iDreamPost

ఎన్టీఆర్, ప్రభాస్ తో రాజమౌళి మల్టీస్టారర్!

ఎన్టీఆర్, ప్రభాస్ తో రాజమౌళి మల్టీస్టారర్!

దర్శకధీరుడు రాజమౌళి ఇంకా ‘ఆర్ఆర్ఆర్’ హడావుడి నుంచి బయటకు రాలేదు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని ఆస్కార్ బరిలో నిలిపే ప్రయత్నాలలో ఉన్నాడు. ఆ తర్వాత మహేష్ బాబుతో చేయబోయే సినిమా స్క్రిప్ట్ పై దృష్టి పెట్టనున్నాడు. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికే ఇంకా చాలా టైం పడుతుంది. అలాంటిది అప్పుడే రాజమౌళి దాని తర్వాత చేయబోయే సినిమా గురించి కూడా ప్రచారం మొదలైంది.

మహేష్ సినిమా అనంతరం జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ కలయికలో రాజమౌళి పాన్ వరల్డ్ రేంజ్ లో ఓ మల్టీస్టారర్ చేయనున్నాడని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ లను కలిపిన రాజమౌళి.. ఈసారి ఎన్టీఆర్, ప్రభాస్ లను కలపడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్, ప్రభాస్ లతో రాజమౌళికి ఎంతో అనుబంధముంది. ఇప్పటికే ఎన్టీఆర్ తో నాలుగు, ప్రభాస్ తో మూడు చిత్రాలు చేశాడు. రాజమౌళి తలచుకుంటే వాళ్ళిద్దరినీ కలపడడం పెద్ద కష్టమేమి కాదు. అయితే ప్రస్తుతం జరుగుతున్న మల్టీస్టారర్ ప్రచారం మాత్రం నమ్మశక్యంగా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రాజమౌళి ఒక సినిమా చేసే సమయంలో తదుపరి సినిమా గురించి పెద్దగా ఆలోచించడు. పైగా ఇంకా మహేష్ సినిమా స్క్రిప్ట్ కూడా రెడీ కాలేదు. ఆ చిత్రం మొదలై పూర్తి కావాలంటే కనీసం రెండు, మూడేళ్లు పడుతుంది. అలాంటిది రాజమౌళి అప్పుడే తన తదుపరి సినిమా గురించి ఓ నిర్ణయానికి వచ్చాడంటే నమ్మడం కాస్త కష్టమే. పైగా రాజమౌళి ఆలోచనలు ఊహలకు కూడా అందవు. ‘మగధీర’ తర్వాత ఏ స్టార్ తో సినిమా చేస్తాడో అనుకుంటే.. ఊహించని విధంగా సునీల్ తో ‘మర్యాద రామన్న’ చేశాడు. ఇక ‘బాహుబలి’ తర్వాత ఎన్టీఆర్ తో ‘గరుడ’ చేస్తానని చెప్పి.. సర్ ప్రైజింగ్ గా ఎన్టీఆర్, చరణ్ తో ‘ఆర్ఆర్ఆర్’ అనే మల్టీ స్టారర్ చేశాడు. ఇప్పుడసలే మహేష్ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్న జక్కన్న.. ఆ తర్వాత ఎవరితో ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తాడో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి