Idream media
Idream media
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ ప్రమాణాల చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఇది తెలుగుదేశం మొదలుపెట్టిన నయా నాటకం. ఊ.. అంటే ప్రతీదానికీ దేవుడ్ని అడ్డం పెట్టుకుంటోంది. టీడీపీ ఎమ్మెల్యే అయినా, మాజీ ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా చివరకు లోకేశ్ బాబు అయినా అందరూ ప్రమాణం చేద్దాం రండి.. దేవుడిపై ఒట్టేసి చెబుతున్నా.. అంటూ సవాళ్లు విసురుతున్నారు. ఏదో సినిమాలో ఒట్టేసి ఒక మాట.. వేయకుండా ఓ మాట చెప్పనమ్మా అని హీరో అంటే టీడీపీ నేతలు మాత్రం ఒట్టేస్తేనే నిజం చెబుతారో.. ఏమో అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వారికి కూడా అలాగ చెబుతానే నిజం అని నమ్ముతారని భావించారో ఏంటో కానీ వైసీపీ ఎమ్మెల్యే కూడా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్కు ప్రమాణం చేసే ఆయన ఆరోపణలకు సమాధానం చెప్పారు.
నాలుగు రోజుల క్రితం టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య హత్యకు సంబంధించి ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తమ పార్టీ నాయకుడు సుబ్బయ్య హత్యకు ప్రధాన పాత్రధారులు, సూత్రధారులుగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి, ఆయన బామ్మర్ది బంగారురెడ్డి, కమిషనర్ రాధ పేర్లను లోకేశ్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు పట్టణంలోని కొట్టాలలోని చౌడమ్మ ఆలయంలో ఎమ్మెల్యే శివప్రసాద్రెడ్డి ప్రమాణం చేశారు. నందం సుబ్బయ్యతో తనకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి సంబంధం లేదని ఆయన ప్రమాణం చేశారు.
సుబ్బయ్య హత్యకు గురి అవుతారని తనకు తెలిసి ఉంటే.. అమ్మవారి సాక్షిగా ఆపేవాడినని ఆయన అన్నారు. చౌడమ్మ తల్లి పాదాల సాక్షిగా చెబుతు న్నానని, తానేమైనా తప్పుగా చెప్పి ఉంటే అమ్మవారి శిక్షకు గురౌతానని ఎమ్మెల్యే అన్నారు.
ఈ సందర్భంగా ఆయన లోకేశ్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నిరుద్యోగి అయిన నారా లోకేశ్ స్వయంగా ప్రొద్దుటూరులో పోటీ చేసేట్టైతే, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఎన్నికల్లో నందం సుబ్బ య్య హత్యనే అజెండాగా ప్రజల్లోకి వెళ్దామని ఆయన పిలుపునిచ్చారు. సుబ్బయ్య హత్యతో తనకే మాత్రం సంబంధం లేదని తాను, సంబంధం ఉందని లోకేశ్ ప్రజల్లోకి వెళ్లి తీర్పు కోరుదామని సవాల్ విసిరారు. ఒకవేళ ప్రజలు తనను ఓడిస్తే … తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని లోకేశ్కు బంపర్ ఆఫర్ ఇచ్చారు.