iDreamPost
android-app
ios-app

OTS – ఓటీఎస్ పై విపక్షాలది దుష్ప్రచారమే, ఇది పేదలకు శాశ్వత హక్కు కల్పించే ప్రయత్నం

  • Published Dec 01, 2021 | 12:18 PM Updated Updated Mar 11, 2022 | 10:33 PM
OTS – ఓటీఎస్ పై విపక్షాలది దుష్ప్రచారమే, ఇది పేదలకు శాశ్వత హక్కు కల్పించే ప్రయత్నం

ఆంధ్రప్రదేశ్ లో విపక్షాలు మీడియా సహకారంతో చేసే దుష్ప్రచారాలకు హద్దూ పద్దూ ఉండడం లేదు. అన్ని విషయాల్లోనూ ప్రభుత్వ లక్ష్యాలను అడ్డుకోవడమే తమ కర్తవ్యం అన్నట్టుగా టీడీపీ వ్యవహరిస్తోంది. దానికి ఓ సెక్షన్ మీడియా వంత పాడుతోంది. దాంతో ప్రజల్లో అపోహలు, అనుమానాలు విస్తృతమవుతున్నాయి. తాజాగా అదే పరంపరలో జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (ఓటీఎస్‌) కూడా చేరింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం మీద బురదజల్లేందుకు టీడీపీ విస్తృతంగా ప్రయత్నాలు చేస్తుండడంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమయ్యింది. విపక్షాలది దుష్ప్రచారమని, దానిని అడ్డుకోవాలంటూ నేరుగా సీఎం ఆదేశాలు ఇచ్చారు.

ఓటీఎస్‌పై సాగుతున్న దుష్ప్రచారాన్ని సీరియస్‌గా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. లబ్దిదారులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలని అధికారులకు నిర్దేశించారు. వాస్తవానికి ఈ పథకం ద్వారా లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందన్నది ప్రభుత్వ వాదన. తాము నివాసం ఉంటున్న భూమిపై సంపూర్ణ హక్కు సాధించడం ద్వారా భవిష్యత్తులో కూడా సమస్యలు రాకుండా చేసుకునే అవకాశం ఉంది. కానీ దానిని విస్మరించి అర్థసత్యాలతో సామాన్యుల్లో అలజడి రేపేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయనేది పాలకపక్షం వాదన.

జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (ఓటీఎస్‌)పై దుష్ప్రచారంపై కఠినంగా ఉండాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించడం ఆసక్తిగా మారింది. గతంలో కూడా పలు అంశాలలో ఏమరపాటుగా ఉండడంతో విపక్షాల ప్రచారమే సామాన్యులకు చేరింది. అది ప్రభత్వ లక్ష్యాలకు చేటు చేసిందనే అంశాన్ని సీఎం గుర్తించారు. దాంతో సకాలంలోనే ఈ యత్నాలను అడ్డుకోవాలంటూ అప్రమత్తం చేయడం గమనార్హం. దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు కూడా తీసుకోవాలని సీఎం ఆదేశించడం కీలకంగా కనిపిస్తోంది.

ఓటీఎస్‌ పథకం ద్వారా పేదలకు చట్టపరంగా హక్కులు దఖలుపడతాయని సీఎం తెలిపారు. ఇంతలా మేలు చేస్తున్న ఈ పథకంపట్ల దురుద్దేశ పూర్వకంగా చేస్తున్న ప్రచారంపై చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారుల్లో సందేహాలు, అనుమానాలు ఉంటే అధికారులు ఒకటికి రెండుసార్లు అవగాహన కల్పించాలన్నారు. పథకం ద్వారా వచ్చే లబ్ధిని, రిజిస్టర్‌ పత్రాల ద్వారా వారికి మాఫీ అవుతున్న అసలు, వడ్డీ వివరాలనుకూడా చూపించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇదే రీతిలో ఏపీకి సంబంధించి సాగుతున్న ప్రచారాలకు అడ్డుకట్టవేసే రీతిలో వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఉదంతం చాటుతోంది. సీఎం ఆదేశించే వరకూ వేచి చూడకుండా అన్ని స్థాయిల్లోనూ అధికారులు, నేతలు ఎప్పటికప్పుడు తప్పుడు ప్రచారాలపై సమర్థవంతంగా వ్యవహరించాల్సిన అవశ్యాన్ని ఈ అనుభవం గుర్తు చేస్తోంది.

Also Read : Nadendla Manohar, One Time Settlement – వన్ టైం సెటిల్మెంట్ అంటే దోచుకోవడమా మనోహర్‌..?