విజయవాడలో కోవిడ్ సెంటర్ కోసం రమేష్ ఆస్పత్రి నిర్వహిస్తున్న స్వర్ణ ప్యాలెస్లో జరిగిన అగ్నిప్రమాదంపై 48 గంటల్లోనే ఆంధ్రప్రదేశ్ సర్కార్ బాధ్యులపై చర్యలు చేపట్టింది. రమేష్ ఆస్పత్రి సిబ్బంది కె.సుదర్శన్, కె.రాజగోపాలరావు, వెంకటేష్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ప్రమాదంలో కోవిడ్ చికిత్స కోసం వచ్చిన 13 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్థారించిన ప్రభుత్వం.. ఈ రోజు ఉదయం నుంచి వివిధ విభాగాల అధికారులతో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రమేష్ ఆస్పత్రి, స్వర్ణ ప్యాలెస్ యజమానుల నివాసంలో తనికీలు చేపట్టింది. ముఖ్యమైన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రమేష్ ఆస్పత్రిలో జరుగుతున్న కోవిడ్ చికిత్స ప్రమాణాలను పరిశీలించారు.
కాగా, ఈ ప్రమాదంపై మొదటిసారి స్పందించిన రమేష్ ఆస్పత్రి ఎండీ రమేష్బాబు వీడియోను విడుదల చేశారు. స్వర్ణ ప్యాలెస్ ప్రమాద ఘటనతో తమకు ఏ మాత్రం సంబంధం లేనట్లుగా మాట్లాడారు. హోటల్ నిర్వహణ స్వర్ణప్యాలెస్ యాజమాన్యం చూసుకుంటే.. తాము కేవలం వైద్యం మాత్రమే అందించేలా ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పుకొచ్చారు. జిల్లా కలెక్టర్కు దర ఖాస్తు చేసుకునే అనుమతి తీసుకున్నామని పేర్కొన్నారు.