iDreamPost

కువైట్ అగ్నిప్రమాదంలో.. చనిపోయిన 41 మందిలో 40 మంది భారతీయులే!

Kuwait Fire Outbreak Incident 40 of 41 Indians Lost Their Life: కువైట్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఏకంగా 40 మంది భారతీయులు ఉండటం అందరినీ కలచి వేస్తోంది.

Kuwait Fire Outbreak Incident 40 of 41 Indians Lost Their Life: కువైట్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఏకంగా 40 మంది భారతీయులు ఉండటం అందరినీ కలచి వేస్తోంది.

కువైట్ అగ్నిప్రమాదంలో.. చనిపోయిన 41 మందిలో 40 మంది భారతీయులే!

ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతికి గురయ్యే విషాదకర ఘటన కువైట్ లో జరిగింది. కువైట్ లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఏకంగా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన 41 మందిలో 40 మంది భారతీయులు కావడం మరింత కలచివేసే అంశం. కుటుంబ పోషణ కోసం పొట్ట చేతపట్టుకుని కువైట్ వెళ్లిన వాళ్లు అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వాళ్లంతా ఒకే కంపెనీకి చెందిన వారిలా స్థానిక మీడియా వెల్లడించింది. కువైట్ దేశంలోని దక్షిణ మంగాఫ్ సిటీలో ఈ ఘోరం జరిగింది. ఆరు అంతస్తులు ఉన్న భవనంలో మంటలు చెలరేగి ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బుధవారం తెల్లవారుజామున మంగాఫ్ లో ఉన్న లేబర్ బిల్డింగ్ లో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను కువైట్ లోని స్థానిక మీడియా వెల్లడించింది. అక్కడి మీడియా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 6 గంటలకు భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కిచెన్ లో ప్రమాదం జరిగింది. కిచెన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కిచెన్ కావడంతో.. మంటలకు పక్కనే ఉన్న సిలిండర్లు పేలడంతో ప్రమాద తీవ్రత ఎక్కువైంది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మంటలు క్రమంగా పైకి వ్యాపించాయి. ఒక్కసారిగా దట్టమైన పొగలు కమ్మేశాయి. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు చేరుకున్నాయి.

అప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మొత్తం 41 మంది చనిపోయారు. 35 మంది మంటల్లో సజీవదహనం అవ్వగా.. ఆరుగురు మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. చనిపోయిన 41 మందిలో 40 భారతీయులే అంటూ జాతీయ మీడియా కథనాల్లో వెల్లడించారు. మరో 50 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రుల్లో 30 మంది ఇండియన్స్ ఉండటం మరింత కంగారు పెట్టే విషయం. అలాగే ప్రమాదం జరిగినప్పుడు భవనంలో మొత్తం 160 మంది ఉన్నారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున జరగడంతో.. చాలామంది నిద్రలోనే ఉన్నారు. అందుకే ఎక్కువ నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

జైశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి:

కువైట్ అగ్ని ప్రమాదంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే కువైట్ లోని భారత ఎంబసీ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని.. మరో 50 మందికి గాయాలు అయినట్లు సమాచారం అందింది అన్నారు. మృతుల కుటుంబాలకు తీవ్ర ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదానికి సంబంధించి కువైట్ ప్రభుత్వాన్ని మరిన్ని వివరాలు కోరామన్నారు. బాధితులకు పూర్తి సహకారం అందిస్తామని వ్యాఖ్యానించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి