iDreamPost
iDreamPost
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు ఇటీవల ఆసక్తిగా కనిపిస్తోంది. ఆయన మిత్రపక్షం బీజేపీని దూరం పెడుతున్నట్టు అర్థమవుతోంది. తిరుపతి ఉప ఎన్నికల తర్వాత బీజేపీ కూడా పవన్ ని పెద్దగా పట్టించుకుంటున్నట్టు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో జనసేనాని మళ్ళీ పచ్చ కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇప్పటికే టీడీపీ నేతలంతా తాము, జనసేన కలిసి పోటీ చేస్తామనే ప్రకటనలు చేస్తున్నారు. 2014 కాంబినేషన్ కోసం తమ నాయకుడు కృషి చేస్తున్నాడనే ప్రకటనలు గుప్పిస్తున్నారు.
వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా, లేకున్నా ఆయన చంద్రబాబు కనుసన్నల్లోనే సాగుతారన్నది చాలామంది అభిప్రాయం. చివరకు జనసైనికులు కూడా దానిని బలంగా తిరస్కరించలేని పరిస్థితి ఉంది. దానికి తగ్గట్టుగానే క్షేత్రస్థాయిలో అనేక చోట్ల జనసేన నేరుగా టీడీపీతో కలిసి పనిచేయడం ప్రారంభించింది. ఇటీవల పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఎదుర్కొనే లక్ష్యంతో పలు చోట్ల పొత్తు కూడా పెట్టుకున్నారు. కాకినాడ రూరల్ లో మంత్రి కన్నబాబు బలపరిచిన అభ్యర్థులను అడ్డుకోవడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుని ప్రయత్నించాయి. కానీ అక్కడ ఆ రెండు పార్టీలకు ఓటమి తప్పలేదు. కరప జెడ్పీటీసీ స్థానంలోనూ, మరికొన్ని ఎంపీటీసీ సీట్లను కూడా ఇలాంటి పొత్తులతో ఎదుర్కొన్నప్పటికీ వైఎస్సార్సీపీకే జనం జైకొట్టారు.
Also Read: తెలుగుదేశం ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తుందా?
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో మాత్రం ఈ రెండు పార్టీల పొత్తు కొంతమేరకు ఆశించిన ఫలితాన్నిచ్చింది. మాజీ మంత్రి పితాని సత్యన్నారాయణ ఇన్ఛార్జ్ గా ఉన్న నియోజకవర్గంలోని అనేక చోట్ల టీడీపీ అభ్యర్థులకు జనసేన మద్ధతునిచ్చింది. జనసేన గెలిచిన వీరవాసరం జెడ్పీటీసీ స్థానంలో టీడీపీ కార్యకర్తలు జనసేన కోసం పనిచేశారు. తద్వారా ఇరువురూ కలిసి అధికార పార్టీ అభ్యర్థులను నిలువరించే యత్నంలో కొన్ని విజయాలు దక్కించుకున్నారు. ములపర్రు ఎంపీటీసీ పరిధిలో టీడీపీ అభ్యర్థిని బలపరిచి గెలిపించిన జనసేన కార్యకర్తలకు ధన్యవాదాలు చెబుతూ పితాని సత్యన్నారాయణ అనుచరులు పోస్టర్లు కూడా వేశారు. అనేక చోట్ల జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థుల కారణంగానే గోదావరి జిల్లాల్లోనయినా కొద్ది మేరకు సీట్లు దక్కాయని జనసైనికులు సైతం అంగీకరిస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో వచ్చిన ఫలితాలతో ఈ రెండు పార్టీల పొత్తు యత్నాలు మరింత వేగవంతమయినట్టు చెప్పవచ్చు. త్వరలోనే బీజేపీకి బై బై చెప్పేసి మళ్లీ బాబు గూటిలోకి పవనన్న చేరడానికి ఇలాంటి అనుభవాలు సంకేతాలుగా ఉన్నాయి. చివరకు భీమవరం నియోజకవర్గంలో కూడా టీడీపీ, జనసేన జెండాలు కలిపి సాగిన తరుణంలో ఇక రాష్ట్రస్థాయిలో రెండు పార్టీలు ఒకే వేదికపైకి రావడం ఇక లాంఛనమే అనే అభిప్రాయం ఉంది. మొత్తంగా పవన్, బాబు స్నేహం మరోసారి బహిరంగంగా కలిసి సాగడానికి త్వరలో ముహూర్తం నిర్ణయించే దిశలో ఉందని అంతా భావిస్తున్నారు.
Also Read: వైఎస్సార్ సీపీ జైత్రయాత్ర.. ఏ అంశాలు కలిసొచ్చాయి?