iDreamPost
android-app
ios-app

బ్రిటన్ మళ్లీ లాక్ డౌన్ – అమెరికాలో కరోనా వైరస్ విజృంభణ

  • Published Nov 02, 2020 | 11:25 AM Updated Updated Nov 02, 2020 | 11:25 AM
బ్రిటన్ మళ్లీ లాక్ డౌన్ – అమెరికాలో కరోనా వైరస్ విజృంభణ

బ్రిటన్ లో కరోనా మహమ్మారి తిరిగి విజృంభిస్తోంది. కరోనా రెండవ దశవ్యాప్తి ప్రారంభం కావడంతో గత వారం రోజుల్లో ఆస్పత్రుల్లో చేరిన కరోనా రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఆ దేశం మళ్ళీ లాక్ డౌన్ దిశగా అడుగులు వేసింది. ఈ మేరకు బ్రిటన్ దేశంలో మరోసారి లాక్ డౌన్ అమలు చేస్తున్నట్టు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. నవంబర్ 5 నుండి నాలుగు వారాల పాటు ఈ లాక్ డౌన్ అమలులో ఉంటుందని ప్రకటన విడుదల చేశారు.

తాము తీసుకున్న నిర్ణయానికి ప్రజలు అందరు సహకరించాలని కరోనాను అడ్డుకునేందుకు మరో మార్గం లేక ఈ నిర్ణయం తీసుకునట్టు స్పష్టం చేశారు. రెండవ దశలో మరణాల సంఖ్య అధికంగా ఉంటుందని ఇప్పటికే వైద్య రంగ నిపుణులు హెచ్చరించారని కావున ప్రజలందరు వ్యక్తిగత భాద్యతగా ఉంటూ కరొనా కట్టడికి తమ వంతు కృషి చేయాలని. ప్రతి ఒక్కరు ఇంటికి మాత్రమే పరిమితం కావాలని, నిత్యవసరాలు, వైద్యం, ఆహారం కోసం మాత్రమే బయటికి రావాలని, ప్రస్తుతం ఉద్యోగులకు ఇస్తున్న ప్రోత్సాహకాలు మరికొంత కాలం కొనసాగిస్తామని ఆయన తెలిపారు.

ఇదిలా ఉంటే అమెరికాలో సైతం కరోనా మరోసారి విజృంభిస్తుంది.అ‍గ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎ‍న్నికలు జరుగుతున్న నేపథ్యంలో స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ ఓ కీలక నివేదికను విడుదల చేసింది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వైరస్‌ వ్యాప్తిని ఏమాత్రం లెక్కచేయకుండా నిబంధనలు ఉల్లంఘించి ప్రచార ర్యాలీలు నిర్వహించిన కారణంగా అమెరికా వ్యాప్తంగా దాదాపు 30వేల మంది పౌరులకు కరోనా వైరస్‌ సోకిందని వీరిలో 700 మంది చనిపోయారని తన నివేదికలో పేర్కొంది. జూన్‌ 20 నుంచి సెప్టెంబర్‌ 22 వరకు ట్రంప్ నిర్వహించిన 18 ర్యాలీల ద్వారా సేకరించిన డేటా ఆధారంగా ఈ నివేదికను బహిర్గతం చేసింది. ఈ నివేదిక ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.