iDreamPost
android-app
ios-app

ఫోర్లు, సిక్సర్ల వర్షం! కేవలం 26 బంతుల్లోనే..

  • Published Oct 17, 2023 | 5:01 PM Updated Updated Oct 17, 2023 | 5:01 PM
  • Published Oct 17, 2023 | 5:01 PMUpdated Oct 17, 2023 | 5:01 PM
ఫోర్లు, సిక్సర్ల వర్షం! కేవలం 26 బంతుల్లోనే..

మోడ్రన్‌ క్రికెట్‌లో బౌలర్లను ఏమాత్రం గౌరవించడం లేదు బ్యాటర్లు. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లకు చేరుకున్నా, చేతిలో కావాల్సినన్ని వికెట్లు ఉన్నా.. విధ్వంసపు హిట్టింగ్‌తో బౌలర్లపై పడిపోతున్నారు. కొంతమంది అత్యుత్తమ బౌలర్లను మినహాయిస్తే.. డెత్‌ ఓవర్స్‌లో ఎన్ని వేరియేషన్స్‌ ఉన్నా బౌలర్‌ సైతం భారీగా పరుగులు సమర్పించుకోవాల్సిందే. అలా సాగుతోంది.. బ్యాటర్ల ఊచకోత. తాజాగా దేశవాళీ క్రికెట్‌లో ఓ బ్యాటర్‌ ఫోర్లు సిక్సర్ల వర్షం కురిపించాడు. ఓ వైపు సీనియర్‌ క్రికెటర్లు వరల్డ్‌ కప్‌లో దుమ్మురేపుతుంటే.. మరోవైపు ఫ్యూచర్‌ స్టార్లు.. దేశవాళీ టోర్నీ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో అదరగొడుతున్నారు. మంగళవారం రాంజీ వేదికగా ఆంధ్రా-పంజాబ్‌ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో.. పంజాబ్‌ బ్యాటర్‌ అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌ విధ్వంసం సృష్టించాడు. కేవలం 26 బంతుల్లోనే 6 ఫోర్లు, 9 సిక్సులతో ఆకాశామే హద్దుగా చెలరేగి 87 పరుగులు చేసి.. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.

ముఖ్యంగా.. ఆంధ్రా బౌలర్‌ హరిశంకర్‌ రెడ్డి వేసిన ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌లో తొలి మూడు బంతులను ఫోర్లుగా మలిచిన అన్‌మోల్‌.. నాలుగో బంతికి భారీ సిక్స్‌ బాదాడు. తర్వాత సింగిల్‌ తీసి.. అమన్‌దీప్‌ సింగ్‌కి బ్యాటింగ్‌ ఇచ్చాడు. తిరిగి 18వ ఓవర్‌ రెండో బంతి నుంచి అన్‌మోల్‌కు స్ట్రైక్‌ వచ్చింది. మళ్లీ అదే విధ్వంసం.. స్టీఫెన్‌ వేసిన ఆ ఓవర్‌లో రెండో బంతికి ఫోర్‌ బాది అన్‌మోల్‌.. తర్వాత మూడు బంతులకు మూడు భారీ సిక్సులు బాదాడు. ఇలా కేవలం 9 బంతుల్లోనే 41 రన్స్‌ చేసి.. చివరి ఓవర్లలో ఆంధ్రా బౌలర్లకు చుక్కలు చూపించాడు. మొత్తం మీద 26 బంతుల్లోనే 87 రన్స్‌ చేసి.. స్టీఫెన్‌ బౌలింగ్‌లో భరత్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు.

ఇక ఈ మ్యాచ్‌లో అన్‌మోల్‌ ప్రీత్‌సింగ్‌ కంటే ముందు.. మరో పంజాబ్‌ బ్యాటర్‌ అభిషేన్‌ శర్మ సెంచరీతో దుమ్ములేపాడు. 51 బంతుల్లోనే 9 ఫోర్లు, 9 సిక్సులతో 112 పరుగులు చేసి.. పంజాబ్‌కు అద్భుతమైన స్టార్ట్‌ ఇచ్చాడు. దీంతో అన్‌మోల్‌ కూడా రెచ్చిపోయి ఆడాడు. వీరిద్దరూ ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డంతో.. నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్‌ జట్టు 6 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. బదులుగా ఆంధ్రా జట్టు.. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఆంధ్రా బ్యాటర్లలో రిక్కీ 52 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సులతో 104 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతను తప్ప మిగతా బ్యాటర్లంతా విఫలం అవ్వడంతో.. ఆంధ్రా ఓడిపోయింది. మరి ఈ మ్యాచ్‌లో అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌ ఆడిన సంచలన ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: అరంగేట్ర మ్యాచ్ లోనే అద్భుతం.. 5 వికెట్లతో చెలరేగిన KKR బౌలర్