iDreamPost

రామమందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు – ప్రధాని

రామమందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు – ప్రధాని

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ట్రస్టును ఏర్పాటు చేసినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు.

బుధవారం ఆయన లోక్ సభలో మాట్లాడుతూ… ‘‘ రామజన్మ. భూమి, బాబ్రీ మసీదు అంశంలో నవంబరు 9న వచ్చిన తీర్పు మేరకు ట్రస్టు ఏర్పాటు చేసినట్లు వివరించారు. దీనిమీద కేబినేట్ నిర్ణయం తీసుకుందని చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తున్నా. ఈ ట్రస్ట్ కు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రగా నామకరణం చేశాం. మందిర నిర్మాణం కోసం 67.703 ఎకరాల భూమిని కేటాయించాలని నిర్ణయించాం. ఈ ట్రస్టు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుంది’’అని స్పష్టం చేశారు.

అదే విధంగా.. భారతదేశంలో నివసిస్తున్న అన్ని మతాల ప్రజలు వసుదైక కుటుంబంలో భాగమేనని పేర్కొన్నారు. దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో సర్వోన్నత న్యాయస్థానం గత నవంబర్ 9న తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వివాదాస్పదంగా మారిన 2.77 ఎకరాల భూమి రాంలల్లాకు చెందుతుందని పేర్కొన్న సుప్రీంకోర్టు.. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికై సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల హామీల్లో భాగమైన రామ మందిర నిర్మాణానికి ప్రత్యేక ట్రస్టును ఏర్పాటు చేస్తూ కేంద్ర కేబినెట్‌ బుధవారం నిర్ణయం తీసుకున్నది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి