iDreamPost
iDreamPost
హాస్యబ్రహ్మగా ప్రసిద్ధిగాంచిన జంధ్యాల గారి గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమి లేదు. ఆరోగ్యకరమైన హాస్యానికి కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన అతి కొద్ది దర్శకుల్లో ఆయనది అగ్ర స్థానం. ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా అద్భుత సినిమాలు తీస్తూ ఎక్కడా అశ్లీలతకు తావివ్వకుండా ఇప్పటికీ చూసుకుని ఆనందించే చిత్రాలు ఎన్నో అందించారు. అయితే కేవలం సినిమా టైటిల్ ఆధారంగా ఒక రకమైన విభిన్నమైన అభిప్రాయాన్ని కలిగించుకోవడం కూడా ఓసారి జరిగింది. అదే ‘శ్రీవారి శోభనం’. దాని కథాకమామీషు చూద్దాం. 1985లో ప్రముఖ రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన ‘పెద్దలకు మాత్రమే” నవల చాలా ఆదరణ పొందింది.
దీన్ని సినిమాగా తీస్తే హిట్టవుతుందని కొందరు నిర్మాతలు ప్రయత్నించారు. జంధ్యాల దగ్గరకి ప్రతిపాదన వెళ్ళింది. అయితే ఆయన ముందు తటపటాయించారు. ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారో లేదోనని అనుమానం. అందుకే వెంటనే ఎస్ చెప్పలేదు. పెళ్లి కుదిరిన హీరో శోభనం గదిలో మగాడు అనిపించుకోవడానికి తనను విపరీతంగా ఇష్టపడే ఆఫీస్ సెక్రెటరీతో ఓ ట్రయిల్ వేద్దామనుకుంటాడు. ప్లాన్ చేసుకున్న ప్రతిసారి ఏవేవో అడ్డంకులు ఇబ్బందులు. కానీ అనుకున్న కార్యం జరగదు. చివరికి తన తప్పు తెలుసుకుంటాడు. క్లైమాక్స్ లో పెద్దలు కుదిర్చిన అమ్మాయినే చేసుకుని శోభనం గదిలోకి ప్రవేశిస్తాడు. కథ సుఖాంతమవుతుంది.
కొన్ని చర్చలు పునరాలోచనల తర్వాత జంధ్యాల గారు నవల టైటిల్ ని శ్రీవారి శోభనంగా మార్చి ఎంఎస్ ప్రసాద్, ఆదుర్తి భాస్కర్ నిర్మాతలుగా సూపర్ స్టార్ కృష్ణ సమర్పణలో సినిమాను పూర్తి చేశారు. హీరోయిన్ గా బాబాయ్ అబ్బాయి లో నటించిన అనితారెడ్డిని తీసుకున్నారు. సుత్తివేలు, శ్రీలక్ష్మి, రావికొండలరావు, సుత్తి వీరభద్రరావు, పొట్టి ప్రసాద్ తదితరులు ఇతర తారాగణం. రమేష్ నాయుడు సంగీతం సమకూర్చగా కోటేశ్వర్ రావు ఛాయాగ్రహణం అందించారు. మార్చ్ 1న విడుదలైన శ్రీవారి శోభనం జంధ్యాల గత చిత్రాల స్థాయిలో ఆడకపోయినా ఎంటర్ టైన్మెంట్ ని పుష్కలంగా అందించింది. టైటిల్ ఫ్యామిలీ ఆడియన్స్ ని దూరం చేసిందని అప్పటి క్రిటిక్స్ అభిప్రాయపడ్డారు