ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసి మరోసారి వెనకడుగు వేశారు. రాజ్యాంగపదవి రీత్యా ఆయనకు దక్కిన అధికారాన్ని ఉపయోగించి, ప్రభుత్వంపై పెత్తనం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనక్కి తగ్గారు. తనకు గిట్టని అధికారులను వేధించేందుకు పూనుకున్న ఎస్ఈసి కి ప్రభుత్వ ప్రతిఘటనతో పాఠం నేర్పినట్టయ్యింది. లేని అధికారాన్ని ఉపయోగించి ఏకంగా అభిశంసన చేయాలని చూసిన నిమ్మగడ్డ తప్పిదాన్ని తెలుసుకున్నారు. దానికి సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేసి, వారం పాటు గోప్యంగా ఉంచడం విశేషం.
స్థానిక ఎన్నికల విషయంలో ప్రభుత్వంతో సంప్రదించి ముందుకెళ్లాలని కోర్టు ఆదేశించింది. అయినా నిమ్మగడ్డ ఏకపక్షంగా వ్యవహరించడంతో ప్రభుత్వం నుంచి ఎస్ఈసి ప్రతిపాదనల పట్ల వ్యతిరేకత వ్యక్తమయ్యింది. ఆ క్రమంలో సుప్రీంకోర్టులో కేసు ఉండగా, నోటిఫికేషన్ విషయంలో ముందుకు వెళ్ళొద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శినేరుగా లేఖ రాశారు. అయినా నిమ్మగడ్డ ముందుకెళ్లారు. ఆ సమయంలో ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్ కి హాజరుకాలేదనే కక్షతో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ పై నిమ్మగడ్డ సీరియస్ అయ్యారు. దానితో సరిపెట్టకుండా ఓటర్ల జాబితా 2019 తర్వాత అప్ డేట్ చేయలేదనే కారణం చూపి ఆ ఇద్దరు ఐఏఎస్ అధికారులపై అభిశంసనకు పూనుకున్నారు. పైగా అది సర్వీసు రూల్స్ లో పొందుపరచాలనే ఆదేశం కూడా ఇచ్చేసారు.
Also Read: సీనియర్ ఐఏఎస్ అధికారుల అభిశంసన వెనుక అసలు కారణమదేనా?
దీనిపై ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నిబంధనలు అతిక్రమించి నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని సీఎస్ ఘాటులేఖతో ప్రతిస్పందించారు. అభిశంసన హక్కు ఎస్ఈసికి లేదని, పైగా వివరణ కూడా కొరకుండా ఎలా చర్యలు తీసుకుంటారని నిలదీశారు. ఈ పరిస్థితుల్లో ఊహించని ప్రతిఘటనకి నిమ్మగడ్డ వెనక్కితగ్గారు. తాను ఇచ్చిన ఆదేశాలు ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఈ విషయం జనవరి 27నే లేఖ రాసి, తప్పిదం సవరించుకునే యత్నం చేసిన నిమ్మగడ్డ ఆ లేఖను ఫిబ్రవరి 2న బయటపెట్టడం విశేషం. ఇష్టారాజ్యంగా ప్రభుత్వం, అధికారుల మీద పెత్తనం చేయాలని చూస్తే నిమ్మగడ్డ ప్రయత్నాలు సాగవని ఈ అనుభవం చాటుతోంది