iDreamPost
android-app
ios-app

‘మహా’ముదురు..! మహారాష్ట్ర ను కుదిపేసిన సచిన్ వాజే అసలు కథ..

‘మహా’ముదురు..! మహారాష్ట్ర ను కుదిపేసిన సచిన్ వాజే అసలు కథ..

మహారాష్ట్ర ప్రభుత్వాన్నే ఇరకాటంలో పడేయడంతో పాటుగా ఆ రాష్ట్ర హోమంత్రి అనిల్‌దేశ్‌ముఖ్‌ పదవికే గండం తీసుకొచ్చిన సచిన్‌వాజే గురించే ఇప్పుడు నెటిజన్లు ఆరా తీస్తున్నారు? అసలు ఎవరు ఈ సచిన్‌వాజే? ఎంటా అతని చరిత్ర అంటూ ఆరా తీసే పనిలో పడ్డారు.. ఈ వాజే గురించి తెలుసుకుంటే పలు ఆసక్తికర విషయాలు తెలుస్తాయి..

ముంబయిలో అయనో ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు.. దాదాపు 63 మందిని కాల్చి చంపి కిల్లింగ్‌ మెషిన్‌గా పేరు తెచ్చుకొన్నారు. ఓ బాంబు పేలుడు కేసులో నిందితుడు తన కస్టడీలో మరణించడంతో సస్పెన్షన్‌కు గురయ్యాడు.. ఆ తర్వాత కేసు తేలకపోవడంతో రాజీనామా చేసి ఓ పార్టీలో చేరాడు.. అంతేకాదు.. అత్యాధునిక సాంకేతికత వాడటంలో నిపుణుడైన అతడు ఫోన్‌ హ్యాకింగ్‌ వంటి సాధానాలు చేసినట్లు కూడా చెప్పుకొన్నాడు. రెండు పుస్తకాలు కూడా రాశాడు. కానీ సీన్‌కట్‌ చేస్తే 2020లో మళ్లీ ముంబయి పోలీసు శాఖలో చేరాడు. హోదా చిన్నదైనా హైప్రొఫైల్‌ కేసులు అతని వద్దకే వచ్చేవి.. చివరికి ముఖేశ్‌ అంబానీకి బాంబు బెదిరింపుల కేసులో కూడా మొదట్లో ఆయనే హడావుడి చేశాడు. కానీ, అదే కేసులో ఇప్పుడు అనుమానితుడిగా అరెస్టయ్యాడు.

ఎవరీ సచిన్‌ వాజే..

1990లో మహారాష్ట్ర పోలీసు విభాగంలో చేరిన సచిన్‌ తొలుత నక్సల్‌ ప్రభావిత గడ్చిరౌలిలో పనిచేశాడు. ఆ తర్వాత థానే పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ అయ్యాడు. అక్కడి నుంచి పెద్దకేసులు దర్యాప్తు చేస్తూ ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా పేరు తెచ్చుకొన్నాడు. 2003లో ఘుట్‌కోపర్‌ బాంబు పేలుడు కేసులో క్వాజా యూనిస్‌ అనే ఇంజినీర్‌ను అరెస్టు చేశాడు. అతడు కస్టోడియల్‌ డెత్‌కు గురయ్యాడు. ఈ కేసులో 2004లో సస్పెండ్‌ అయ్యాడు. అప్పటి నుంచి పోస్టింగ్‌ ఇవ్వక పోవడంతో 2008లో పోలీస్‌శాఖకు రాజీనామా చేసి శివసేనలో చేరాడు. సాంకేతికతపై మంచి పట్టున్న సచిన్‌ 2010లో లాయ్‌భరి అనే సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ను ప్రారంభించాడు. దీంతోపాటు ఫోన్‌కాల్స్‌ వినడం, మెసెజ్‌లను చూసేలా ఓ సాఫ్ట్‌వేర్‌ కూడా అభివృద్ధి చేసినట్లు అతనే చెప్పుకొన్నాడు. దీంతోపాటు షీనాబోరా హత్య, 26/11లో డేవిడ్‌ హెడ్లీపై రెండు పుస్తకాలు కూడా రాశాడు.

మళ్లీ కీలక పోస్టింగ్‌..!

మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో కొవిడ్‌ వ్యాపించడంతో పోలీసు అధికారులు సరిపోవడంలేదంటూ సచిన్‌వాజేకు అత్యంత కీలకమైన క్రైమ్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌లో పోస్టింగ్‌ ఇచ్చారు. ఆయన చాలా కీలకమైన కేసుల దర్యాప్తులో భాగం అయ్యారు. టీఆర్పీ కుంభకోణం, ఓ ఆత్మహత్య కేసులో ఓ టీవీ చీఫ్‌ ఎడిటర్‌ అరెస్టు కేసు, హృతిక్‌ రోషన్‌కు ఫేక్‌ ఈమెయిల్‌ కేసు, కార్‌ డిజైనర్‌ దిలీప్‌ ఛాబ్రియా కుంభకోణం కేసు వంటివి సచిన్‌ పర్యవేక్షించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 25న రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ ఇంటి వద్ద ఓ స్కార్పియో వాహనంలో కొన్ని జిలెటిన్‌ స్టిక్స్‌ బయటపడ్డాయి. వీటిలో డిటోనేటర్‌ లేదు కాబట్టి ఎటువంటి ప్రమాదం జరగలేదు. లేకపోతే 350 మీటర్ల వరకు పేలుడు ప్రభావం ఉండేది. ఈ కేసు దర్యాప్తునకు తొలుత అక్కడకు వచ్చిన వారిలో సచిన్‌ వాజే కూడా ఉన్నారు. ఇక ఆ వాహనం యజమాని థానేలోని కార్ల ఇంటీరియర్‌ వ్యాపారి మన్‌సుఖ్‌ హిరెన్‌గా గుర్తించారు. అప్పటికి వారం ముందే మన్‌సుఖ్‌ తన వాహనం ఒక చోట నిలిపితే అపహరించారని కేసు పెట్టారు. ఆయన వాహనం అపహరణకు గురైనట్లు చెబుతున్న చోట సీసీ కెమెరాలు లేవు.

మన్‌సుఖ్‌ మరణంతో..

అంబానీకి బెదిరింపుల కేసు దర్యాప్తులో ఉండగానే ముంబయి నుంచి థానేకు వెళ్లే మార్గంలోని ఓ సముద్రపు పాయలో మన్‌సుఖ్‌ మృతదేహం బయటపడటంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అతని మాస్క్‌ వెనుక ఐదు హ్యాండ్‌ కర్చిఫ్‌లను పోలీసులు గుర్తించారు. దీనికి తోడు శరీరం పైగాయాలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. మన్‌సుఖ్‌ గజఈతగాడు కావడంతో దీనిని హత్యగా పేర్కొంటూ ఆయన కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. పేలుడు పదార్థాలు ఉంచిన కారును గతంలో నాలుగు నెలలు ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు సచిన్‌ వాడినట్లు మన్‌సుఖ్‌ కుటుంబీకులు ఆరోపించారు. ఇది రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. దీనికి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ప్రకటన కూడా తోడైంది. దీంతో మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఈ కేసును ఎన్‌ఐఏకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. గత శుక్రవారం సచిన్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

అతి తెలివితో..

పేలుడు పదార్థాలతో స్కార్పియోను కనుగొన్న తర్వాత సచిన్‌ వాజే స్వయంగా వికోర్లి స్టేషన్‌కు ఫోన్‌ చేసి.. ముఖేశ్‌ హిరేన్‌ ఫిర్యాదుతో నమోదు చేసిన వాహన చోరీ కేసును దర్యాప్తు చేయవద్దని కోరారు. మన్‌సుక్‌ హిరేన్‌ ఫిబ్రవరి 18వ తేదీన తన స్కార్పియో పోయిందని వికోర్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 25న ఆ కారు అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో ప్రత్యక్షమైంది. ఆ రోజు సచిన్‌ వాజే నేతృత్వంలో క్రైమ్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ చాలా చురుగ్గా ఈ దర్యాప్తులో పాల్గొంది. ఈ కేసు కూడా సీఐయూకే అప్పజెప్పారు. ఫిబ్రవరి 27వ తేదీన సచిన్‌ వాజే వికోర్లి పోలీస్‌ స్టేషన్‌కు ఫోన్‌ చేసి మాట్లాడాడు. 18వ తేదీన మన్‌సుక్‌ హిరేన్‌ ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన స్కార్పియో కేసు దర్యాప్తును ఆపేయాలని కోరాడు. బాంబు బెదిరింపుల కేసు దర్యాప్తు తన చేతిలో ఉండటంతో.. ఇక 18వ తేదీన వాహన చోరీ దర్యాప్తును కూడా ఆపేస్తే తన పాత్ర బయటపడదని వాజే భావించాడు.

తప్పుడు ఆధార్‌ కార్డుతో..

తప్పుడు పేరు, ఆధార్‌ కార్డు సాయంతో ముంబయిలోని ట్రైడెంట్‌ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో వాజే బసచేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. వేరేవాళ్ల ఆధార్‌కార్డుపై ఫొటోను మార్చి ఉపయోగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. అంతే కాదు.. ఆ హోటల్‌కు కొన్ని భారీ బ్యాగులను కూడా తీసుకొచ్చినట్లు సీసీటీవీ పుటేజీల్లో తేలింది. వాజే హోటల్లో బసచేసినప్పుడు ఎవరెవరు కలిశారనే అంశాన్ని ఎన్‌ఐఏ పరిశీలిస్తోంది. దీంతోపాటు 100 రోజులు అక్కడ ఉండేలా గదిని బుక్‌ చేసినట్లు సమాచారం. మరోపక్క సచిన్‌ వాజే వ్యాపార భాగస్వామి, కార్‌ డీలర్‌ ఆశీష్‌నాథ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

సచిన్‌ వాజే నివసించే గృహ సముదాయం సీసీ కెమేరా ఫుటేజీ, ఆ రికార్డులు ఉండే డీవీఆర్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ  దృష్టి సారించింది. అంబానీ కి బెదిరింపులు వచ్చిన రెండురోజుల్లోనే ఈ కేసు దర్యాప్తు కోసమంటూ సచిన్‌ నివాసం ఉన్న గృహసముదాయం సీసీకెమేరా ఫుటేజీలు ఉన్న డీవీఆర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. వారు కూడా సచిన్‌ వాజే టీమ్ లోని సభ్యులు కావడం జాతీయ దర్యాప్తు సంస్థ అనుమానాలను పెంచేసింది. ఈ కేసులో ఎన్‌ఐఏకు ఓ లేఖ దొరికింది. అంబానీ ఇంటిదగ్గర పేలుడు పదార్థాల వాహనం వెలుగులోకి వచ్చిన తర్వాత రెండు రోజులకే ఈ లేఖను రాసినట్లు తేలింది. ఇది సచిన్‌ వాజే నివసించే రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌ సెక్యూరిటీ విభాగానికి క్రైమ్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ ( వాజే Head) పోలీస్‌ అధికారి రియాజ్‌ ఖ్వాజీ ఓ చిత్తుకాగితంపై ఈ లేఖను రాశారు. అప్పుడు మొత్తం నలుగురు అధికారులు అక్కడకు వెళ్లారు. అంబానీకి బెదిరింపుల కేసును దర్యాప్తు చేస్తున్నాం.. అందుకని ఈ గృహ సముదాయంలో ఉన్న రెండు డిజిటల్‌ వీడియో రికార్డ్లర్లను అప్పగించాలని వారు ఆ లేఖలో కోరారు. ఈ లేఖను సెక్యూరిటీ సిబ్బంది, గృహసముదాయ సంఘ ఛైర్మన్‌కు ఇచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి రెండు డీవీఆర్‌లు తీసుకొని వెళ్లిపోయారు. ఈ లేఖ దొరికాక ఎన్‌ఐఏకు మరికొన్ని కొత్త అనుమానాలు వచ్చాయి. అపహరణకు గురైన మన్‌సుక్‌ను ఫిబ్రవరి 25వరకు ఆ రెసిడెన్షియల్‌ కాంపౌండ్‌లోనే ఉంచినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం అసిస్టెంట్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ రియాజ్‌ ఖ్వాజీని ఎన్‌ఐఏ ప్రశ్నిస్తోంది.