. కూరగాయ ధరలు కొండెక్కుతాయి. మరీ ముఖ్యంగా టమాట, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వంటి కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతాయి. కారణం.. వర్షాకాలం ప్రారంభం కావడంతో.. కూరగాయల పంటలు ఉండవు. దాంతో ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల వరకు టమాటా ధర కిలో 10, 20 రూపాయలు ఉండగా.. సడెన్‌గా గత వారం నుంచి అమాంతం పెరిగింది. ప్రస్తుతం కిలో టమాటా ధర 70 రూపాయలు ఉండగా.. త్వరలోనే.. కిలో టమాట 100 రూపాయలకు చేరనుంది అని సమాచారం. మరి టమాట ధర సెంచరీ చేరుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే…

ఈ నెల మొదటి వారంలో రూ. 15 నుంచి రూ. 20 మధ్య ఉన్న కిలో టమాట ధర.. ఈ వారం ఏకంగా రూ. 60 వరకు చేరుకుంది. ఇక తాజాగా అయితే కిలో టమాట ఏకంగా రూ. 80కి చేరుకుంది. దీంతో కొనుగోలుదారులు టమాట కొనాలి అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఇదిలా ఉంటే రానున్న రోజుల్లోనూ టమాట ధరలు పెరగడమే తప్ప తగ్గే అవకాశం లేదని అంచాన వేస్తున్నారు. త్వరలోనే కేజీ టమాట రూ. 100 దాటడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఒక్కసారిగా టమాట ధర ఇంతల పెరగడానికి కారణం డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడం వల్లనే అంటున్నారు. మార్కెట్‌లో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడం వల్లే.. ఒక్కసారిగా టమాట ధరలు పెరగడానికి కారణంగా తెలుస్తోంది. అయితే.. గత నెలలో మాత్రం టమాట ధరల పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. టమాట ధర చాలా తక్కువగా ఉంది. దీంతో రైతులు మార్కెట్లలోనే టమాటను పారబోసి నిరసన వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఒక్కసారిగా పరిస్థితులు మారిపోవడం గమనార్హం.

ఇదిలా ఉంటే కేవలం టమాట మాత్రమే కాకుండా ఇతర కూరగాయల ధరలు కూడా ఒక్కసారిగా పెరిగాయి. చిక్కుడు కాయ కిలో ఏకంగా రూ. 90 పలకడం గమనార్హం. కర్నూలులో తాజాగా కిలో టమాట రూ. 80 పలకగా, చిక్కుడు రూ. 90 పలికింది. అలానే పచ్చిమిర్చి ధర కూడా మండిపోతోంది.

Show comments