ఒక్కరోజులో 22721 పాజిటివ్ కేసులు – 444 మరణాలు
కరోనా వైరస్ దేశంలో ఉగ్రరూపం దాలుస్తుంది.. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైరస్ ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజుకి 20 వేలకు పైగా కేసులు, 400 పైగా మరణాలు సంభవించడం నిత్యకృత్యంగా మారింది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 22,721 పాజిటివ్ కేసుల నిర్దారణ అయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 6,49,889 కి చేరింది. అంతేకాకుండా మరణాల సంఖ్య 18,669 కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.నిన్న ఒక్కరోజులో 444 మరణాలు సంభవించాయి.గత కొద్ది రోజులతో పోలిస్తే మరణాల సంఖ్య తగ్గడం కాస్త ఊరటనిచ్చే అంశం. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న దేశాల్లో భారత్ నాలుగవ స్థానంలో కొనసాగుతోంది. కరోనా వైరస్ బారినుండి 3,94,319 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 2,36,835 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మహారాష్ట్రలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసుల నమోదు:
మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడట్లేదు.నిన్న ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో 6364 పాజిటివ్ కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.ఆ రాష్ట్రంలో కరోనా మహమ్మారి బారిన పడి తాజాగా 198 మంది మృతి చెందారు. నిన్నటి పాజిటివ్ కేసులతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,92,990 చేరింది.అలాగే మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్న ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 8,376 చేరింది.
ప్రస్తుతం మహారాష్ట్రలో 79,911 వైరస్ యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు 1,04,687 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.ఆర్థిక రాజధాని ముంబైలో ప్రమాదకర స్థాయిలో వైరస్ వ్యాపిస్తుండటం ఆందోళన పరుస్తుంది. ముంబయిలో ప్రస్తుతం 82,074 పాజిటివ్ కేసులు నమోదు కాగా 4,762 మంది మృతి చెందారు.
తెలంగాణాలో 20 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణలో నిన్న కొత్తగా అత్యధికంగా రికార్డు స్థాయిలో 1,892 మందికి కరోనా నిర్దారణ అయ్యింది.ఇప్పటివరకు తెలంగాణలో నమోదయిన కేసుల్లో నిన్న నమోదయిన కేసులే అత్యధికం. దీంతో తెలంగాణలో 20,462 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9,984 మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండగా 10195 మంది కరోనా బారినుండి కోలుకున్నారు. 283 మంది మృత్యువాత పడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న 837 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో 16934 మందికి కరోనా సోకగా 206 మంది మృత్యువాత పడ్డారు. 7632 మంది వ్యాధి నుండి కోలుకుని రికవర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9096 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 11,191,810 మందికి కోవిడ్ 19 సోకగా 529,127 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 6,330,816 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 2,890,588 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 132,101 మంది మరణించారు.