iDreamPost

13 ఏళ్ళ తర్వాత దర్శకత్వం

13 ఏళ్ళ తర్వాత దర్శకత్వం

గత కొనేళ్లుగా సక్సెస్ కి దూరమైన హీరో శర్వానంద్ ఆశలన్నీ ఇప్పుడు మహాసముద్రం మీదే ఉన్నాయి. ఆరెక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ లవ్ డ్రామాలో అదితి రావు హైదరి హీరోయిన్ కాగా సిద్ధార్థ్ మరో హీరోగా కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే నెల 14 విడుదలకు రంగం సిద్ధం చేసుకుంది. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో రూపొందుతున్న ఆడాళ్ళు మీకు జోహార్లు షూటింగ్ కూడా రెగ్యులర్ గా సాగుతోంది. రష్మిక మందన్న హీరోయిన్. దీనికన్నా ముందు ఒకే ఒక జీవితం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇటీవలే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందనే వచ్చింది. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ కి శర్వా ఓకే చెప్పారట.

ప్రభుదేవా సోదరుడు రాజు సుందరం దర్శకత్వంలో ప్రముఖ రచయిత వక్కంతం వంశీ ఇచ్చిన కథతో సినిమా చేసేందుకు శర్వానంద్ ఆల్మోస్ట్ ఓకే చెప్పినట్టు ఫిలిం నగర్ టాక్. ఇందులో రిస్క్ ఏముందనుకుంటున్నారా. రాజు సుందరం గొప్ప డాన్స్ మాస్టరే కానీ డైరెక్టర్ గా ట్రాక్ రికార్డు లేదు. 2008లో అజిత్ హీరోగా ఏగన్ అని భారీ సినిమా ఒకటి తీస్తే అది బాక్సాఫీస్ వద్ద తుస్సుమంది. దెబ్బకు మళ్ళీ దర్శకత్వం జోలికి వెళ్లకుండా తన వృత్తికే పరిమితమయ్యారు. ఇది జరిగి 13 ఏళ్ళు అవుతోంది. ఇప్పుడు మళ్ళీ రాజు సుందరం కు మెగా ఫోన్ పట్టాలనిపించి ఫైనల్ గా శర్వానంద్ లాంటి ఇమేజ్ ఉన్న హీరోతోనే సెట్ చేసుకున్నారన్న మాట

అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు కానీ ఆల్మోస్ట్ ఓకే అయ్యిందని సమాచారం. త్వరలోనే అనౌన్స్ చేయొచ్చు. శర్వాకు డిజాస్టర్ల బ్రేకులు పడాలి. పడి పడి లేచే మనసు, రణరంగం, జాను, శ్రీకారం ఏదీ కనీసం బ్రేక్ ఈవెన్ అందుకోలేకపోయాయి. వీటి వల్లే మార్కెట్ మీద కూడా కొంత ప్రభావం పడింది. అందుకే మహాసముద్రం కనక హిట్ అయితే మళ్ళీ ట్రాక్ లోకి పడొచ్చు. సీరియస్ డ్రామాలు పక్కనపెట్టి చేస్తున్న ఆడాళ్ళు మీకు జోహార్లు మీద కూడా శర్వాకు గట్టి నమ్మకం ఉంది. ఒకప్పుడు వరస హిట్లతో దూసుకుపోయిన ఈ హీరోకి చివరిగా దక్కిన సక్సెస్ మహానుభావుడు. మరి ఇప్పుడు చేస్తున్న ఈ ప్రయోగాలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో

Also Read : ఈ వారం కూడా థియేటర్ VS ఓటిటి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి