iDreamPost
android-app
ios-app

దేశం కోసం పనిచేస్తూ.. జీతం కోసం ఎదురుచూపులు! ‘చంద్రయాన్‌-3’ ఇంజినీర్ల దుస్థితి

  • Published Jul 18, 2023 | 9:25 AM Updated Updated Jul 18, 2023 | 1:31 PM
  • Published Jul 18, 2023 | 9:25 AMUpdated Jul 18, 2023 | 1:31 PM
దేశం కోసం పనిచేస్తూ.. జీతం కోసం ఎదురుచూపులు! ‘చంద్రయాన్‌-3’ ఇంజినీర్ల దుస్థితి

ఇస్రో జరుపుతున్న అంతరిక్ష ప్రయోగాలతో దేశం మొత్తం గర్విస్తుంది. తాజాగా చంద్రయాన్‌-3 విజయవంతంగా స్పెస్‌లోకి దూసుకెళ్లడంతో దేశవ్యాప్తంగా సంబురాలు చేసుకున్నారు. గతంలో చంద్రయాన్‌-2 విఫలమైనా.. ధైర్యం కోల్పోకుండా తప్పులను సరిదిద్దుకుని ఇంత వేగంగా చంద్రయాన్‌-3 ప్రయోగానికి భారత్‌ సిద్ధమవ్వడంతో ప్రపంచం ఆశ్చర్యపోయింది. దీంతో మన దేశ శాస్త్ర సాంకేతిక సామర్థ్యం ఎంత గొప్పగా ఉందో తెలుస్తుంది.

చంద్రయాన్‌-3 ప్రయోగ ఫలితం ఆగస్టులో తేలనుంది. అప్పటి వరకు సాగే ప్రక్రియ విజయవంతంగా నడుస్తుండటంతో అంతా సంతోషించారు. కానీ, చంద్రయాన్‌-3 సక్సెస్‌ వెనుక ఉన్న ఇంజినీర్లు దాదాపు 17 నెలలుగా జీతాలు అందక ఇబ్బంది పడుతున్నారనే విషయం సంచలనంగా మారింది. అంతరిక్ష ప్రయోగాలు జరిపే ఇస్రోకు అనేక విభాగాలు సహాయ సహకారాలు అందిస్తాయి. విడి భాగాలు, ఇతర కీలకమైన ముడి సరుకు అందించే సంస్థలు ఉంటాయి. వాటికి కూడా చంద్రయాన్‌ లాంటి గొప్ప ప్రయోగాల్లో భాగం ఉంటుంది. దేశం కోసం పనిచేశామనే గర్వం, సంతృప్తి ఆయా విభాగాల ఉద్యోగులకు ఉంటుంది.

అలాంటి ఒక సంస్థే.. హెచ్‌ఈసీ(హెవీ ఇంజినీరింగ్‌ కార్పొరేషన్‌). జార్ఖండ్‌ రాష్ట్రంలోని రాంచీ పట్టణంలో గల ధుర్వ ప్రాంతంలో ఉన్న ఈ సంస్థ.. కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ. ఈ సంస్థ చంద్రయాన్‌-3 ప్రయోగం కోసం లాంచ్‌ ప్యాడ్‌ను రూపొందించింది. అయితే ఈ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు దాదాపు 17 నెలలుగా జీతాలు అందడం లేదని ప్రముఖ వార్తా సంస్థ ఐఏఎన్‌ఎస్‌ తన నివేదికలో వెల్లడించింది. ఏడాదికి పైగా జీతాలు లేకున్నా.. దేశం కోసం పనిచేస్తున్నామని భావించిన ఆ సంస్థ ఉద్యోగులు చంద్రయాన్‌-3 కోసం లాంచ్‌ ప్యాడ్‌ను రూపొందించారు.

జీతాలు ఎందుకు ఇవ్వడం లేదు?
గత 17 నెలలుగా దాదాపు 2,700 మంది కార్మికులు, 450 మంది ఎగ్జిక్యూటివ్‌లకు జీతాలు అందడం లేదు. ఈ సమస్యకు ప్రధాన కారణం సంస్థలో నిధుల కొరత. ఇస్రో(ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్), రక్షణ మంత్రిత్వ శాఖ, ఇండియన్‌ రైల్వేస్‌, కోల్ ఇండియా, స్టీల్ సెక్టార్‌ల నుంచి ఆర్డర్లు పొందే హెచ్‌ఈసీ ప్రస్తుతం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది.

ఇస్రో, రక్షణ మంత్రిత్వ శాఖ, ఇండియన్‌ రైల్వేస్‌, కోల్ ఇండియా, స్టీల్ సెక్టార్‌ల నుంచి రూ.1,500 కోట్ల విలువైన ఆర్డర్లు చేతిలో ఉన్నప్పటికీ, నిధుల కొరత కారణంగా 80 శాతం పనులు పెండింగ్‌లో ఉన్నాయి. రూ.1,000 కోట్ల వర్కింగ్ క్యాపిటల్‌ను అందించాలని హెచ్‌ఈసీ.. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖను పలుమార్లు అభ్యర్థించిందని నివేదిక పేర్కొంది. అయితే, మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయదని తేల్చిచెప్పినట్లు నివేదికలో ఐఏఎన్‌ఎస్‌ వెల్లడించింది. అలాగే గత రెండేళ్లుగా హెచ్‌ఇసీ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ లేదా సీఎండీ పదవికి శాశ్వత నియామకం చేపట్టకపోవడం కూడా ఈ సంక్షోభానికి కారణంగా మారింది. మరి ఈ పరిస్థితిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: విషాదం: మాజీ సీఎం కన్నుమూత!