Dharani
Dharani
వాట్సాప్ అందుబాటులోకి వచ్చాక మెసేజింగ్, కాల్స్, వీడియో కాల్స్, ఫోటోలు, వీడియోలు పంపిచుకోవడానికి అవకాశాలు పెరిగాయి. ఇక వినియోగాదారులకు అవసరాలకు తగ్గట్టుగా వాట్సాప్లో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ.. సరికొత్త ఫీచర్లను యాడ్ చేస్తూ వస్తున్నారు. అయితే అప్పుడప్పుడు వాట్సాప్ వేదికగా మోసాలు చోటు చేసుకునే ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే తాజాగా వాట్సాప్ వేదికగా మరో మోసం వెలుగులోకి వచ్చింది. ఈ మధ్యకాలంలో పింక్ వాట్సాప్ను డౌన్లోడ్ చేసుకొండి అన్ని కొన్ని లింకులు వస్తున్నాయి. సాధారణంగా వాట్సాప్ గ్రీన్ కలర్లో ఉంటుంది. కానీ ప్రస్తుతం పింక్ వాట్సాప్ను డౌన్లోడ్ చేసుకోమంటూ సూచిస్తున్నారు. లింక్ కూడా పంపిస్తున్నారు. పొరపాటున దాన్ని క్లిక్ చేస్తే.. ఇక మీ పని అంతే అంటున్నారు అధికారులు. ఆ వివరాలు..
సైబర్ నేరాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. జనాలను మోసం చేయడానికి ఉన్న ఏ అవకాశాన్ని నిందితులు వదులుకోవడం లేదు. లక్కీడిప్లు మొదలు.. ఓటీలు, ఆన్లైన్ డెలివరీలు.. ఇలా అన్ని రకాలుగా జనాలను మోసం చేస్తున్నారు. ఆఖరికి ప్రభుత్వ పథకాల పేర్లు చెప్పి కూడా మోసాలకు పాల్పడుతున్నారు. అలానే మెసేజింగ్ యాప్ల ద్వారా సైబర్ నేరాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పింక్ వాట్సాప్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. వాట్సాప్ లోగో పింక్ కలర్లోకి మారిందంటూ, త్వరగా అప్డేట్ చేసుకోవాలని మెసేజ్లు, లింక్లు పంపిస్తున్నారు. ఒక్కసారి అవి క్లిక్ చేశామా.. ఇక అంతే..
ఇప్పటికే ఈ స్కామ్కు సంబంధించి.. ముంబయి, కేరళ, కర్నాటక తదితర రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ, పోలీసు శాఖలు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశాయి. ‘‘వాట్సాప్ పింక్ -ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం రెడ్ అలర్ట్’’ అంటూ ఉత్తర ప్రాంత సైబర్పోలీస్ క్రైమ్ వింగ్ హెచ్చరిస్తూ.. ఒక ట్వీట్ చేసింది. పెరుగుతున్న పింక్ వాట్సాప్ స్కామ్ కేసులకు వ్యతిరేకంగా ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి.
వాట్సప్లో మరిన్ని ఫీచర్స్ పొందాలన్నా.. అప్డేట్స్ గురించి వెంటనే తెలుసుకోవాలంటే.. కొత్తగా వచ్చిన పింక్ కలర్ వాట్సాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సైబర్ నేరగాళ్లు మెసేజ్లు పంపుతున్నారు. వారు పంపిన లింక్ను క్లిక్ చేయగానే వాట్సాప్ డౌన్లోడ్ అవుతుంది. తర్వాత మనకు తెలియకుండానే ఫోన్లో ఉన్న నంబర్లన్నీ హ్యాకర్ల చేతికి వెళ్లిపోతాయి. అంతేకాకుండా మన మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ అందరికి పింక్ వాట్సాప్ డౌన్లోడ్ చేసుకోవాలనే లింక్ వెళ్లిపోతుంది ఒక్క సారి ఈ పింక్ కలర్ వాట్సాప్ను గనక మన సెల్లో డౌన్లోడ్ చేసుకుంటే.. ఆర్థిక పరమైన వివరాలు, బ్యాంకు ఖాతా, ఓటీపీ లాంటి వివరాలు కూడా హ్యాకర్ల చేతికి వెళ్లిపోతాయి.
అంతేకాక పింక్ వాట్సాప్ను మన మొబైల్లో డౌన్లోడ్ చేయగానే యూజర్కు తెలియకుండానే ఒక హానికరమైన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది. దీని ద్వారా మొబైల్ ఆక్సెస్ను వినియోగదారుడు పూర్తిగా కోల్పోతాడు. అందుకే ఈ పింక్ వాట్సాప్ స్కామ్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఇప్పటికే పింక్ వాట్సాప్ వాడుతున్నట్లయితే వెంటనే తొలగించి, ఫోన్ను బ్యాక్ప్ చేయాలని తెలిపారు. అంతేకాక మనకు ఏవైనా యాప్స్ అవసరం ఉంటే.. లింక్ల ద్వారా కాకుండా.. కేవలం గూగుల్ ప్లే స్టోర్లో మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.