మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తోన్న సినిమా ‘ఉప్పెన’. గత ఏప్రిల్లోనే ఈ సినిమా విడుదల కావాల్సి వున్నా, ‘కరోనా కాటు’ కారణంగా సినిమా విడుదల కాలేకపోయింది. త్వరలో ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేస్తారన్న ప్రచారం జరుగుతుండగా, చిత్ర దర్శక నిర్మాతలు మాత్రం ఆ ప్రచారంలో నిజం లేదని తేల్చేస్తుండడం గమనార్హం. ఇదిలా వుంటే, ఈ సినిమాకి ‘మెగా పవర్’ సాయం అందబోతోందన్నది తాజా ఖబర్. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా కోసం కొంత వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోపక్క, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా కోసం తనవంతు సాయం చేయబోతున్నాడనీ, అదీ వాయిస్ ఓవర్ లాంటిదేనని అంటున్నారు. అంతేనా.? ఇంకేమన్నా వుందా.! అంటే, పంజా వైష్ణవ్ తేజ్ తెరంగేట్రం చేస్తున్న సినిమా కావడం, ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ బజ్ వుండడంతో.. అవసరమైతే మెగా కాంపౌండ్కి సంబంధించిన హీరోలంతా ప్రమోషన్ కోసం తమవంతు సాయం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాగా, వైష్ణవ్ తేజ్ మూవీని ప్రమోట్ చేసేందుకోసం ఓ ప్రమోషనల్ సాంగ్ని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ప్లాన్ చేస్తున్నాడనీ, దానికోసం మెగాస్టార్ సహా, మెగా కాంపౌండ్ హీరోలంతా సిద్ధమవుతున్నారనీ టాలీవుడ్ సర్కిల్స్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. ఈ ప్రచారంలో నిజమెంతోగానీ.. వర్కవుట్ అయితే, అదో పెద్ద సెన్సేషన్ అవుతుందన్నది నిస్సందేహం.