iDreamPost

సైలెంట్ అయిన రీ’మేకు’లు

సైలెంట్ అయిన రీ’మేకు’లు

ఈ మధ్య మనవాళ్ళ కన్ను మలయాళం మీద ఎక్కువ పడుతోంది. అక్కడేదైనా సినిమా హిట్టవ్వడం ఆలస్యం వెంటనే రైట్స్ కొనేసుకుని క్యాస్టింగ్ ని సెట్ చేసుకునే పనిలో పడుతున్నారు. మెగాస్టార్ అంతటివాడే ఆల్రెడీ తెలుగులో డబ్బింగ్ అయిన లూసిఫర్ రీమేక్ కు సిద్ధపడ్డారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మరికొన్ని కేరళ బ్లాక్ బస్టర్స్ ఇప్పుడు ఇక్కడ క్యూలో నిలుచుంటున్నాయి. వాటిలో మొదటిది డ్రైవింగ్ లైసెన్స్. ఆ మధ్య రామ్ చరణ్ హక్కులు కొన్నాడని టాక్ వచ్చింది కాని ఆ తర్వాత లాక్ డౌన్ దెబ్బకు ఎలాంటి అప్ డేట్స్ రావడం లేదు.

మెగా కంపౌండ్ లో ఓ హీరోతో మరో స్టార్ ని కలిపి తీసే ఆలోచన ఉన్నట్టు వినిపించింది. తాజాగా పవన్ కళ్యాణ్ కు ఈ సినిమా చూపించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్టు టాక్ వస్తోంది. ఇదిలా ఉండగా కొన్ని వారాల క్రితం మీడియాలో తెగ హడావిడి చేసిన మరో మల్టీ స్టారర్ అయ్యపనుం కోశియుమ్ ఉన్నట్టుండి సైలెంట్ అయ్యింది . బాలయ్య, రానాలతో తీస్తారని కొంత ప్రచారం జరిగింది కాని ఇద్దరూ ఒప్పుకోలేదని తర్వాత తెలిసింది. అధికారిక ప్రకటనలు అయితే ఏవీ రాలేదు. హక్కులు కొన్నారని చెబుతున్న సితార బ్యానర్ సైతం దీని గురించి సైలెంట్ గానే ఉంది.

నిజానికి ఈ రెండు సినిమాలు మన నేటివిటీకి, ప్రేక్షకుల సెన్సిబిలిటీస్ కి అంత ఈజీగా సెట్ అయ్యేవి కావు. ఆ లెక్కన వీటి కన్నా పెద్ద హిట్టైన కుంబలాంగి నైట్స్ ని కూడా తీసుకోవచ్చు. కాని ఇలాంటివి ఇక్కడ ఆడవు. అక్కడ చరిత్ర సృష్టించిన ప్రేమమ్ ఇక్కడ జస్ట్ హిట్ అనిపించుకుంది కాని అద్భుతాలు చేయలేకపోయింది. అందుకే డ్రైవింగ్ లైసెన్స్, అయ్యపనుం కోషియుంల వ్యవహారం అంత సులభంగా ఉండకపోవచ్చు. ఈ ఏడాది ఫ్రెష్ హిట్ గా నిలిచిన సైకో క్రైమ్ థ్రిల్లర్ అంజాం పతిరాను వైపు కూడా మనవాళ్ళు కన్నేశారట. లాక్ డౌన్ అయ్యాక అన్నింటిమీదా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి