iDreamPost
iDreamPost
ఓవైపు వరుసగా సర్వేలన్నీ బీజేపీ విజయాన్ని సూచిస్తున్నాయి. ఏబీపీ, టైమ్స్ నౌ కూడా కమల వికాసం ఖాయంగా చెబుతున్నాయి. కానీ పరిస్థితి దానికి భిన్నంగా కనిపిస్తోంది. అఖిలేష్ యాదవ్ సభలకు అనూహ్యంగా ప్రజలు తరలివస్తున్నారు. ఇప్పుడు ప్రజలతో పాటుగా కీలక బీజేపీ నేతలు కూడా ఫిరాయిస్తున్నారు. బీజేపీకి ఆయువుపట్టు లాంటి ఎంబీసీ నేతలు గోడదూకడం కలవరపెడుతోంది. స్వామి ప్రసాద్ మౌర్య వంటి మంత్రి తో పాటుగా నలుగురు ఎమ్మెల్యేలు నేరుగా సమాజ్ వాదీ పార్టీకి జై కొట్టడం చర్చనీయాంశం అవుతోంది. అదే సమయంలో మోదీ- యోగీ సంబంధాల చుట్టూ యూపీలో కీలక చర్చ సాగుతోంది.
యూపీలో బీజేపీ గెలుపులో కుల సమీకరణాలు కీలకం
సహజంగా బ్రాహ్మణ- ఠాకూర్ల కలయికతో బీజేపీకి విజయం దక్కింది. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరుసగా మూడు ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలయ్యింది. కానీ చివరకు 14 ఏళ్ల తర్వాత ఆపార్టీకి విజయం దక్కడంతో ఠాకూర్ల కులానికి చెందిన యోగి ఆదిత్యనాథ్ దాస్ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి బ్రాహ్మణులు అసంతృప్తితో దూరం కావడం మొదలయ్యింది. ఠాకూర్ల ఆధిపత్యాన్ని సహించలేక బీజేపీకి పునాదిగా ఉన్న బ్రాహ్మణుల్లో వ్యతిరేకత ఆరంభమయ్యింది. దానిని సరిదిద్దేందుకు ఓపీ శర్మ వంటి నాయకులను ఉప ముఖ్యమంత్రిగా నియమించాలని మోదీ, షా తలంచారు. కానీ యోగీ అంగీకరించకపోవడంతో ఆ ప్రతిపాదన వెనక్కిపోయింది. కాంగ్రెస్ నుంచి జితిన్ ప్రసాద్ వంటి వారిని ఆకర్షించినా బ్రాహ్మణుల్లో అసంతృప్తి చల్లారడం లేదు.
అదే సమయంలో నాన్ యాదవ బీసీల మద్ధతు బీజేపీకి బాగా ఉపయోగపడుతోంది. వరుసగా 2014 , 19 పార్లమెంట్ ఎన్నికలతో పాటుగా 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలుపులో మోస్ట్ బ్యాక్ వర్డ్ క్యాస్ట్స్ మద్ధతు కీలకంగా కనిపించింది. ఎంబీసీల అండతో బీజేపీ భారీ విజయాలు నమోదు చేసింది. కానీ ఈసారి ఎంబీసీలు ఆపార్టీకి దూరమవుతున్నారు. ఇప్పటికే రాజబర్లు సహా వివిధ ఎంబీసీ కులాలకు ప్రాతినిథ్యం వహించే పార్టీలను సమాజ్ వాదీ పార్టీ ఆకర్షించింది. తాజాగా యూపీ కార్మిక మంత్రిగా పనిచేసిన స్వామి ప్రసాద్ మౌర్య కూడా కమలానికి గుడ్ బై చెప్పడం కీలక పరిణామం అవుతోంది. ఓవైపు బ్రాహ్మణులు యోగీ పట్ల వ్యతిరేకంగా ఉన్న తరుణంలో ఎంబీసీలు కూడా బీజేపీకి దూరమవుతుండడం యూపీ బీజేపీకి గడ్డుపరిస్థితిని తీసుకొచ్చేలా కనిపిస్తోంది.
Also Read : యోగి సర్కారుకు మంత్రి, నలుగురు ఎమ్మెల్యేలు గుడ్ బై -ఎన్నికల ముంగిట బీజేపీకి గట్టి దెబ్బ
సర్వేలు, అంచనాలు ఎలా ఉన్నప్పటికీ కుల సమీకరణాల్లో బీజేపీ వెనుకబడుతోంది. అదే సమయంలో బీజేపీ వ్యతిరేకులు, యోగీ నాయకత్వాన్ని తిరస్కరిస్తున్న వారంతా ఇప్పుడు అఖిలేష్ యాదవ్ వైపు సమీకృతమవుతుండడం మరో కీలకాంశం. బీఎస్పీ బలహీనపడడం కూడా బీజేపీని ప్రభావితం చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలితే అది బీజేపీకి మేలు చేసేందుకు దోహదపడుతుంది. కానీ పరిస్థితి భిన్నంగా ఉంది. అఖిలేష్ కి అది బలంగా మారుతోంది. సరిగ్గా అదే సమయంలో మోదీ – యోగీ మధ్య విబేధాలున్నాయనే అంశం బీజేపీ శ్రేణుల్లో విభజనకు దారితీస్తోంది. యోగీ మరోసారి గెలిస్తే ప్రధాన మంత్రి పదవికి పోటీగా వస్తారని మోదీ అనుమానిస్తున్నట్టు బీజేపీ శ్రేణుల్లోనే ప్రచారం సాగుతోంది. అదే సమయంలో మోదీ మూలంగా తన సీఎం సీటుకి ఎసరుపెట్టే ప్రమాదం ఉందని యోగీ అంచనా వేస్తున్నట్టు భావిస్తున్నారు.
ఇటీవల బ్రాహ్మణ ఓపీ శర్మను ప్రోత్సహించడం వెనుక అదే కారణమని యోగి ఉద్దేశంగా కనిపిస్తోంది. శర్మ గతంలో మోదీ సీఎంగా ఉన్న సమయంలో గుజరాత్ లో పనిచేసిన సివిల్స్ అధికారి. యూపీకి చెందిన ఆయన్ని రాజకీయాల్లో దింపి కీలక ప్రాధాన్యతనిచ్చేందుకు మోదీ ప్రయత్నించడం యోగి అనుమానాలకు ఊతమిస్తోంది. ఓవైపు ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ దూకుడు మీదుండగా మరోవైపు కమలం నాయకత్వ విషయంలో సాగుతున్న చర్చ బీజేపీని రెండు శిబిరాలుగా మార్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంతర్గతంగా ఇలాంటి చర్చ సాగుతున్న తరుణంలో దానికి ముగింపు పలికేందుకు ఇటీవల యోగీ ఓ అడుగు వేసినట్టు కనిపిస్తోంది.
పంజాబ్ లో పీఎం పర్యటన సందర్భంగా జరిగిన పరిణామాల తర్వాత మోదీ భద్రత కోసమంటూ యోగి పూజలు నిర్వహించారు. తద్వారా తమ మధ్య విబేధాలు లేవని చాటేందుకు ఓ యత్నం చేసినట్టు కనిపిస్తోంది. అయితే క్షేత్రస్థాయి బీజేపీలో మాత్రం ప్రచారం భిన్నంగా ఉంది. ఏమయినా కీలకమైన ఎన్నికల సమయంలో యూపీ బీజేపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మంత్రి ప్రసాద్ మౌర్య కుమార్తె ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన బీజేపీని వీడడంతో ఏకంగా 20 అసెంబ్లీ నియోజకవర్గాల వరకూ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. గతంలో బీఎస్పీలో కీలకంగా వ్యవహరించి 2017 ఎన్నికలకు ముందు ఆయన బీజేపీలో చేరారు. ఇప్పుడు తాను బీజేపీని వీడుతూ ఎస్పీలో చేరుతున్నానంటే ఎవరు గెలుస్తున్నారో తెలుసుకోవచ్చని మౌర్య వ్యాఖ్యానించడం ఆసక్తికరం.
Also Read : యూపీ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్?