iDreamPost
iDreamPost
సంక్రాంతి పండుగ వచ్చిందంటే ముందుగా గుర్తుకు వచ్చేవి కోడిపందేలు. భోగి మంటలు.. ముత్యాల ముగ్గులు.. డూడూ బసవన్నల ఆటలు.. హరిదాసు కీర్తనలు.. ఆడపడుచుల సంబరాలు.. ఇలా ఎంత సందడి ఉన్నా వీటి అన్నింట మధ్య పోటా పోటిగా జరిగే కోడిపందేలు ఉండాల్సిందే. ఈ ఏడాది ఒకవైపు కరోనా మహమ్మరి ఒమిక్రాన్ రూపంలో విజృంభిస్తుండడం… మరోవైపు హైకోర్టు నిషేదాజ్ఞలు… పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో పందేలు జరుగుతాయా? అనే సందిగ్ధత ఏర్పడింది. అయితే గోదావరి జిల్లా వాసులకు కోడిపందేలపై ఉన్న మమకారం… ఆసక్తి చూసినవారికి మాత్రం పందేలు జోరుగా సాగుతాయనే నమ్మకంతో ఉన్నారు. నిర్వాహకులు సైతం అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా బరులు సిద్ధం చేస్తున్నారు.
మన రాష్ట్రంలో కోడిపందేలు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది పశ్చిమ గోదావరి జిల్లానే. రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో జరిగే పందేలన్నీ ఒక ఎత్తు… పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే పందేలో మరొక ఎత్తు. ఇక్కడ పందేలు వందలు.. వేలు కాదు… లక్షలు.. కోట్లు దాటతాయంటే అతిశయోక్తి కాదు. సినీ ప్రముఖులు, వ్యాపారులు, మన రాష్ట్రంతోపాటు తెలంగాణాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడకు వచ్చి వాలిపోతారు. పశ్చిమలోని ఐ.భీమవరంలో జరిగే పందేలకు హేమీహేమీ పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు రెక్కలు కట్టుకుని వాలిపోతుంటారు. ఇక్కడ పందేలు కోట్ల మీద జరుగుతుంటాయి. భీమవరం, పాలకొల్లు, నర్సాపురం వంటి చోట్ల ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి మరీ పందేలు నిర్వహిస్తారు. తరువాత పందేలు ఎక్కువగా జరిగేది తూర్పు గోదావరి జిల్లాలోనే. ఇక్క కూడా కోనసీమలో ఎక్కువ పందేలు జరుగుతాయి. ఈ రెండు జిల్లాల్లోను పండుగ మూడు రోజుల్లో సుమారు రూ.400 కోట్లకు పైబడి పందేలు జరుగుతుంటాయి. ఈ జిల్లాల తరువాత కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పందేలు విరివిరిగా జరుగుతుంటాయి.
కోడిపందేల వల్లే పల్నాడు యుద్ధం:
చారిత్రాత్మకమైన పల్నాడు యుద్ధానికి కోడి పందేలే కారణం. 1178-1182 మధ్యకాలంలో జరిగిన ఈ యుద్ధానికి మన రాష్ట్ర చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ యుద్ధానికి కారణం కోడిపందేలు అని చరిత్రకారులు చెబుతారు. అప్పటికే కోడి పందేలు ఉన్నాయి. అడవి కోళ్లు, ఇంటి కోళ్లు వంటి పక్షుల మధ్య పోరాటాలు ప్రాచీన భారతదేశంలో వినోదంలో ఒక భాగంగా ఉండేది. పల్నాడు యుద్ధం తరువాత ఆంధ్రప్రదేశ్లో కోడి పందేలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. బొబ్బిలి యుద్ధం సమయంలో కూడా కోడి పందేలు జరిగినవి. శతబ్దాల కాలం నుంచి క్షత్రియులు తమ పౌరుషానికి ప్రతీకగా కుక్కుట శాస్త్రాన్ని ఆచరిస్తూ కోడి పందేలను నిర్వహించేవారు. చట్టం నిషేదించినా… కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా సంక్రాంతి పండుగ మూడు రోజులు కోడిపందేలు నిర్విఘ్నంగా సాగిపోతున్నాయి. మన రాష్ట్రంలోనే కాకుండా కర్నాటక, తమిళనాడు, కేరళ, ఒడిస్సాలో కూడా పందేలు జరుగుతున్నాయి.
Also Read : హైకోర్టులో పిటీషన్, కలెక్టర్ వద్దంటున్నారు.. అయినా కోడి పందేలు ఆగేనా..?
బరులు సిద్ధం:
పోలీసులు హెచ్చరిస్తున్నా పందేల నిర్వాహకులు పెడచెవిన పెడుతున్నారు. ఒమిక్రాన్కు కూడా వారు వెరవడం లేదు. గోదావరి జిల్లాల్లో పండుగ మూడు రోజులు పందేల నిర్వహణకు బరులు సిద్ధమవుతున్నాయి. చేలను, కొబ్బరి తోటలను దున్ని చదును చేస్తున్నారు. కోడి పందేలతోపాటు గుండాటలు నిర్వహించేందుకు సైతం ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ ఏటా పండుగ ముందు పోలీసుల హెచ్చరికలు మామూలే… ఆ మూడు రోజులూ పందేలు నిర్వహించినా పట్టించుకోరనే నమ్మకంతో నిర్వాహకులు ధీమాతో ఉన్నారు.