iDreamPost

బుచ్చయ్యగారు గతం మరచిపోయారా..?

బుచ్చయ్యగారు గతం మరచిపోయారా..?

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన 73 ఏళ్ల రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గతం మరచిపోయారా..? అనే సందేహాలు ప్రజలతోపాటు రాజకీయ నేతల్లోనూ కలుగుతున్నాయి. అంతేకాదు బుచ్చయ్య చౌదరి విమర్శల్లో మునపటి వాడీవేడీ కూడా తగ్గిందంటున్నారు. బహుసా ఇది వయస్సు ప్రభావం కావచ్చనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

గురువారం జగనన్న విద్యా కానుక అనే పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులందరికీ పాఠ్య, నోట్‌ పుస్తకాలు, బూట్లు, సాక్సులు, టైం, మూడు జతల యూనీఫాం, బ్యాగ్‌తో కూడిన కిట్‌ను అందించారు. ప్రభుత్వ బడులను సకల సౌకర్యాలతో కార్పొరేట్‌ స్కూళ్లుకు మించి ఆధునికరించడంతోపాటు విద్యార్థుల్లో సమభావం, మానసిక సై్తర్యాన్ని పెంచేందుకు ఈ పథకం అమలు చేశారు. ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్లకు వెళ్లే విద్యార్థుల మాదిరిగానే.. ఇకపై ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదవే విద్యార్థులకు డ్రెస్‌ కోడ్‌ ఉండనుంది. ఈ పథకం ప్రతి ఏడాది అందుతుందని ప్రత్యేకంగా చెపాల్సిన పనిలేదు.

అయితే జగనన్న విద్యా కానుక పథకంపై సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు చేశారు. ఆయన విమర్శలు చూసిన వారు అవి చౌకబారుగా ఉన్నాయనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ‘‘ విద్యార్థులకు విద్యా కానుక అన్నారు సరే. కానీ మీరు ఇచ్చే వాటిపైన స్కూల్‌కి సంబంధించిన లోగో లేక పేరు ఉండాలి. కానీ ఇలా మీ పార్టీ రంగు, పేరు వేసుకుంటే ఎలా ముఖ్యమంత్రిగారు..? ఇది ప్రజల డబ్బు అని మరచిపోయారా..? బడికి వెళ్లే విద్యార్థులతో రాజకీయాలు ఏంటి..? కానుక పార్టీ కానుక చేయకండి..’ అంటూ విద్యార్థులకు ఇచ్చిన బెల్ట్‌ ఫోటోతో ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

ముఖ్యమంత్రిని మరచిపోయారా..? అంటున్న 73 ఏళ్ల బుచ్చయ్య చౌదరి తన మతిమరుపును బయటపెట్టుకుంటున్నారే విమర్శలు వస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో 9,10 తరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. వాటికి టీడీపీ జెండా రంగు అయిన పసుపు వేయడంతోపాటు.. ముందు వైపు లగేజీ క్యారేజీకి చంద్రబాబు ఫోటో కూడా అంటించారు. ఇక ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఇచ్చిన సబ్సిడీ ట్యాక్సీలపై .. చంద్రబాబు ఫోటోను ముద్రించి థ్యాంక్యూ సీఎం సర్‌.. అంటూ పోస్టర్లు వేసిన విషయం కూడా నెటిజన్లు బుచ్చయ్య చౌదరికి గుర్తు చేస్తున్నారు. తమ ప్రభుత్వ నిర్వాకాలను మరచిపోయిన బుచ్చయ్య చౌదరి ట్విట్టర్‌ వేదికగా నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయారు.

బుచ్చయ్య చేసిన వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాంటున్నారు నెటిజన్లు. బెల్ట్‌పై జగనన్న విద్యా కానుక అని పథకం పేరు వేశారు గానీ ఎక్కడా వైఎస్‌ జగన్‌ పేరు గానీ, పార్టీ పేరుగానీ ముద్రించలేదు. పైగా రంగు కూడా బ్లూ, వైట్‌ లైనింగ్‌తో తయారు చేశారు. ఇవి వైసీపీ రంగులనేలా బుచ్చయ్య చౌదరి విమర్శస్తున్నారు. గ్రీన్, బ్లూ, వైట్‌.. మూడు రంగులు వైసీపీ జెండాలో ఉంటాయన్న విషయం బుచ్చయ్య చౌదరి గుర్తించాలని నెటిజన్లు సూచిస్తున్నారు. పైగా చంద్రబాబు బడికి వెళ్లే విద్యార్థులతో రాజకీయాలు చేసి ఆర్థికంగా కార్పొరేట్‌ స్కూళ్లకు మేలు చేసిన విషయం గుర్తు చేస్తున్నారు. 30 మంది కన్నా విద్యార్ధుల సంఖ్య తగ్గిన వేలాది పాఠశాలలను మూసేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదనే విషయం ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.

అమ్మ ఒడి, మన బడి నాడు నేడు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం కోసం గోరుముద్దలు పథకం, జగనన్న విద్యా కానుక పథకాలతో పాటు ఇంగ్లీస్‌ మీడియంలో చదువులు చెప్పించాలని కోర్టుల్లో పోరాడుతున్న జగన్‌.. విద్యార్థులతో రాజకీయాలు చేశారా..? లేక స్కూళ్లు మూసేసి.. తద్వారా తన పార్టీ నేతల స్కూళ్లకు మేలు చేసిన చంద్రబాబు పేద, మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్‌తో రాజకీయాలు చేశారా..? అంటూ నెటిజన్లు బుచ్చయ్య చౌదరిపై ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి