iDreamPost

భార్యాబిడ్డలను హత్యచేసి.. ఉరేసుకుని ఆత్మహత్య!

భార్యాబిడ్డలను హత్యచేసి.. ఉరేసుకుని ఆత్మహత్య!

మనుషుల్లో మానవత్సం నశించిపోతోంది. పరువు, ప్రతిష్ట, కోపం, అహం అంటూ రూపంలేని భావాలకు నిండు ప్రాణాలను బలి చేస్తున్నారు. తాజాగా ఒక తండ్రికి వచ్చిన కోపం ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసింది. ఒక భర్తకు వచ్చిన కోపం ఆ ఇల్లాలి నిండు ప్రాణాన్ని బలిగొంది. ఆ తర్వాత ఆ ఇంటి పెద్ద కూడా ఉరేసుకుని తనువు చాలించాడు. ఈ హత్యలు, ఆత్మహత్య అతని కోపం కారణంగానే జరిగినట్లు చెబుతున్నారు. ఒక పచ్చని కాపురం చివరకు భుగ్గిపాలైంది. పిల్లాపాపలతో కళకళ్లాడాల్సిన ఆ ఇల్లు బోసి పోయింది.

ఈ ఘటన జులై 31న జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. బెంగళూరు కడుగోడి పీఎస్ పరిధిలో ఈ దారుణం వెలుగు చూసింది. వీరార్జున విజయ్(31), హేమావతి(29) దంపతులు సిగినేహళ్లిలోని ఓ అపార్టుమెంట్ లో నివాసముంటున్నారు. వారికి ఏడాదిన్నర, 8 నెలల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరు హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరి ఫోన్లు రెండ్రోజులుగా స్విచ్ ఆఫ్ లో ఉండటంతో హైదరాబాద్ లో ఉండే విజయ్ సోదరుడికి అనుమానం వచ్చింది. అతను నేరుగా బెంగళూరు వెళ్లాడు. అక్కడ వాళ్లు ఎంతకీ తలపుతీయడం లేదు. అపార్ట్ మెంట్ లాక్ చేసి ఉంది. లోపల లైట్స్ వేసున్నాయి. బెడ్ రూమ్ కిటీకీ తెరిచి చూడగా విజయ్ కుటుంబం మృతదేహాలు కనిపించాయి.

అతను, పొరుగు వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. వారి మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో పోలీసులు ఎలాంటి ఆధారాలను సేకరించలేకపోయారు. అయితే పోస్టుమార్టం తర్వాత మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందన్నారు. అపార్టుమెంట్ లో బెడ్ పై హేమావతి, పిల్లల మృతదేహాలు ఉన్నాయి. ఫ్యానుకు విజయ్ మృతదేహం వేలాడుతూ ఉంది. ఘటనాస్థలిని పరిశీలించిన తర్వాత విజయ్ భార్యాబిడ్డలను హత్య చేసిన తర్వాత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ణయానికి వచ్చారు. మృతుడు వీరార్జున విజయ్ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా గుర్తించారు. హత్య, ఆత్మహత్యలకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే వీరి మధ్య గొడవలే ఈ ఘటనకు కారణం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి