బాహుబలి, సాహోల కోసం చాలా కాలాన్ని త్యాగం చేసుకున్న డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాక ఇప్పుడు బాగా జాగ్రత్త పడుతున్నాడు. ఒకవైపు సలార్ షూటింగ్ లో పాల్గొంటూనే మరోవైపు ఆది పురుష్ కోసం రెడీ అవుతున్నాడు. ఇందుకే ప్రత్యేకంగా కోచ్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ తీసుకోవడం మొదలుపెట్టాడు. నాగ అశ్విన్ తో చేయబోయే సినిమాకు సైతం బాడీ ఫిట్ నెస్ అవసరం కావడంతో ఒంటిని బల్లెంగా మార్చేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నాడు. రాధే శ్యామ్ కోసం ప్రమోషన్ తప్ప ప్రభాస్ వైపు చేయాల్సింది ఏమి లేదు. ఎలాగూ రిలీజ్ డేట్ ఇచ్చేశారు కాబట్టి ఏప్రిల్ నుంచి ఆ హంగామా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
వీటి సంగతలా ఉంచితే మైత్రి సంస్థకు ప్రభాస్ ఓ కమిట్ మెంట్ పెండింగ్ ఉన్నాడు. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగాతో ప్లాన్ చేస్తున్నట్టుగా గతంలోనే వార్తలు వచ్చాయి. రణ్వీర్ కపూర్ తో చేస్తున్న అనిమల్ పూర్తి కాగానే సందీప్ ఫ్రీ అవుతాడు. ఆపై ప్రభాస్ ఇంకో రెండేళ్లలో అందుబాటులోకి వస్తాడు. ఆలోగా స్క్రిప్ట్ కనక అందరికీ నచ్చేలా రూపొదిద్దుకుంటే ఇది కార్యరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనికి చాలా టైం పడుతుంది. ఈ ఏడాది రాధే శ్యామ్ తో పాటు సలార్ కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. 2022 ఆది పురుష్ కోసం ఆల్రెడీ లాక్ చేశారు కాబట్టి ప్లానింగ్ కొనసాగుతుంది.
మొత్తం రాబోయే మూడేళ్ళలో ఒక్క ప్రభాస్ మీదే సుమారు రెండు నుంచి మూడు వేల కోట్ల మధ్యలో బిజినెస్ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానికి తోడు హిందీ టాప్ ప్రొడక్షన్ హౌసెస్ కూడా తనతో సినిమాలు చేసేందుకు తహతహలాడటం గమనించాల్సిన అంశం. ఇప్పుడు రాధే శ్యామ్ కనక అంచనాలు సరిగ్గా అందుకోగలిగితే ప్రభాస్ ని పట్టుకోవడం కష్టమే. అందులోనూ కాంబినేషన్లు కూడా అలాగే సెట్ అవుతున్నాయి. నెక్స్ట్ లిస్ట్ లో కొరటాల శివ కూడా ఉన్నాడట. మిర్చి తర్వాత మరోసారి మసాలా ఎంటర్ టైనర్ కాంబో రిపీట్ కావడం కన్నా అభిమానులు కోరుకునేది ఏముంటుంది. మొత్తానికి ప్రభాస్ నాన్ స్టాప్ స్పీడ్ ఆగేలా లేదు