iDreamPost
android-app
ios-app

రేషన్‌ డోర్‌ డెలివరీకి ముహూర్తం ఖరారు : ఏపీ మంత్రి మండలి కీలక నిర్ణయాలు

రేషన్‌ డోర్‌ డెలివరీకి ముహూర్తం ఖరారు : ఏపీ మంత్రి మండలి కీలక నిర్ణయాలు

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలో ఈ రోజు సచివాలయంలో సమావేశమైన ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. పలు పథకాలకు ఆమోద ముద్ర వేసింది. ఆయా పథకాలు, కార్యక్రమాల అమలు తేదీలను నిర్ణయించింది. కొత్త ఏడాది ప్రారంభం నుంచి ఇంటికి రేషన్‌ బియ్యం సరఫరా చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. జనవరి నెల నుంచి వాహనాల ద్వారా వాలంటీర్ల సహకారంతో రేషన్‌ బియ్యం లబ్ధిదారులు ఇంటి వద్దకు వెళ్లి ఇవ్వనున్నారు.

కేబినెట్‌ నిర్ణయాలు ఇవే..

– ఈ నెలలోనే శాసన సభ సమావేశాల నిర్వహణకు ఆమోదం. తేదీలు త్వరలో ఖరారు.

– ఇసుక నూతన విధానానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇకపై సొంత వాహనాల ద్వారా కూడా ఇసుక తెచ్చుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే కాకుండా ఆఫ్‌లైన్‌లోనూ ఇసుకను పొందవచ్చు.

– స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో మరింత బలోపేతం. ప్రస్తుతం ఇసుక, మద్యం దీని పరిధిలో ఉండగా.. ఇకపై గుట్కా, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల నియంత్రణ చేపడుతుంది.

– వైద్య ఆరోగ్య శాఖ టీచింగ్‌ స్టాఫ్‌కు యూజీసీ స్కేల్‌ అమలుకు నిర్ణయం.

– విశాఖలో 150 ఎకరాల్లో ఆదాని టేడా సెంటర్‌కు కేంద్రం అంగీకారం.

– నవంబర్‌ 10 నుంచి మిగిలిన ఆరు జిల్లాల్లో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం వర్తింపు.

– మచిలీపట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మించేందుకు ఆమోదం. ఇందు కోసం 5,700 కోట్ల రూపాయల కేటాయింపు.

– ఈ నెల 24వ తేదీన జగనన్న తోడు పథకం ప్రారంభం. ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులకు వడ్డీ, పూచికత్తు లేకుండా పదివేల రుణం.

– 500 లీటర్లకు పైబడి పాలు ఉత్పత్తి చేసే 9 వేల గ్రామాల్లో మహిళల నేతృత్వంలో పాల సేకరణకు నిర్ణయం. ఆర్‌బీకేల ద్వారా పశువుల ధాణా సరఫరా.

– ఆక్వా కల్చర్‌ సీడ్‌ యాక్ట్‌–2020కు ఆమోదం.

– వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకానికి ఆమోదం. ఈ నెల 17వ తేదీన పథకం ప్రారంభం.

– ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో స్టేడియాలు నిర్మాణం.

– ఐదు ఏళ్లు శిక్ష పూర్తి చేసుకుని, 48 ఏళ్లకు పైబడి వయస్సు ఉన్న మహిళా ఖైదీల విడుదలకు నిర్ణయం.