iDreamPost
android-app
ios-app

ముందడుగు వేసిన ఉప్పెన

  • Published Dec 15, 2020 | 7:13 AM Updated Updated Dec 15, 2020 | 7:13 AM
ముందడుగు వేసిన ఉప్పెన

సుప్రీమ్ హీరో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందిన ఉప్పెన లాక్ డౌన్ కు ముందే షూటింగ్ పూర్తి చేసుకున్నా విడుదల కోసం ఇప్పటిదాకా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. మిగిలిన సినిమాలు సంక్రాంతి రిలీజ్ అని ప్రకటనలు ఇస్తున్నప్పటికీ ఉప్పెన టీమ్ మాత్రం ఇప్పటిదాకా మౌనాన్ని ఆశ్రయిస్తూ వచ్చింది. తొలుత క్రిస్మస్ అనుకున్నారు కానీ స్వంత అన్నయ్యకే పోటీ వెళ్తే బాగుండదు కాబట్టి డ్రాప్ అయ్యారు. అసలు ఇంతకీ జనవరిలో అయినా వస్తారా లేక మళ్ళీ వాయిదా పడుతుందా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. మ్యూజిక్ ఇప్పటికే బ్లాక్ బస్టర్ అవ్వడం దీనికి పాజిటివ్ సంకేతం.

ఇదిలా ఉండగా డిజిటల్ డీల్ విషయంలో మాత్రం ఉప్పెన ముందడుగు వేసింది. నెట్ ఫ్లిక్స్ దీని హక్కులు సొంతం చేసుకున్నట్టు సమాచారం. మంచి ధరకే ఒప్పందం కుదిరిందని వినికిడి. అయితే ఇది డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కోసం కాదు. కేవలం థియేటర్ రన్ పూర్తయ్యాకే ఇది అమలులోకి వస్తుంది. అయితే ఇతర టర్మ్స్ ఏమైనా రాసుకున్నారేమో ఇంకా తెలియాల్సి ఉంది. తనకు విపరీతమైన పోటీ ఇస్తున్న అమెజాన్ ప్రైమ్ ను తట్టుకొవడం కోసం నెట్ ఫ్లిక్స్ తాజాగా రీజనల్ కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెంచుతోంది. అందులో భాగంగానే తెలుగు తమిళ సినిమాల హక్కుల కోసం బడ్జెట్ పెంచుతోంది.

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయమవుతున్న ఉప్పెనలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా విజయ్ సేతుపతి నెగటివ్ షేడ్స్ లో సాగే చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఇది హై లైట్ అవుతుందని ఇప్పటికే టాక్ ఉంది. ఒకవేళ జనవరి మిస్ అయితే ఉప్పెన ఫిబ్రవరి లేదా మార్చ్ కు వెళ్లడం తప్ప వేరే ఆప్షన్ లేదు. కంటెంట్ మీద గట్టి నమ్మకం ఉన్న నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ లాక్ డౌన్ టైంలో ఎంత ఆఫర్ వచ్చినా డిజిటల్ స్ట్రీమింగ్ కి ససేమిరా ఉన్నారు. తీరా ఇప్పుడు థియేటర్లు తెరుచుకునే సమయానికి నిర్మాతలకు, డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లకు పేచీ వచ్చి పడింది. చూడాలి ఏం జరుగుతుందో.