iDreamPost
android-app
ios-app

పెరుగుతున్న రికవరీల శాతం.. ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా

  • Published Sep 10, 2020 | 2:19 AM Updated Updated Sep 10, 2020 | 2:19 AM
పెరుగుతున్న రికవరీల శాతం.. ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా

కోవిడ్‌ 19 భారిన పడి కోలుకుంటున్న వారి శాతం రోజురోజుకూ మెరుగుపడుతోంది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఈ రేటు కొంచెం ఎక్కువగానే ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్‌ పాజిటివ్‌గా తేలిన 5,27,512 మందిలో 4,25,607 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో యాక్టివ్‌ కసులు 97,271 ఉన్నాయని ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. కాగా గడచిన ఇరవైనాలుగు గంటల్లో 10,418 మంది కోవిడ్‌ భారిన పడ్డారు.

ఇదిలా ఉండగా నేతలు కోవిడ్‌ భారిన పడడం కొనసాగుతోంది. మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కేగా ప్రసిద్ధి పొందిన ఆళ్ళ రామకృష్ణారెడ్డికి కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ మేరకు ఫలితం రావడంతో హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు. స్వల్ప లక్షణాలే ఉన్నాయని, తనను కలిసిన వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆర్కే కోరారు. టీడీపీ జాతీయ కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్‌పై విజయం సాధించిన ఆయన దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు.

తుని ఎమ్మెల్యేకు కరోనా..

కోవిడ్‌ 19 తన ఉధృతిని ఏ మాత్రం తగ్గించడం లేదు. దీంతో సామాన్య ప్రజలే కాకుండా ప్రజాప్రతినిధులు, ప్రముఖులు కూడా దాని భారిన పడుతున్నారు. కోవిడ్‌ఉధృతి ఎక్కువగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో మరో ఎమ్మెల్యే కోవిడ్‌ భారిన పడ్డారు. తుని ఎమ్మెల్యే ఏపీ ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాడిశెట్టి రాజాకు కోవిడ్‌ 19 పాజిటివ్‌గా వైద్యులు తేల్చారు. చికిత్స నిమిత్తం ఆయన ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.