ఏడాది క్రితం వివాహం.. భార్యను పంట కాల్వ వద్దకు తీసుకెళ్లి..!

దాంపత్య జీవితంలో కలహాలు అనేవి సర్వ సాధారణం. చాలామంది గొడవలు పడినా కూడా వెంటనే కలిసిపోతారు. ఒకల్లు కోపంగా మాట్లాడినా మరొకరు సర్దుకుపోతుంటారు. కానీ, ఈ భర్త మాత్రం అలాంటి వ్యక్తి కాదులెండి. పెళ్లే ఏడాది మాత్రమే అయింది. అప్పుడే భార్యతో గొడవలు మొదలు అయ్యాయి. ఆ గొడవలతో భార్యపై పీకలదాకా కోపం పెంచుకున్నాడు. ఆమెను నమ్మించి కాల్వ దగ్గరకు తీసుకెళ్లి అతి కిరాతకంగా హత్య చేశాడు.

ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అబ్ధుల్ జామెర్(28), సాజిదా బేగం(21)లకు ఏడాది క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో జామెర్ పట్టుబట్టి కావాల్సినంత కట్నం డిమాండ్ చేసి తీసుకున్నాడు. అడిగినంత కట్నం ఇచ్చారు కాబట్టి తమ కుమార్తెను బాగా చూసుకుంటాడు అనుకున్నారు. కానీ, జామెర్ భార్యతో గొడవలు పడటం మొదలు పెట్టాడు. పెళ్లైన ఏడాదికే వారి మధ్య గొడవలు ముదిరిపోయాయి.

దాంతో సాజిదాని చంపేయాలని జామెర్ నిర్ణయం తీసుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆమె హత్యకు పథకం రచించాడు. సోమవారం ఉదయం భార్యను బస్సు ఎక్కించినట్లు అత్తకు ఫోన్ చేసి చెప్పాడు. భార్యకేమో పంట కాల్వలలో స్నానం చేసి వద్దాం అంటూ చెప్పాడు. కూతురు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో తల్లి ఆమె ఫోన్ కు ఫోన్ చేసింది. కానీ, ఎలాంటి సమాధానం లేదు. వెంటనే తల్లికి అల్లుడిపై అనుమానం వచ్చింది. కోరుట్ల పోలీస్ స్టేషన్ లో కుమార్తె కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు.

ముందుగా పోలీసులు కోరుట్ల బస్టాండ్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. జామెర్, సాజిదా వచ్చినట్లు ఎక్కడా కనిపించలేదు. భర్తపై అనుమానంతో విచారణ చేయగా హత్య విషయం వెలుగు చూసింది. స్నానం చేద్దామని చెప్పి కథలాపూర్ పంట కాల్వలలో తోసేసి హత్య చేసినట్లు జామెర్ అంగీకరించాడు. పంటకాల్వ నుంచి సాజిదాబేగం మృతదేహాన్ని వెలికితీశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Show comments