Idream media
Idream media
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 2020 అంతా దాదాపు హైదరాబాద్ లోనే గడిపారు. దాదాపు 8 నెలల తర్వాత పూర్తి స్థాయిలో ప్రజల మధ్యకు వచ్చారు. మే నెలలో జరిగిన విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 14 మంది చనిపోవడంతో బాధిత కుటుంబాలను పరామర్శిస్తానని ప్రకటించిన బాబు అక్కడికి కూడా వెళ్లలేదు. విజయవాడలో జరిగిన మహానాడుకు హాజరై మళ్లీ హైదరాబాద్ వెళ్లిపోయారు. చాన్నాళ్ల తర్వాత పార్టీ అధినేత రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు భారీగా వస్తారని చాలా మంది భావించారు. విజయనగరం జిల్లా రామతీర్థం యాత్రకు ఆశించిన స్థాయిలో జనాలు రాలేదు. సరికదా.. హడావిడి చేసిన ఆ కొద్ది మందిని కూడా జిల్లా నేతలు డబ్బులిచ్చి మరీ తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆ పార్టీ నేతల పరువు రామతీర్థంలో కొట్టుకుపోయినట్లయింది.
ఆ వీడియోలో ఏముందంటే…
మనిషికి ఐదేసి వందల రూపాయలు ఇచ్చారు…
ఐదేసి వందలు తెచ్చి మీరు మందు తాగుతున్నారా..?
తాగకపోతే ఎలాగ..?
మీటింగ్కి వెళ్లిన వారందరికీ ఐదేసి వందల రూపాయలు చొప్పున ఇచ్చారా?
అవునండి..
మీ ఊరు వాళ్లకిచ్చారా..?
మా ఊరు వాళ్లకి కూడా ఇచ్చారు.
అందరికీ ఇచ్చారా?
ఆ…ఇచ్చారు.
ఇవి ఎవరిచ్చారు?
కర్రియ్య, చిన్న వచ్చాడా…
ఆ వచ్చాడు.
ఎక్కడికి వెళ్లి వస్తున్నారు?
రామతీర్థానికి..
ఇదీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మద్యం దుకాణం వద్ద టీడీపీ కార్యకర్తల సంభాషణ. విజయనగరం జిల్లా రామతీర్థంలో చంద్రబాబు వెనుక తిరిగిన జనాల అసలు గుట్టు ఇలా వీడియో రూపంలో బయటపడింది. రామతీర్థంలో రాముడి విగ్రహంపై దాడిని రాజకీయం చేసేందుకు టీడీపీ ఆడిన హైడ్రామాలో మన జిల్లా నేతలు కీలక పాత్ర పోషించారు. ఇక్కడి నుంచి కూడా జనాలను తరలించారు. వాళ్లకి డబ్బులిచ్చి తరలించారనేది తాజాగా వీడియో రూపంలో వెలుగులోకి వచ్చింది.
చంద్రబాబు పర్యటనకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున జనాలను టీడీపీ నేతలు తరలించారు. వారందరికీ ఇలాగే డబ్బులిచ్చి తరలించారనే ఆరోపణలు వచ్చాయి. శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, టెక్కలి, పలాస, ఎచ్చెర్ల, రాజాం, పాలకొండ, ఆమదాలవలస నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జనాలను తీసుకెళ్లినట్లు సమాచారం. తమకి రూ.500 ఇచ్చారని, అందుకే రామతీర్థం వచ్చామని, పచ్చ టీ షర్ట్లు ధరించిన వ్యక్తులు చెప్పడం సంచలనమైంది. విగ్రహాల ముసుగులో చేస్తున్న రాజకీయానికి, దేవుడి పేరుతో చేస్తున్న ఆందోళనకు డబ్బులిచ్చి జనాలు తరలించడంపై జనం కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆధ్మాత్మిక స్థలమైన రామతీర్థం బోడికొండపైకి చంద్రబాబు చెప్పులు వేసుకుని వెళ్లడంపై కూడా పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్నాయి.
సుదీర్ఘ కాలం తర్వాత ఓ కార్యక్రమం పేరుతో రోడ్డుపైకి వచ్చిన చంద్రబాబుకు మద్దతుగా ఆశించిన స్థాయిలో జనం రాకపోవగా.. అక్కడున్న వారిని కూడా డబ్బులిచ్చి తీసుకొచ్చిన విషయం బహిర్గతం కావడం టీడీపీ వర్గాలను అయోమయానికి గురి చేస్తోంది.