iDreamPost
android-app
ios-app

మరోసారి తెర మీదకు కావేరీ జలాల వివాదం.. అసలు ఏంటి ఈ సమస్య?

  • Published Sep 26, 2023 | 1:22 PMUpdated Sep 26, 2023 | 1:22 PM
  • Published Sep 26, 2023 | 1:22 PMUpdated Sep 26, 2023 | 1:22 PM
మరోసారి తెర మీదకు కావేరీ జలాల వివాదం.. అసలు ఏంటి ఈ సమస్య?

కర్ణాటక, తమిళనాడు మధ్య మరోసారి కావేరీ నదీ జలాల వివాదం రాజుకుంది. తమిళనాడుకు కావేరీ నది నీటిని విడుదల చేయవద్దంటూ.. బెంగళూరు​ వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మరోసారి కావేరీ నదీ జలాల వివాదం తెర మీదకు వచ్చింది. అసలు ఈ వివాదం ఏంటి.. ఎప్పుడు ప్రాంరంభం అయ్యింది అంటే.. తమిళనాడు-కర్ణాటకల మధ్య సుమారు 130 ఏళ్లుగా కావేరీ నదీ జలాల పంపిణీకి సంబంధించిన వివాదం నడుస్తోంది. అంటే ఇండియా స్వతంత్ర దేశంగా ఏర్పడక ముందే ఈ వివాదం మొదలయ్యింది.

మైసూరు, మద్రాసు ప్రావిన్సుల మధ్య.. 1892లో ఈ వివాదం ప్రారంభం అయ్యింది. ఆ సమయంలో మైసూరు ప్రాంతంలో.. రాజుల పరిపాలన సాగుతుండగా.. మద్రాస్‌ ప్రావిన్స్‌లో బ్రిటీష్‌ పాలన ఉంది. కావేరీ నది జన్మస్థలం కొడుగు జిల్లా, తలకావేరీ. దీని పరివాహక ప్రాంతం కర్ణాటక, తమిళనాడుతోపాటు కేరళ, పుదుచ్చేరీల్లోనూ ఉంది. కానీ వివాదం మాత్రం ప్రధానంగా కర్ణాటక, తమిళనాడు మధ్యనే రాజుకుంటుంది.

1892లో తొలి ఒప్పందం..

కావేరీ నదీ జలాలకు సంబంధించి.. 1892లో తొలిసారి మద్రాస్‌-మైసూరుల మధ్య ఒప్పందం కుదిరింది. నీటి పారుదల ప్రాజెక్టులను పునరుద్ధరించాలని మైసూరు భావించగా.. అందుకు మద్రాసు ప్రావిన్సు అంగీకరించలేదు. దీంతో మద్రాసు ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా మైసూరు కావేరీ నదిపై ప్రాజెక్టులు చేపట్టేలా ఇరు ప్రావిన్సుల మధ్య 1890-92 మధ్య ప్రాంతంలో ఒప్పందం కుదిరింది. తర్వాత 1910లో కావేరీ నదిపై కన్నాంబడి గ్రామం వద్ద 41.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టును నిర్మించేందుకు మైసూరు రాజు కృష్ణరాజ ఒడయార్, ప్రఖ్యాత సివిల్ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వయ్యతో కలిసి ప్రణాళికలు రూపొందించారు. రెండు దశల్లో ప్రాజెక్ట్‌ నిర్మించాలని భావించారు.

వివాదం ప్రారంభం..

మొదటి దశలో భాగంగా.. 11 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మించారు. ఇక రెండో దశ పనులు ప్రారంభిస్తుండగా.. మద్రాసు ప్రావిన్స్‌ అడ్డుకుంది. కారణం.. ఇదే సమయంలో మద్రాసు వారు మెట్టూరు డ్యాం నిర్మాణం చేపట్టారు. దాంతో మైసూరు ప్రభుత్వం మొదటిదశ ప్రాజెక్ట్‌ నిర్మాణంతో ఆగిపోవాల్సి వచ్చింది. అయితే మైసూరు రాజు.. మద్రాస్‌ ప్రెసిడెన్సీ మాట విన్నట్లే ఉంటూ.. మళ్లీ తన పాత ప్రణాళిక ప్రకారం.. ప్రాజెక్ట్‌ రెండో దశ పనులు ప్రారంభించారు. ఈ విషయం గుర్తించిన మద్రాసు ప్రావీన్స్‌.. మైసూరు రాజ్య పనులను అడ్డుకుంది. ఇరు ప్రాంతాల మధ్య తొలిసారి వివాదం ప్రారంభం కావడంతో.. దీంతో 1892 నాటి ఒప్పందం మేరకు ఇరు ప్రాంతాల మధ్య మధ్యవర్తిత్వానికి నాటి బ్రిటిష్ ఇండియా సిఫారసు చేసింది.

1924లో మరో ఒప్పందం..

ఇరు ప్రాంతాల మధ్య మొదలైన వివాదం ముగింపు కోసం.. హెచ్.డి.గ్రిఫిన్ మధ్యవర్తిగా, ఎం.నీథర్‌సోల్ మధ్యవర్తులుగా నియమితులయ్యారు. 1914లో వారు మైసూరుకు అనుకూలంగా తీర్పు వెలువరించారు. దీంతో డ్యాం నిర్మించుకునేందుకు మైసూరుకు ఆమోదం లభించింది. అయితే ఈ తీర్పును మద్రాస్‌ వ్యతిరేకించింది. మరోసారి వివాదం తలెత్తడంతో.. 1924 లో.. సుమారు 50 ఏళ్లపాటు వర్తించేలా ఇరు ప్రాంతాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది.

అలా స్వతంత్రం వచ్చాక అనగా 1970 నాటికి.. ఈ ఒప్పందం గడువు ముగించాలని భావించాయి. స్వతంత్రం వచ్చి, భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత.. కావేరీ జలాలు.. కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలకు పంచాల్సి వచ్చింది. అయితే కావేరీ నది పరివాహక ప్రాంతం కర్ణాటకలో 32 వేల చకిమీ కాగా.. తమిళనాడులో 44 వేల చకిమీగా ఉంది.

1990 లో ట్రిబ్యునల్‌ ఏర్పాటు..

1970ల్లో కర్ణాటక ప్రభుత్వం కొడగు జిల్లాలో హరంగీ డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించింది. అయితే దీన్ని వెంటనే ఆపాలని, ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం కోర్టుకెళ్లింది. 1990 వరకు ఇరు రాష్ట్రాల మధ్య అనేక దశల్లో చర్చలు జరిగాయి. కానీ ఫలితం లేకపోయింది. దాంతో సుప్రీం కోర్టు ఆదేశాలతో భారత ప్రభుత్వం జస్టిస్ చిత్తతోష్ ముఖర్జీ అధ్యక్షతన 1990, జూన్ 2న ఓ ట్రిబ్యునల్‌ని ఏర్పాటు చేసింది.

ఈ ట్రిబ్యునల్‌ ముందు రెండు రాష్ట్రాలు తమ వాదనలు వినిపించాయి. తమకు వెంటనే నీటిని విడుదల చేసేలా కర్ణాటకను ఆదేశించాలని కోరుతూ తమిళనాడు ట్రిబ్యునల్‌ను డిమాండ్ చేసింది. ట్రిబ్యునల్ కాదనడంతో కోర్టుకెళ్లి మరీ సాధించుకుంది. ఈ విషయం వివాదానికి దారి తీయడంతో బెంగళూరులోని తమిళ ప్రజలపై దాడులు చేసే దాకా వెళ్లింది. దీంతో నగరంలో నెలరోజులపాటు స్కూళ్లు, కాలేజీలను మూసేశారు.

2002లో మరోసారి మొదలైన వివాదం..

2002లో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో తీవ్ర కరువు సంభవించింది. దీంతో ఇరు ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. డ్యాముల్లో చుక్క నీరు లేకుండా ఎండిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ.. ఒప్పందాన్ని పాటించాలని తమిళనాడు కర్ణాటకకు సూచించింది. కానీ కర్ణాటక మాత్రం అందుకు ససేమిరా అంది. ఈ క్రమంలో 2002లో కావేరీ రివర్ అథారిటీ సమావేశం నిర్వహించగా.. తమిళనాడు సీఎం జయలలిత వాకౌట్ చేశారు. రోజుకు 1.25 టీఎంసీల చొప్పున తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని సుప్రీం కర్ణాటకను ఆదేశించింది. తర్వాత సమావేశమైన కావేరీ రివర్ అథారిటీ రోజుకు 0.8 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటకకు సూచించింది.

కానీ కర్ణాటక రాష్ట్రం సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించలేదు. దీంతో జల వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల సినీ నటులు కూడా రోడ్డెక్కి తమ ప్రాంత ప్రజల తరఫున పోరాటానికి దిగారు. దీంతో కర్ణాటకలో తమిళ ఛానళ్ల ప్రసారాలను నిషేధించారు. తమిళ సినిమాలను సైతం బ్యాన్‌ చేశారు. తమిళనాడు ప్రాంతానికి చెందిన వాహనాలు తమ రాష్ట్రంలోకి రాకుండా కర్ణాటక వాసులు అడ్డుకున్నారు. తర్వాత 2012లోనూ మళ్లీ కావేరీ జలాల వివాదం తలెత్తింది.

ఇక తాజాగా తమిళనాడుకు 15 రోజుల పాటు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కావేరి బోర్డు ఆదేశించింది. దీనిపై కన్నడిగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడుకు నీరు విడుదల చేయొద్దని కర్నాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ రైతులు నిరసనలు చేపట్టారు.ఈ నేపథ్యంలో కన్నడ సంఘాలు, సంస్థలు బంద్‌ను చేపట్టాయి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి