iDreamPost

పండుటాకుల్లో భరోసా నింపి ఏడాది.. భయాలు పటాపంచలు..

పండుటాకుల్లో భరోసా నింపి ఏడాది.. భయాలు పటాపంచలు..

ప్రజాస్వామ్యం అర్థానికి వాస్తవరూపం తీసుకొస్తూ పరిపాలనలో అనేక విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. ప్రజల మేముల్లో చిరునవ్వులు చిందింపజేస్తున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేసిన సంస్కరణలు ప్రజలకు గొప్ప సేవలను అందిస్తున్నాయి. ఇందులో పింఛన్‌ డోర్‌ డెలివరీ విధానం వృద్ధులకు ఎంతో ఉపసమనం కలిగిస్తోంది. నెల ప్రారంభంలో అందుకోవాల్సిన పింఛన్‌ నగదు కోసం పింపిణీ చేసే అధికారి ఎప్పుడొస్తారా..? అని ఎదురుచూపులు, వేలిముద్రలు పడలేదని పడిగాపులు, రోజుల తరబడి నిరీక్షణలకు చెక్‌పెడుతూ.. వైసీపీ సర్కార్‌ లబ్ధిదారుల ఇంటికి వద్దనే పింఛన్‌ ఇచ్చే సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టి ఏడాది అవుతోంది. గత ఏడాది ఫిబ్రవరి నెల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్ల ద్వారా పింఛన్‌ సొమ్ము పంపిణీ కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు.

అందరికీ ఒకే రోజు..

పింఛన్‌ తీసుకోవడంలో ఎదురవుతున్న అన్ని సమస్యలకు ఫుల్‌స్టాప్‌ పెట్టిన సీఎం వైఎస్‌ జగన్‌.. ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగా పింఛన్‌ సొమ్మును లబ్ధిదారులకు ప్రతి నెల ఒకటో తేదీన అందిస్తున్నారు. ఇంకా ఎవరైనా అందుబాటులో లేకపోతే రెండో రోజు, మూడో రోజున అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.70 లక్షల వార్డు, గ్రామ వలంటీర్ల ద్వారా ప్రతి నెలా 61.54 లక్షల మందికి పింఛన్‌ సొమ్మును అందిస్తున్నారు. వృద్ధులు, వికలాంగులు, ఒంటరిమహిళలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు.. ఇలా 12 విభాగాల్లో పింఛన్‌ అందిస్తున్నారు. పింఛన్‌ డోర్‌ డెలివరీ విధానం వల్ల లబ్ధిదారులుకు సమయం ఆదా కావడగంతోపాటు.. ఎదురుచూపులు తప్పాయి.

అనుమానాలు పటాపంచలు..

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల పింఛన్‌ సొమ్ము పంపిణీపై అనేక అనుమానాలు ఏర్పడ్డాయి. వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంతోపాటు.. వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లు కూడా తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వల్ల వలంటీర్ల ద్వారా జరిగే పింఛన్‌ డోర్‌ డెలివరీ కార్యక్రమానికి ఆటంకం కలుగుతుందని భావించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని, ఎన్నికల వల్ల ప్రజలు ఇబ్బందిపడకూడదని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఎప్పటిలాగే పింఛన్‌ సొమ్ము పంపిణీ నెలలో మొదటి రోజునే జరిగింది. ఈ రోజు ఫిబ్రవరి ఒకటో తేదీన ఎప్పటిలాగే వలంటీర్లు పింఛన్‌ సొమ్ము చేత పట్టుకుని లబ్ధిదారుల ఇళ్లకు వేకువజామునే వెళ్లారు. తమ వద్ద ఉన్న సెల్‌ఫోన్లలో వేలిముద్రలు తీసుకుని పింఛన్‌ నగదు అందించడంతో లబ్ధిదారుల్లో నెలకొన్న ఆందోళనలు తొలగిపోయాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి