iDreamPost

తీవ్ర విషాదం.. సహారా గ్రూప్‌ అధినేత సుబ్రతా రాయ్‌ మృతి

  • Published Nov 15, 2023 | 9:18 AMUpdated Nov 15, 2023 | 9:18 AM

సహారా గ్రూప్‌ ఛైర్మన్‌ సుబ్రతా రాయ్‌ తుది శ్వాస విడిచారు. మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఈ మేరకు సహారా గ్రూప్‌ ఓ ప్రకటన చేసింది. ఆ వివరాలు..

సహారా గ్రూప్‌ ఛైర్మన్‌ సుబ్రతా రాయ్‌ తుది శ్వాస విడిచారు. మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఈ మేరకు సహారా గ్రూప్‌ ఓ ప్రకటన చేసింది. ఆ వివరాలు..

  • Published Nov 15, 2023 | 9:18 AMUpdated Nov 15, 2023 | 9:18 AM
తీవ్ర విషాదం.. సహారా గ్రూప్‌ అధినేత సుబ్రతా రాయ్‌ మృతి

బిజినెస్‌ సర్కిల్స్‌లో​ వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మంగళవారం నాడు ఒబెరాయ్‌ గ్రూప్‌ చైర్మన్‌ పృథ్వి రాజ్ సింగ్ ఒబెరాయ్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆ విషాదం నుంచి కోలుకోకముందే మరో దిగ్గజ వ్యాపారవేత్త కన్నుమూశారు. సహారా గ్రూప్‌ వ్యవస్థాపకులు, ఛైర్మన్‌ సుబ్రతారాయ్‌ కన్నుమూశారు. మంగళవారం రాత్రి 10:30 గంటల సమయంలో ఆయన మృతి చెందారు. గుండెపోటు రావడంతో చనిపోయినట్లు సహారా గ్రూప్ ప్రకటించింది. అయితే గత కొంతకాలంగా సుబ్రతారాయ్‌ మెటాస్టాటిక్ కేన్సర్, హై బీపీ, డయాబెటీస్‌ వంటి వ్యాధులతో బాధపడుతున్నారు.

మూడు రోజుల క్రితం అనగా.. నవంబర్ 12వ తేదీ ఆదివారం నాడు ఆయన తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో చికిత్స నిమిత్తం ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కి తరలించారు. ఆదివారం నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. మంగళవారం రాత్రి కన్నుమూసినట్లు సహారా కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. సుబ్రతా రాయ్ మృతితో సహారా ఇండియా పరివార్ శోకసముద్రంలో మునిగిపోయిందని వెల్లడించింది.

రూ.2వేలతో ప్రారంభించి..

సహార గ్రూప్ వ్యవస్థాపకులు సుబ్రతా రాయ్‌ వ్యక్తిగత వివరాలకు వస్తే ఆయన భార్య స్వప్నా రాయ్. ఆయనకు ఇద్దరు కుమారులు సంతానం ఉన్నారు. వారు సుశాంతో రాయ్, సీమాంటో రాయ్ ఉన్నారు. 1948, జూన్ 10వ తేదీన బిహార్ రాష్ట్రంలోని అరారియాలో జన్మించారు సుబ్రతా రాయ్. గోరఖ్‌పూర్‌లోని గవర్నమెంట్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూ‌లో మెకానికల్ ఇంజినీరంగ్ పూర్తి చేశారు.

ఆ తర్వాత.. ఆర్థిక ఒత్తిళ్లలో ఉన్న చిట్‌ఫండ్ సంస్థ సహారా ఫైనాన్స్‌ను 1976లో కొనుగోలు చేశారు రాయ్. నిర్విరామంగా కృషి చేస్తూ.. 1978 నాటికి దానిని సహారా ఇండియా పరివార్‌గా తీర్చిదిద్దారు. ఆ తర్వాత తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ పోయారు. ఈ క్రమంలో ఫైనాన్స్, స్థిరాస్తి, మీడియా, ఆతిథ్యం వంటి రంగాల్లో సహారా గ్రూప్‌ ప్రవేశించింది. ఆ తర్వాత 1992లో రాష్ట్రీయ సహారా పేరుతో ఓ వార్తా పత్రికను, సహారా టీవీ ఛానల్‌ను ప్రారంభించారు సుబ్రతారాయ్‌. కొన్నాళ్లకు సహారా టీవీని సహారా వన్‌గా మార్పు చేశారు.

అనంతరం 2010లో రాయ్ లండన్‌లోని గ్రోస్‌వెనర్ హౌస్ హోటల్‌ను, 2012లో న్యూయార్క్‌లోని ప్లాజా హోటల్‌ను కొనుగోలు చేసి ఇంటర్నేషనల్‌గా వార్తల్లో నిలిచారు. 2000 దశకం నాటికి సహరా ఇండియా పరివార్ సంస్థలో 1.2 మిలియన్ ఉద్యోగులు పని చేసేవారు. దేశంలో రైల్వే తర్వాత అత్యధిక ఉద్యోగులు ఉన్న సంస్థగా సహారా గ్రూప్ గుర్తింపు తెచ్చుకుంది. కేవలం రూ. 2 వేల మూలధనంతో సహారాను ప్రారంభించి దేశంలోనే అగ్రగామి సంస్థగా నిలిపారని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నది.

2014 నుంచి తిరోగమనం..

దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగిన సహారా గ్రూప్ 2014 నుంచి సవాళ్లను ఎదుర్కొంది. ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన కోట్ల కొద్దీ నగదును రిఫండ్ చేయాల్సిందిగా సెబీ ఆదేశాలు జారీ చేసింది. అయితే మదుపరుల డబ్బులు తిరిగి చెల్లించడంలో విఫలం కావడంతో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సుబ్రతా రాయ్ తిహార్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన పెరోల్‌పై ఉన్నారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు మంగళవారం రాత్రి గుండె పోటు రావడంతో తుదిశ్వాస విడిచినట్లు సహారా గ్రూప్ ప్రకటించింది. రాయ్ మృతిని వైద్యులు, సంస్థ ప్రతినిధులు నిర్ధారించారు. సుబ్రతా రాయ్‌ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి