రెండు దశాబ్దాల క్రితం 2000 సంవత్సరంలో ఉదయ్ కిరణ్, రీమా సేన్ లను పరిచయం చేస్తూ సుప్రసిద్ధ ఈనాడు అధినేత రామోజీ రావు నిర్మించిన చిత్రం సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్టో ఎవరూ మర్చిపోలేరు. టీనేజ్ లవ్ ని సెన్సిబుల్ యాంగిల్ లో టచ్ చేస్తూ తొందరపడి పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చే ఇబ్బందులను దర్శకుడు తేజ వినోదాత్మకంగా అందించిన తీరు యూత్ నే కాదు సగటు ప్రేక్షకులను కూడా మెప్పించింది. అతి తక్కువ బడ్జెట్ లో రూపొందిన చిత్రం వంద రోజులు ఆడిన సెంటర్లు ఉన్నాయి. ముఖ్యంగా కాలేజీ యువత ఎగబడి దీన్ని చూడటంతో కలెక్షన్లు భారీగా వచ్చాయి. ఇప్పటికీ దీని క్రేజ్ దీనిదే.
ఇక ఆర్పి పట్నాయక్ పాటల గురించి చెప్పేముంది. అప్పటిదాకా పరిచయం లేని ఒక డిఫరెంట్ మ్యూజిక్ ని ఇచ్చి ఊపేశారు. ఇదంతా గతం. ఇప్పుడు 21 ఏళ్ళ తర్వాత చిత్రం 1.1 పేరుతో తేజ మరో సినిమా చేయబోతున్నారు. అప్పుడు వర్క్ చేసిన టీమ్ దీనికీ పని చేయనుండటం విశేషం. దీని ద్వారా 45 కొత్త మొహాలను తెరకు పరిచయం చేయబోతున్నట్టు తేజ ప్రకటించాడు. ఉదయ్ కిరణ్ ఈ లోకంలో లేడు కాబట్టి ఆ పాత్ర ఏ రూపంలోనూ ఉండే ఛాన్స్ లేదు. రీమా సేన్ ను తీసుకురావచ్చు. టైటిల్ ని బట్టి చూస్తే ఇది కూడా అవుట్ అండ్ అవుట్ యూత్ లవ్ స్టోరీ లాగే కనిపిస్తోంది.
అయితే తేజ గతంలో చేసిన ఇలాంటి ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. నీకు నాకు డాష్ డాష్, ఒక విచిత్రం, కేక లాంటి సినిమాలు దారుణంగా దెబ్బ తిన్నాయి. ఆ మధ్య బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో సీత తీస్తే డిజాస్టర్ అయ్యింది. ఒక్క రానాతో చేసిన నేనే రాజు నేనే మంత్రి ఒక్కటే చెప్పుకోదగ్గ సక్సెస్ ఫుల్ మూవీ. ఒకప్పుడు నువ్వు నేను, జయం లాంటి చిత్రాలతో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన తేజ ఇప్పుడీ చిత్రం 1.1 తో ఏం చేయబోతున్నాడో చూడాలి. అసలే ఇప్పుడు యూత్ టేస్ట్ మారిపోయింది. బోల్డ్ కంటెంట్ కి పెద్దగా హద్దులు లేవు. అప్పటి చిత్రంలోనే రొమాన్స్ చూపించిన తేజ ఇప్పుడేం చేయబోతున్నాడో చూద్దాం