తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన పనిలేదు. శ్రీ మహా విష్ణువు అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభువుగా వెలిసిన తిరుమల క్షేత్రం కలియుగ వైకుంఠంలా విరాజిల్లుతూ లక్షలాది కోర్కెలు తీరుస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం మీద భారత అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. శ్రీవారి ఆలయంలో ఆయనకు నిర్వహించే నిత్యకైంకర్యాలు ఇతర ఆర్జిత సేవా కార్యక్రమాల గురించి తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
జగన్ ప్రభుత్వంలో శ్రీవారి ఆలయంలో ఆగమశాస్త్రం ప్రకారం పూజలు జరగడం లేదని చెబుతూ శార్వరీ దాదా అనే ఒక శ్రీవారి దాత సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం శాస్త్రాల్లో పేర్కొన్న విధంగా ఆలయాల్లో పూజలు, ఇతర సేవా కార్యక్రమాలను చేపడుతుంటారని, వాటిల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని తేల్చి చెప్పింది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలో ఏర్పాటైన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ ఉదయం సదరు దాత దాఖలు చేసిన పిటీషన్పై విచారణ చేపట్టింది. ఈ ధర్మాసనంలో సీజేఐ ఎన్వీ రమణతో పాటు జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హిమాకోహ్లీ ఉన్నారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆలయాల్లో అర్చకులు నిర్వహించే నిత్య పూజల విషయంలో రాజ్యంగబద్ధంగా ఏర్పాటైన న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందా? అని పిటీషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించిన ఆయన ఆ అవసరం లేదని కూడా స్పష్టం చేశారు.
తిరుమల ఆలయ విషయంలో మాత్రమే కాకుండా.. ఏ ఆలయ వ్యవహారాల్లో అయినా ఏ న్యాయస్థానాలైనా జోక్యం చేసుకోలేవని చెబుతూ ఈ స్పెషల్ లీవ్ పిటీషన్ను కొట్టివేస్తున్నామని అన్నారు. ఆలయాల్లో ఎలా కొబ్బరికాయ కొట్టాలో? ఎలా హారతి ఇవ్వాలో? న్యాయస్థానాలు చెప్పాల్సిన అవసరం ఉందా? అని ఆయన ప్రశ్నించారు. అసలు ఆ అవసరం లేదని ఆయన అన్నారు. తిరుమల సహా ఏ ఆలయంలోనైనా మూలవిరాట్టుకు ఆగమ శాస్త్రాల ప్రకారమే పూజలను నిర్వహిస్తారని, రాజ్యంగబద్ధంగా ఏర్పాటైన న్యాయస్థానాలు ఆ నియమాలు, నిబంధనలు మార్చలేవని, రోజువారీ పూజా కార్యక్రమాల్లో జోక్యం చేసుకోలేవని పేర్కొన్నారు. ఒక వేళ నిజంగానే ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా తిరుమల శ్రీవారి ఆలయంలో పూజలను నిర్వహిస్తున్నారు అంటే.. ఆ విషయాన్ని కింది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలని అది కూడా ఖచ్చితమైన సాక్ష్యాధారాలు ఉంటేనే కింది కోర్టును ఆశ్రయించాలని ఆయన అన్నారు.
Also Read : ABN Andhra Jyothi, Amit Shah, AP BJP – నాపై దాడి చేసిన వారికి సన్మానం చేయలేదా ?
తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన తీరులో ఏవైనా మార్పులు కనిపిస్తే, లేదా నియమ నిబంధనలు, మార్గదర్శకాలకు వ్యతిరేకంగా నడుచుకుంటూ ఉంటే దానికి న్యాయస్థానాలు స్పందించవచ్చని చెప్పారు. ఆగమ శాస్త్ర విషయాలలో.తాము ఎవరం ఏమీ చేయలేమని తేల్చేశారు. వాటిపై దేవస్థానాల అధికారులు స్పష్టమైన వివరణ ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. జగన్ ప్రభుత్వంలో ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు, నిత్యకైంకర్యాలు జరగడం లేదు అంటూ ఈ స్పెషల్ లీవ్ పిటీషన్ను దాఖలు చేసిన సమయంలో సుప్రీంకోర్టు.. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు నోటీసులను జారీ చేసిన విషయం తెలిసిందే. గతంలో ఈ కేసు గురించి విచారణ చేసిన సమయంలోనే ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
టీటీడీలో తప్పులు జరిగితే వేంకటేశ్వరస్వామి ఎవరినీ ఉపేక్షించరని ఆయన వ్యాఖ్యానించారు. తాను కూడా వేంకటేశ్వర స్వామి భక్తుడినని తెలిపారు. అయితే అదే సమయంలో పిటిషనర్ చేస్తున్న ఆరోపణల్లో నిజం ఏమైనా ఉందా అన్న విషయాన్ని తెలుసుకునేందుకు వారం లోగా సమాధానం ఇవ్వాలని టీటీడీ లాయర్కు ధర్మాసనం అవకాశం ఇచ్చింది. దానికి అనుగుణంగా టీటీడీ అధికారులు ఇదివరకే కౌంటర్ను దాఖలు చేశారు. వైఖానస ఆగమ శాస్త్రాల ప్రకారం.. పెదజీయరు, చినజీయరు స్వామివార్ల పర్యవేక్షణలో శ్రీవారికి నిత్యపూజలు, కైంకర్యాలను నిర్వహిస్తున్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. దాన్ని పరిశీలించిన తరువాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ విషయంలో తాము చేయాల్సింది ఏమీ లేదు అంటూ స్పెషల్ లీవ్ పిటిషన్ ను కొట్టివేసింది. పిటిషనర్ కేవలం ప్రచారం కోసమే ఇలా చేస్తున్నారని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Also Read : Pakistan, Imran Khan – మళ్లీ సైన్యం చేతుల్లోకి పాకిస్తాన్..?