Idream media
Idream media
పర్యాటక సొబగుల నగరి విశాఖ. ప్రకృతి అందాలకు కొదవ లేదు. సముద్ర సౌందర్యం మహాద్భుతం. ఇప్పుడా అద్భుతంలో మరో మణిహారం చేరనుంది. అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ నిర్మాణానికి ముందడుగు పడింది. అంతర్జాతీయ పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రతి మేజర్ పోర్టులో క్రూయిజ్ టెర్మినల్ ఏర్పాటు చేయాలని మూడేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు దేశంలోని వివిధ ప్రధాన పోర్టుల్లో క్రూయిజ్ టెర్మినళ్లను పట్టాలెక్కిస్తోంది. దీనిలో భాగంగా విశాఖలో గతేడాది క్రూయిజ్ ప్రాజెక్టు తెరపైకి వచ్చింది.
ప్రపంచంలో అందాలన్నీ ఓచోట చేరిస్తే విశాఖగా మారిందన్నట్లుగా.. దేశానికి వచ్చే ప్రతి 10 మంది పర్యాటకుల్లో ముగ్గురు ఈ నగరాన్ని సందర్శిస్తుంటారు. విదేశీ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న విశాఖ నగరం.. మరింత ఆకర్షణీయంగా మారేందుకు క్రూయిజ్ టెర్మినల్ దోహదపడనుంది. అంతర్జాతీయ పర్యాటకులు పెరగాలంటే విహారనౌకల రాకపోకలు జరగాల్సిందే. దేశంలో ఇప్పటికే ముంబయి, కొచ్చి, చెన్నై, మంగుళూరు పోర్టుల్లో క్రూయిజ్ టెర్మినల్స్ ఏర్పాటయ్యాయి. అక్కడ నుంచి నౌకలు రాకపోకలు సాగిస్తుండటంతో అక్కడ టూరిజం బాగా వృద్ధి చెందింది. విశాఖలోనే అదే రీతిలో అభివృద్ధి చేసేందుకు విశాఖ పోర్టు ట్రస్టు అడుగులు వేసింది.
180 మీటర్ల పొడవైన బెర్త్
అంతర్జాతీయ పర్యాటకులు క్రూయిజ్లో వచ్చి.. నగరంలో పర్యటించే విధంగా వివిధ ఏర్పాట్లు చేయనున్నారు. టెర్మినల్ నిర్మాణంలో అనేక సౌకర్యాలు కల్పించనున్నారు. 10 ఎకరాల విస్తీర్ణంలో దీని నిర్మాణం జరగనుంది. 180 మీటర్ల పొడవైన క్రూయిజ్ బెర్త్ నిర్మించనున్నారు. ఈ విశాలమైన బెర్త్ను రెండు విధాలుగా వినియోగించుకోనున్నారు. క్రూయిజ్ రాని సమయంలో సరకు రవాణా చేసే కార్గో నౌకలను కూడా బెర్త్పైకి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. క్రూయిజ్లో వచ్చే ఇంటర్నేషనల్ టూరిస్టుల చెకింగ్ కోసం ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ కార్యాలయాలతో పాటు పర్యాటకులు సేదతీరేందుకు పర్యాటక భవన్ను నిర్మిస్తున్నారు. దీనికి తోడుగా పరిపాలన భవనం, కరెన్సీ మారి్పడి కౌంటర్లు, విశ్రాంతి గదులు, టూరిజం ఆపరేటర్స్ కౌంటర్లు కూడా నిర్మాణం కానున్నాయి. త్వరలోనే పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
2021 నాటికి అందుబాటులోకి వచ్చేలా…
తూర్పు తీరంలో ఎక్కడా క్రూయిజ్ టెర్మినల్స్ లేవు. కోస్తా తీరంలో కీలక పర్యాటక స్థావరమైన విశాఖలో ఏర్పాటైతే పర్యాటకం పరుగులు పెట్టనుంది. ఈ మేరకు దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధమయ్యాయి. విశాఖపట్నం పోర్టు ట్రస్టు ఎంట్రన్స్ చానెల్, కంటైనర్ టెర్మినల్ మధ్యలోని జనరల్ బెర్త్ పక్కనే ఈ టెర్మినల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి రూ.77 కోట్లు ఖర్చవుతుందని నిర్ధారించారు. ఇందులో 50 శాతం నిధులను కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ, మరో 50 శాతం టూరిజం శాఖ కేటాయించనుంది. దీనికి సంబంధించి ఎని్వరాన్మెంటల్ ఇంపాక్ట్ ఎసెస్మెంట్(ఈఐఏ)కూడా పూర్తయ్యాయి. అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేందుకు పోర్టులో క్రూయిజ్ టెర్మినల్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. మరికొద్ది నెలల్లో దీనికి సంబంధించిన పరిపాలన భవనం సిద్ధం కానుంది. 2021 చివరికల్లా అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ అందుబాటులోకి వచ్చేలా విశాఖ పోర్టు కృషి చేస్తోంది.