iDreamPost
android-app
ios-app

గ్రేట‌ర్ లో సిటీ బ‌స్సుల‌కు కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్‌?

గ్రేట‌ర్ లో సిటీ బ‌స్సుల‌కు కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్‌?

ప్ర‌జా ర‌వాణాలో కీల‌క‌మైన ఆర్టీసీ సిటీ బ‌స్సులు లేక అవ‌స్థ‌లు ప‌డుతున్న గ్రేట‌ర్ వాసుల‌కు శుభ‌వార్త‌. అతి త్వ‌ర‌లో బ‌స్సులు రోడ్డెక్క‌నున్నాయి. ఇప్ప‌టికే శివారు ప్రాంతాల్లో బ‌స్సు స‌ర్వీసులు ప్రారంభ‌మ‌య్యాయి. దీంతో న‌గ‌రంలోనూ బ‌స్సులు తిప్పేందుకు ప్ర‌భుత్వం స‌న్న‌ద్ధం అవుతోంది. క‌రోనా వైర‌స్ సృష్టించిన లాక్‌డౌన్ తో హైదరాబాద్‌ సిటీలో ఆర్టీసీ బస్సులు మూతపడ్డాయి. మార్చి నుంచి ఇప్పటి వరకు బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. మ‌హ‌మ్మారి విజృంభ‌ణ‌తో బ‌స్సుల రాక‌పోక‌లు వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. అయితే ఇటీవ‌ల‌ జిల్లాల్లో కేసుల సంఖ్య కొంత మేర తగ్గడం, ప్రజా రవాణకు తీవ్ర ఇబ్బందులు ఎదురుకావడంతో రాజధాని నుంచి జిల్లా సర్వీసులను ప్రభుత్వం గతంలో ప్రారంభించింది. అయితే గ్రేటర్‌లో కరోనా విజృంభణ అదుపులోకి రాకపోవడం ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేపోయింది. ఈ క్రమంలోనే గతవారం రోజులుగా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం, కోలుకునే వారిసంఖ్య పెరగడంతో గ్రేటర్‌లో ఆర్టీసీ సర్వీసులను నడపాలని ప్రభుత్వం భావిస్తోంది.

బ‌స్సుల‌ను న‌డ‌పండి..

హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో మెట్రో సేవ‌లు ఇప్ప‌టికే ప్రారంభ‌మ‌య్యాయి. అంచ‌లంచెలుగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో ప్రజల అవసరాలు దృష్టిలో ఉంచుకుని గ్రేటర్‌ పరిధిలో బస్సులను నడపాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ప్రగతి భవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో సీఎం కేసీఆర్‌ నిర్వహించిన భేటీలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. మెట్రో సేవలు సైతం ఇప్పటికే ప్రారంభం అయ్యాయని, ఇక ఆర్టీసీని కూడా రోడ్డు ఎక్కించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞ‌ప్తి మేర‌కు బ‌స్సులు న‌డిపేందుకు కేసీఆర్ కూడా సుముఖంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై త్వ‌ర‌లోనే అధికారికంగా నిర్ణ‌యం ప్రక‌టించ‌నున్నారు.

శివారు గ్రామాలకు ప‌రుగులు

సుదీర్ఘ కాలం త‌ర్వాత నగరానికి సమీపంలో ఉన్న ఊళ్లకు తిప్పే బస్సులను బుధవారం తిరిగి ప్రారంభించింది. ఆర్టీసీ రోజువారీ ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో ఈ నిర్ణ‌యం తీసుకుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉండే రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ డిపోల్లో బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో సిటీ బస్సులకు అనుమతి లేకపోవటంతో జిల్లా సర్వీసులను తిప్పుతున్న సంగతి తెలిసిందే. నగరానికి చేరువగా ఉన్న గ్రామాలకు సిటీ డిపోల నుంచి తిరిగే బస్సులను కూడా జిల్లా సర్వీసులుగానే పరిగణిస్తూ బుధవారం ఉదయం నుంచి తిప్పటం ప్రారంభించారు. నగరంలోని 18డిపోల నుంచి 230 సర్వీసులు ప్రారంభించారు. నగరానికి 50 నుంచి 60 కి.మీ. పరిధిలో ఉన్న కొన్ని గ్రామాలకు ఇవి తిరుగుతాయి. వీటి రూపంలో రోజుకు రూ.25 లక్షల వరకు ఆదాయం సమకూరుతుందని ఆర్టీసీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం జిల్లా సర్వీసుల ద్వారా వస్తున్న రూ.4 కోట్ల రోజువారీ ఆదాయానికి ఇది తోడై కొంత ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.