iDreamPost
android-app
ios-app

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఇంట్లో విషాదం, సాగర్ కాలువలో ప్రమాదం

  • Published Jan 12, 2022 | 2:20 AM Updated Updated Mar 11, 2022 | 10:24 PM
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఇంట్లో విషాదం, సాగర్ కాలువలో ప్రమాదం

గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంట్లో విషాదం అలుముకుంది.దుర్గి మండలం అడిగొప్పుల వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఆయన సమీప బంధువులు నీటిలో చిక్కుకున్నారు. గుంటూరు నుంచి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి నాగార్జున సాగర్ కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో ఉన్న ఎమ్మెల్యే సోదరుడు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. కానీ ఆయన భార్య, కుమార్తె గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చేపట్టారు. రాత్రంతా వెదికినా ఆచూకీ దొరకలేదు. చివరకు ఉదయం మృతదేహాలు లభించినట్టు చెబుతున్నారు.

మృతులిద్దరూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సమీప బంధువులు. ఆర్కే కి సొంత బాబాయ్‌ సుందరరామిరెడ్డి కుమారుడయిన మదన్ మోహన్‌రెడ్డి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.కానీ ఆయన భార్య, కుమార్తె మాత్రం ప్రాణాలు కోల్పోయారు.

గుంటూరు నుంచి మాచర్ల వస్తుండగా కారు అదుపు తప్పి సాగర్ కుడికాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే కొందరు స్పందించారు. స్థానికుల చొరవతో కారు అద్దాలు పగులగొట్టి మదన్‌మోహన్‌రెడ్డి బయటకు రాగలిగారు. కానీ కారులో చిక్కుకుపోవడంతో మిగిలిన ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం దక్కలేదు.

ఈ ప్రమాద విషయం తెలుసుకున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు, గజఈతగాళ్లతో గాలింపు సాగించారు. మరోవైపు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటనపై విచారణ చేపట్టారు.

Also Read:మాచర్ల మాజీ ఎమ్మెల్యే మృతి

ఈ ప్రమాదం ఆర్కే కుటుంబంతో పాటుగా మాచర్లలో విషాదం నింపింది. పిన్నెల్లి బాబాయి సుందరరామిరెడ్డికి రాజకీయంగా మంచి గుర్తింపు లభించింది. పిన్నెల్లి కుటుంబ రాజకీయానికి సుందరరామిరెడ్డి ఆద్యుడు. సుందర రామిరెడ్డి 1994 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరుపున పోటీ చేసి ఓడిపోయారు.నక్సల్ కాల్పుల్లో సుందరరామిరెడ్డి మరణించారు.కానీ ఆయన హత్యలో రాజకీయ ప్రత్యర్థుల పాత్ర ఉందని ప్రచారం జరిగింది.

సుందర రామిరెడ్డి వారసుడిగా రాజకీయం నడిపిన ఆయన సోదరుడు పిన్నెల్లి లక్ష్మారెడ్డి 1999లో ఓడిపోయి 2004లో గెలిచాడు. ఆ తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏకంగా నాలుగు సార్లు వరుస విజయాలతో రికార్డు సృష్టించారు. మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలోనే అరుదైన ఘనత ఆర్కే దక్కించుకున్నారు.

అయితే ఇప్పుడు సుందరరామిరెడ్డి కుటుంబంలో ఇద్దరిని కోల్పోవాల్సి రావడం పిన్నెల్లి కుటుంబంలో విషాద ఛాయలకు కారణమయ్యింది. మాచర్ల నియోజకవర్గం వ్యాప్తంగా ఆర్కే అభిమానులు ఈ ప్రమాదం పట్ల తీవ్ర మనోవేదనను వ్యక్తం చేస్తున్నారు.

Also Read: మాచర్ల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌గా జూలకంటి బ్రహ్మారెడ్డి