iDreamPost
android-app
ios-app

ఏపీని వదలని వానలు.. విజయవాడలో మళ్లీ పెరుగుతున్న వరద.. ఆందోళనలో ప్రజలు

AP Rains: విజయవాడలో వరదలు బీభత్సం సృష్టించాయి. వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడిప్పుడే వరద నుంచి తేరుకుంటున్న వారికి మళ్లీ వరద ప్రవాహం పెరుగుతుండడంతో భయాందోళనకు గురవుతున్నారు.

AP Rains: విజయవాడలో వరదలు బీభత్సం సృష్టించాయి. వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడిప్పుడే వరద నుంచి తేరుకుంటున్న వారికి మళ్లీ వరద ప్రవాహం పెరుగుతుండడంతో భయాందోళనకు గురవుతున్నారు.

ఏపీని వదలని వానలు.. విజయవాడలో మళ్లీ పెరుగుతున్న వరద.. ఆందోళనలో ప్రజలు

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కురిసిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. కుండపోత వర్షాలతో ఏపీ అతలాకుతలం అయ్యింది. భారీగా కురిసిన వానలతో కనీవినీ ఎరుగని రీతిలో వరదలు సంభవించాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రహదారులన్నీ చెరువులను తలపించాయి. వరదల కారణంగా జనజీవనం స్థంభించిపోయింది. ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. వందలాది రైళ్లు రద్దయ్యాయి. బస్సులు సైతం రోడ్డెక్కని పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా విజయవాడ నగరాన్ని వరద నీరు ముంచెత్తింది. కృష్ణా నది ఉప్పొంగడం, బుడమేరుకి వరద పోటెత్తడంతో విజయవాడ నగరం జలదిగ్భందంలో చిక్కుకుపోయింది. ఇప్పుడిప్పుడే వర్షాలు, వరదల నుంచి తేరుకుంటున్న ప్రజలకు వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్తను అందించింది. ఏపీకి మరో అల్పపీడనం పొంచి ఉందని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఇదిలా ఉంటే విజయవాడకు మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. బుడమేరు కాలువకు వరద ప్రవాహం పెరగడంతో విజయవాడకు ముంపు ముంచుకొస్తున్నది. గడిచిన 24 గంటల్లో విజయవాడలో భారీ వర్షం కురవడంతో బుడమేరుకు వరద పోటెత్తింది. దీంతో నగరంలోకి మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురువుతున్నారు. విజయవాడ సింగ్ నగర్ లోని కొన్ని ప్రాంతాల్లో వరద ప్రవాహం మళ్లీ పెరగటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. వరద ప్రవాహం పెరుగుతుండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నది. ప్రజలకు అవసరమైన ఆహారం, నీరు, నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నది ప్రభుత్వం.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నదని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది ఉత్తర దిశగా ప్రయాణం చేసి 9వ తేదీ నాటికి వాయువ్య బంగాళాఖాతంలో ఒరిస్సా- పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంద్రాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రకు విస్తారంగా వర్షాలు ఉన్నాయి. ఈ రోజు అల్లూరి, పార్వతీపురం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. రేపు ఏలూరు, శ్రీకాకుళం, అల్లూరి, పార్వతీపురం జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. కోస్తా తీరం వెంబడి మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. కాగా ఏపీలో వరదల కారణంగా 34 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెబుతున్నారు.