iDreamPost
iDreamPost
బ్రిటీష్ ఉక్కు సంకెళ్లలో బందీగా ఉన్న భారతదేశానికి స్వతంత్రం తీసుకురావాలని అనేక మంది యువకులు ఉత్సాహంతో విప్లవ బాట పట్టారు. అలాంటి యువకుల్లో షార్ప్ షూటర్ గా పేరొందిన రాజ్ గురు ఒకరు. రాజ్ గురు పూనే దగ్గరలోని ఖేడ్ అనే గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో 24 ఆగస్టు 1908 న పార్వతీ బాయి, హరి నారాయణ రాజ్ గురుకి జన్మించాడు. ఇతను చిన్న వయస్సు లోనే చదువు నిమిత్తం వారణాసికి వెళ్ళాడు. బ్రిటీషు వారు భారతీయులపై జరిపే అరాచకాలకి రగిలిపోయిన రాజ్ గురు, 1927 లో హిందుస్తాన్ రిపబ్లికన్ ఆర్మీ అనే విప్లవ సంస్థలో చేరాడు.
భగత్ సింగ్ , చంద్రశేఖర్ ఆజాద్ ఆధ్వర్యంలో నడిచే హిందుస్తాన్ రిపబ్లికన్ ఆర్మీ విప్లవ సంస్థలో రాజ్ గురు అందరికన్న గురి చూసి తుపాకి పేల్చగల సమర్ధుడు. ఈ కారణం చేతనే విప్లవ సంస్థ ఇతన్ని గన్ మ్యాన్ గా వాడుకునేది. ఎప్పుడు చలాకీగా ఉండే రాజ్ గురు బ్రీటిష్ పై విప్లవ చర్యలకు దిగే సమయం వచ్చినప్పుడు మాత్రం ఎప్పుడూ భగత్ సింగ్ తో పొటీ పడుతూ ఉండేవాడు. ఏ పని అయినా భగత్ సింగ్ కన్న నాకే ముందు అప్పచెప్పమని పార్టీ కమాండర్ అయిన ఆజాద్ ని అడిగేవాడు . విప్లవ ప్రయాణంలో మరణం ఎదురైతే అది భగత్ సింగ్ కన్న నాకే ముందు ఎదురవ్వాలి నేనే ముందు అమరుడిని అవ్వాలి అని పార్టీ ముందు వాదించేవాడు.
Also Read: నిప్పుకణిక సర్దార్ భగత్ సింగ్
రాజ్ గురు కి ఎక్కువ నిద్రపొయే అలవాటు ఉన్నందున ఖాళీ సమయం దొరికితే నిద్రకే కేటాయించేవాడు. ఒకానొక సందర్భంలో పార్టీ పనిమీద ఘోరక్ పూర్ లో భగత్ సింగ్ , రాజ్ గురు , శివ వర్మా నెలకి 5 రూపాయలకు ఒక పాత గదిని అద్దేకు తీసుకున్నారు, అందులో ఒకరోజు నిద్రిస్తున్న సమయంలో రాజ్ గురు తల దగ్గర పాము పడగ విప్పి ఉండటం సాటి విప్లవ సహచరుడు శివ వర్మా గమనించి భగత్ సింగ్ ని నిద్ర లేపితే, భగత్ సింగ్ రాజ్ గురుని పిలిచినా మేల్కొనకపొయేసరికి రెండు కాళ్ళు పట్టుకుని లాగి కాపాడాడు. అయినా రాజ్ గురు నిద్రలోనే ఉండేసరికి ఆశ్చర్యపోవడం శివ వర్మ వంతైంది. ఒకరోజు ఎవరెవరు పొలీసులకి ఎలా దొరుకుతారు అని సరదాగా చర్చించుకుంటుంటే భగత్ సింగ్ ఏమో సినిమా టాకీసులో దొరుకుతాడు , రాజ్ గురు ఏమో నిద్రపోతు దొరుకుతాడు అని నవ్వుకున్నారు – ( రాజ్ గురుని పొలీసులు నిద్రపోతునప్పుడే పట్టుకున్నారు).
Also Read: వీర కిశోరం చంద్ర శేఖర్ ఆజాద్
లాహొరులో సైమన్ కమీషన్ కి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో లాలాలజపతిరాయిని స్కాట్ అనే పోలీసు అధికారి ఆదేశాలమేరకు దారుణంగా కొట్టడంతో ఆయన నెల రోజుల్లో ఆ దెబ్బలకు మరణించాడు. దీంతో ఆయన మరణానికి కారణమైన స్కాట్ ని చంపాలి అని విప్లవ పార్టీ నిర్ణయించి ఈ పనిలో భగత్ సింగ్ , ఆజాద్ , రాజ్ గురు , జయగోపాల్ ని యాక్షన్ టీంగా నియమిస్తుంది. అయితే ముందు భగత్ సింగ్ స్కాట్ ని కాల్చాలి అని ఆదేశిస్తుంది. హత్యకు అంతా సిద్దం అనుకున్న సమయంలో జైగోపాల్ తప్పిదం వలన స్కాట్ ని చూపించబోయి లాఠీచార్జ్ లో పాల్గొన్న సాండర్స్ ని చూపిస్తాడు . భగత్ సింగ్ జయగోపాల్ చూపిన వ్యక్తి స్కాట్ కాదు అని గమనించి వెనకడుగు వేసేలోపే రాజ్ గురు సాండర్స్ దగ్గరకి దూసుకువెళ్ళి ఫైరింగ్ మొదలు పెట్టడతో విధిలేక భగత్ సింగ్ కూడ ఫైరింగ్ లో పాల్గొని అక్కడ నుండి తప్పించుకుంటారు ( ఈ కేసులోనె భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ కి బ్రిటీష్ ప్రభుత్వం ఉరి శిక్ష వేసింది. అలాగే ఢిల్లీలో కూడా బ్రిటిషు వారికి తొత్తుగా వ్యవహరించి భారతీయ విప్లవకారుల వివరాలు అందజేస్తునందుకు ఒక వ్యక్తిని చంపాలి అని ఆదేశిస్తే అతనిని కాకుండా పొరబాటున వేరే వ్యక్తిని చంపి వస్తాడు రాజ్ గురు.. అది తెలిసి తరువాత చాలా రోజులు తనలో తానే ఎంతో మనోవేదన అనుభవించాడు.
Also Read: సమర నినాదం ఉధం సింగ్
ఢిల్లీ అసెంబ్లీలో బ్రిటిషు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సమ్రక్షణ , కార్మిక తగువుల చట్టాలకి వ్యతిరేకంగా బాంబులు వేయాలని భగత్ సింగ్ ప్రతిపాదనకి పార్టీ ఒప్పుకుని భగత్ సింగ్ తో పాటు ఇంకొక వ్యక్తిని ఎన్నుకునే పనిలో ఉండగా రాజ్ గురు, భగత్ సింగ్ తో వెళ్లి ఆ పనిని పూర్తి చేస్తాను అని మొండికేసాడు. నీకు ఇంగ్లీషు రాదు బ్రిటీష్ పెత్తనం ఉన్న కోర్టులో మన పనిని సమర్థిస్తూ నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకొలేవు అని బట్టుకేస్వర్ దత్త్ అనే ఇంకో విప్లవ సహచరుడిని ఎంపిక చేస్తారు. దీనికి అలిగిన రాజ్ గురు పునా వెళ్ళిపోతాడు.
లాహొరు కుట్ర కేసులో అందరు పట్టుబడిన తరువాత చివరిలో పట్టుబడింది మాత్రం రాజ్ గురునే. 1929 సెప్టెంబర్ 27 న విప్లవకారుల సానుభూతిపరుడైన శివరాం పంత్ చనిపోవడంతో, ఆరోజు జరిగిన అంతిమ యాత్రలో రాజ్ గురు ఉద్వేగం ఆపుకొలేక వందేమాతరం , భారత్ మాతా కి జై అనే నినాదాలతొ పాటు ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాలు ఇచ్చాడు. ఇవి లాహోరు కుట్ర కేసులో అరెస్టు అయి జైల్లో ఉన్న భగత్ సింగ్ నినాదాలు అవ్వడంతో, ఆ నినాదాలు విని మారువేషంలో ఉన్న సి.ఐ.డి మనుషులు రాజ్ గురు మీద ఒక కన్ను వేసి తనకి మిత్రులుగా పరిచయం అయి సాండర్స్ హత్యలో తన భాగం తెలుసుకుని సెప్టెంబర్ 30 న పునా తిలక్ రోడ్డులో ఒక గదిలో నిద్రిస్తున్న రాజ్ గురుని పట్టుకుని అరెస్టు చేసారు.
Also Read: కకొరి రైలు దోపిడి — 1925 ఆగస్టు 9
లాహోరు జైలుకి వెళ్ళాక హక్కుల కోసం భగత్ సింగ్ తో పాటు నిరాహార దీక్షలో పాలుపంచుకుంటాడు. భగత్ సింగ్ కంటే ముందే అమరుడవ్వాలి అనే కోరిక చివరికి భగత్ సింగ్ తో పాటు1931 మార్చ్ 23న ఉరికంబం ఎక్కి తనతో పాటే భారత దేశం కొసం ప్రాణాలు వదిలాడు రాజ్ గురు. నేడు వారి జయంతి సందర్భంగా వారి త్యాగాలను స్మరిస్తూ.