iDreamPost

చంద్రబాబు దిగజారి వ్యవహరిస్తున్నారు : రాపాక

చంద్రబాబు దిగజారి వ్యవహరిస్తున్నారు : రాపాక

అసెంబ్లీలో మిగతా సభ్యులు మాట్లాడేది ఒకెత్తు, జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాట్లాడేది ఒకెత్తు అవుతోంది. ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించడం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు పరిపాటిగా మారగా, ప్రభుత్వానికి మద్దతుగా నిలవడము రాపాకకు అలవాటుగా మారింది. ఇక శాసన మండలి రద్దు విషయంలో కూడా ఆయన అదే మార్గాన్ని అనుసరించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబును సైతం వదల్లేదు. ఆయన దిగజారి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

వికేంద్రీకరణ బిల్లుకు మండలిలో టీడీపీ అడ్డుతగలడం దారుణమన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయాలను స్వాగత్తిస్తున్నానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతి సందర్భంలోనూ టీడీపీ అడ్డుపదుతోందని విమర్శించారు.

అసెంబ్లీలో మేధావులు, డాక్టర్లు, ఐపీఎస్‌ అధికారులు ఉండగా.. ఇక పెద్దల సభ ఎందుకంటూ సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలతో తాను కూడా ఏకీభవిస్తున్నా అని అన్నారు. ఇంతమంది రాజకీయ ప్రముఖులు ఉన్నాక.. మళ్లీ మండలి అవసరం లేదన్నారు.

‘154 మంది శాసన సభ్యలు ఆమోదం తెలిపిన బిల్లును మండలి తిరస్కరించడం దురదృష్టకరం. ఇంగ్లీష్‌ మీడియం బిల్లును కూడా మండలిలో టీడీపీ అడ్డుకుంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఆయన స్థాయికి దిగజారి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఏకంగా మండలి చైర్మన్‌ షరీఫ్‌ను కూడా ఆయన ప్రభావితం చేశారు. బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపుతున్నాను అని చెప్పడానికి చైర్మన్‌ ఎంతో ఇబ్బంది పడ్డారు. ఈ విధంగా చేయడం చంద్రబాబుకు సరికాదు.

ముఖ్యంగా విద్యాభివృద్ధి కొరకు సీఎం జగన్‌ చేపడుతున్న చర్యలు అభినందనీయం. అన్ని వర్గాలు, ప్రాంతాలను అయన సమానంగా చూస్తున్నారు’ అని తన ప్రసంగంలో పేర్కొన్నారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి