iDreamPost
android-app
ios-app

Footwear Prices: సామాన్యులకు షాక్‌.. ఆగస్టు 1 నుంచి భారీగా పెరగనున్న చెప్పులు, షూ ధరలు..

  • Published Jul 30, 2024 | 10:42 AM Updated Updated Jul 30, 2024 | 10:42 AM

BIS New Rules Footwear Prices To Rise: పెరుగుతున్న ధరలతో బెంబేలెత్తుతున్న జనాల నెత్తిన మరో పిడుగు పడనుంది. పాదరక్షల ధరలు పెరగనున్నాయి. ఆ వివరాలు..

BIS New Rules Footwear Prices To Rise: పెరుగుతున్న ధరలతో బెంబేలెత్తుతున్న జనాల నెత్తిన మరో పిడుగు పడనుంది. పాదరక్షల ధరలు పెరగనున్నాయి. ఆ వివరాలు..

  • Published Jul 30, 2024 | 10:42 AMUpdated Jul 30, 2024 | 10:42 AM
Footwear Prices: సామాన్యులకు షాక్‌.. ఆగస్టు 1 నుంచి భారీగా పెరగనున్న చెప్పులు, షూ ధరలు..

ప్రస్తుతం మార్కెట్‌లో అన్నింటి ధరలు మండిపోతున్నాయి. కూరగాయాల రేట్ల గురించి అయితే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కిలో టమాటా రేటు 100 రూపాయలకు చేరింది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మూడో సారి విజయం సాధించి.. అధికారంలోకి వచ్చింది. ఇక జూలై నెలలో పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. దీని తర్వాత దేశంలో అనేక మార్పులు రానున్నాయి. అలానే బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన కొన్ని అంశాల కారణంగా.. త్వరలోనే కొన్నింటి రేట్లు పెరగనున్నాయి.. తగ్గనున్నాయి. ఇప్పటికే ఖరీదైన లోహాల మీద కస్టమ్స్‌ డ్యూటీ తగ్గించడంతో.. పసిడి ధర దిగి వస్తోంది.

ఇదిలా ఉండగా.. సామాన్యులకు షాక్‌ ఇచ్చే న్యూస్‌ ఒకటి వెలుగు చూసింది. ఫూట్‌వేర్‌కి సంబంధించి కొత్త నాణ్యతా ప్రమాణాలు తీసుకొస్తోంది కేంద్రం. దీంతో చెప్పులు, షూల ధరలు భారీగా పెరగనున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. ఆగస్టు 1 నుంచి కొత్త నాణ్యతా ప్రమాణాలు అమలులోకి రానున్నాయి. అంటే అప్పటి నుంచి అనగా ఆగస్టు 1 నుంచి మన దేశంలో తయారయ్యే షూలు, చెప్పులు, సాండిల్స్ అన్ని కొత్త ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (బీఐఎస్‌) స్పష్టం చేసింది.

కొత్త నాణ్యతా నియంత్రణ ఉత్తర్వుల ప్రకారం.. చెప్పులు, షూ తయారు చేసే వారు ఇక మీదట ఐఎస్‌ 6721, ఐఎస్‌ 10702 నిబంధనలు కచ్చితంగా పాటించాలని బీఐఎస్ స్పష్టం చేసింది. ఇకపై చెప్పులు, షూ తయారీలో ఉపయోగించే రెగ్జిన్, ఇన్‌సోల్ వంటి ముడి పదార్థాలకు రసాయన పరీక్షలు తప్పనిసరిగా చేయించాలి. అలాగే చెప్పులు, షూల బయటి భాగాలకు వినియోగించే మెటీరియల్ చిరగకుండా, ఎక్కువ కాలం మన్నికగా ఉండేలా చూసుకోవాలి. అంతేకాక పరీక్షల్లో ఆ మెటీరియల్ నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. అంటే ఈ కొత్త నిబంధనల వల్ల ఇకపై ఇష్టారీతిలో నాణ్యతలేని పాదరక్షలు అనగా షూ, చెప్పులు తయారు చేయడం కుదరదు. వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా.. దీర్ఘకాలం మన్నేలా చెప్పులు, షూ మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకే ఈ కొత్త రూల్స్ తీసుకొస్తున్నట్లు బీఐఎస్ వర్గాలు తెలిపాయి.

అయితే ఈ కొత్త ప్రమాణాలు పాటిస్తూ పాదరక్షలు తయారు చేయడం వల్ల.. కంపెనీలపై భారం పడుతుంది. దాంతో ఈ భారాన్ని తగ్గించుకోవడానికి కంపెనీలు.. పాదరక్షలు ధరలు పెంచవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ కొత్త నియమాలు.. రూ.50 కోట్ల కంటే తక్కువ వార్షిక టర్నోవర్ ఉన్న కంపెనీలకు, పాత స్టాక్‌కి సైతం వర్తించవని చెప్పుకొచ్చారు. ఆగస్టు 1 తర్వాత తయారయ్యే వాటికే ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయని తెలిపింది. అయితే, విక్రయదారులు తమ వద్ద ఉన్న పాత స్టాక్ వివరాలను బీఐఎస్ వెబ్‌సైట్లో పొందుపరచాల్సి ఉంటుంది.