iDreamPost
iDreamPost
‘మమ్మల్ని భయపెట్టవద్దు.. రైతులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు’.. అంటూ ఘాటైన పదజాలంతో దివంగత బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్పేయి హెచ్చరిస్తున్నట్లున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 1980 ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఉద్యమించిన సందర్బంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని ఉద్దేశించి ప్రతిపక్షంలో ఉన్న వాజ్పేయి చేసిన ఈ వ్యాఖ్యల వీడియో ఇపుడు బయటకు రావడం విశేషం. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఈ వీడియోను తాజాగా ట్విటర్లో పోస్టు చేసి సొంత పార్టీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం కలకలం రేపుతోంది. అప్పట్లో బీజేపీ రైతు ఉద్యమానికి మద్దతుగా నిలిస్తే.. ప్రస్తుతం యూపీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు రైతు ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తుండటం చర్చకు తావిస్తోంది.
ఆ వీడియోలో ఏం ఉంది?
వరుణ్ గాంధీ పోస్ట్ చేసిన వీడియోలో అప్పటి ప్రతిపక్ష నేత వాజ్పేయి ప్రసంగిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. ‘మమ్మల్ని భయపెట్టవద్దు. రైతులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. రైతు ఉద్యమాలను రాజకీయాలకు వాడుకోవడం మాకు ఇష్టం లేదు. కానీ న్యాయమైన వారి డిమాండ్లకు మద్దతుగా నిలుస్తాం. ప్రభుత్వం అణిచివేతకు పాల్పడితే రైతు ఉద్యమంలో మేం కూడా భాగస్వాములం అవుతాం’ అని నాటి ఇందిర ప్రభుత్వాన్ని వాజ్పేయి హెచ్చరించిన దృశ్యాలున్న ఈ వీడియోతో పాటు విశాల హృదయం ఉన్న నేత చెప్పిన మంచి మాటలు అనే వ్యాఖ్యను జోడించి వరుణ్ గాంధీ ట్విటర్లో పోస్టు చేశారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ నేత హెచ్చరిస్తే.. ఇప్పుడు బీజేపీ ఎంపీ అయిన వరుణ్ గాంధీయే సొంత పార్టీ ప్రభుత్వాన్ని రైతులకు మద్దతుగా నిలదీస్తుండటం విశేషం.
Also Read : Manmohan Singh-AIIMS-ఎయిమ్స్ లో చేరిన మన్మోహన్.. జ్వరమే అంటున్న కాంగ్రెస్.. కానీ?
రైతులకు మద్దతుగా ఏకైక బీజేపీ ఎంపీ
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త వ్యవసాయ చట్టాలను తప్పు పడుతూ.. వాటికి వ్యతిరేకంగా నెలల తరబడి ఉద్యమాలు నిర్వహిస్తున్న రైతులకు మద్దతు ప్రకటించిన ఏకైక బీజేపీ ఎంపీగా వరుణ్ గాంధీ గుర్తింపు పొందారు. అంతేకాకుండా ఇటీవల కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడి కారు రైతుల ప్రదర్శనపైకి దూసుకుపోయి తొమ్మిది మంది మృతి చెందిన ఘటనలో కూడా ఆయన రైతుల పక్షాన నిలబడ్డారు. ఆ ఘటన వీడియోను ట్విటర్లో పెట్టి నలుగురు రైతుల మృతికి పెద్దలు బాధ్యత వహించాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో ఇటీవల ప్రకటించిన పార్టీ జాతీయ కార్యవర్గంలో వరుణ్ గాంధీ తోపాటు అతని తల్లి కేంద్ర మాజీమంత్రి మేనకగాంధీకి కూడా చోటులేకుండా చేసి బీజేపీ నాయకత్వం బదులు తీర్చుకుంది. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గని వరుణ్ గాంధీ రైతులకు మద్దతుగా గళం విప్పుతూనే ఉన్నారు. మృతి చెందిన రైతు కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని,లఖింపూర్ ఖేరి ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ యూపీ సీఎం యోగి అదిత్యనాథ్ కు లేఖ రాశారు. తాజాగా వాజ్పేయి వీడియోతో మరోసారి పార్టీని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఇరుకున పెట్టారు.
Also Read : బీజేపీలో ఆ ముగ్గురి కథ ముగిసిందా?