iDreamPost
iDreamPost
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని శుక్ర, శనివారాల్లో వైఎస్సార్సీపీ నిర్వహిస్తోన్న ప్లీనరీకి, పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలి వస్తున్నారు. ప్లీనరీ మొదటి రోజున వైఎస్సార్సీపీ కార్యకర్తలు వెయ్యికార్లతో భారీ ర్యాలీగా తరలిస్తుంటే చూస్తున్నవారికి గూస్ బంప్స్ వచ్చాయి. ఎటు చూసినా కార్యకర్తల కోలాహలమే. వైఎస్సార్సీపీ నినాదాలు, జండాలే. గుంటూరు-విజయవాడ జాతీయ రహదారి అభిమాన సంద్రమైంది. ఎంత సేపు చూసినా ర్యాలీ కదులుతూనే ఉంది.
అధికారపార్టీగా తొలి ప్లీనరీ కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పార్టీ అధ్యక్షునిగా, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరు పేరునా లేఖ రాయడంతో పార్టీ వార్డు సభ్యులు మొదలు ప్రజాప్రతినిధుల వరకు వేలాది మంది తొలి రోజు సభకు కదలివస్తున్నారు.
2017 జూలై 8-9న రెండో ప్లీనరీ నిర్వహించిన నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగానే మూడో ప్లీనరీని సర్వం సిద్ధమైంది. ప్లీనరీ ప్రాంగణానికి మహానేత వైఎస్సార్ ప్రాంగణంగా నామకరణం చేశారు.
డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గురువారం ప్లీనరీ భద్రతా ఎర్పాట్లను పర్యవేక్షించారు. ఈ మేరకు దాదాపు 3,500 మంది పోలీసులను నియమించారు. ప్లీనరీలో కార్యకర్త నుంచి అధ్యక్షుడి వరకు అందరికీ ఒకటే మెనూ. అందరికీ టిఫిన్లు, భోజనాలు, స్నాక్స్ అందించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తయ్యాయి.