iDreamPost

నిమ్మగడ్డలో మొదలైన అంతర్మథనం..!

నిమ్మగడ్డలో మొదలైన అంతర్మథనం..!

పంచాయతీ తొలి విడత ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ చెవిన పడే ఉంటాయి. బాబు మాటలు ద్వారా నిమ్మగడ్డకు భవిష్యత్‌పై ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసుంటుంది. బాబును నమ్మి తాను ఇలా ఎలా నడిచానా అన్న ఆంతర్మథనం నిమ్మగడ్డలో ప్రారంభమైయ్యే ఉంటుంది. అంతలా చంద్రబాబు.. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను ఉద్దేశించి మాట్లాడారు.

మాచర్ల, పుంగనూరులో బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయంటూ «ధ్వజమెత్తిన చంద్రబాబు.. అక్కడ జరిగిన ఏకగ్రీవాలకు ఎస్‌ఈసీనే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా, సక్రమంగా జరగడం అంటే ఇదేనా..? అంటూ ప్రశ్నించారు. వైసీపీ చేసిన అరాచకాలు ఎస్‌ఈసీకి కనిపించడం లేదా..? అని నిలదీశారు. ఎస్‌ఈసీ ఏం చేస్తోందంటూ ఫైర్‌ అయ్యారు. వందల కొద్దీ ఫిర్యాదులు చేసినా ఎస్‌ఈసీ, కలెక్టర్లు పట్టించుకోలేదని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.

ఎన్నికల ఫలితాలు తాను ఊహించని విధంగా రావడంతో బాబుకు పాలుపోలేదని ఆయన మాటల ద్వారా అర్థమైంది. వైసీపీ మద్ధతుదారుల విజయాన్ని, వైసీపీ బలాన్ని తక్కువ చేసి చూపేందుకు ఏదో ఒక కారణం కావాలి. ఎవరో ఒకరు కావాలి. ఈ సారి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ చంద్రబాబుకు దొరికారు. ఎన్నికల్లో అక్రమాలు, అరాచకాలు జరిగాయని, ఎస్‌ఈసీ అడ్డుకోలేకపోయిందంటూ నెపం ఎస్‌ఈసీపై నెట్టారు.

టీడీపీ ఫిర్యాదులను ఎస్‌ఈసీ పట్టించుకోలేదనేది పూర్తి అవాస్తవమని చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో జరిగిన ఏకగ్రీవాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఘటన ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ఆయా జిల్లాపై ఈ నిర్ణయం తీసుకునేందుకు పుంగనూరు, మాచర్ల నియోజకవర్గాల్లో జరిగిన ఏకగ్రీవాలే కారణమనేది తెలిసిన విషయమే. ప్రతి పంచాయతీపై సమగ్రమైన నివేదికను కలెక్టర్ల నుంచి తెప్పించుకుని, వాటిని సునిశితంగా పరిశీలించిన తర్వాతనే.. నిమ్మగడ్డ పచ్చ జెండా ఊపారు. ఈ పరిణామం నిమ్మగడ్డకు, పంచాయతీ రాజ్‌ మంత్రికి మధ్య పెద్ద వివాదానికి కారణం కూడా అయింది. మంత్రిపై అనుచితమైన చర్యలు తీసుకున్న నిమ్మగడ్డ.. కోర్టు తీర్పుల ద్వారా చీవాట్లు కూడా తినాల్సి వచ్చింది.

ఎస్‌ఈసీ ప్రతిష్టను, తన వ్యక్తిగత గౌరవాన్ని కూడా ఫణంగా పెట్టిన నిమ్మగడ్డ.. చంద్రబాబు కోసం పని చేశారు. నిమ్మగడ్డ వ్యవహార శైలిని ఉద్దేశించి వైసీపీ నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఇన్ని అపవాదులు ఎదుర్కొన్నా కూడా నిమ్మగడ్డకు ఫలితం దక్కలేదు. పైగా చంద్రబాబు నుంచి ఇలాంటి స్పందన ఊహించి ఉండరు. బాబు ఇలా ఎందుకు మారారన్నది తెలిసిన విషయమే. ఎదుటి వ్యక్తి వల్ల ఉపయోగం ఉంటే నెత్తిపెట్టుకోవడం, లేదంటే నిర్ధాక్షణ్యంగా వ్యవహరించే చంద్రబాబు తీరు నిమ్మగడ్డకు ఈ పాటికే అర్థమై ఉంటుంది.

బాబుతో వ్యవహారం ఎలా ఉంటుందో వైసీపీ నేతలు నిమ్మగడ్డకు ముందే చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత బాబు తీరు నిమ్మగడ్డ పట్ల ఎలా ఉంటుందో కూడా హెచ్చరించారు. ఎన్నికలు పూర్తవడం కాదు.. ఈ లోపే వైసీపీ నేతల అంచనాలు నిజమవుతున్నాయి. ఇప్పుడు జ్ఞానోదయం అయినా, అంతర్మథనం చెందినా ఉపయోగం ఉండబోదు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వల్ల ఫలితం ఉండదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి