ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాల్లోనే కాదు.. రాజకీయంగా కూడా మహిళలకు ప్రాధాన్యం పెరిగింది. ఆయన తీసుకుంటున్న ఒక్కో నిర్ణయం సంచలనంగా మారుతోంది. పాలనలోను, రాజకీయాల్లోనూ ఆయన వేస్తున్న అడుగులను గమనిస్తే.. చాలా పరిణతితో ఆలోచిస్తున్నారన్న విషయం అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్రంలో మొత్తం 13 జిల్లా పరిషత్లు ఉండగా, అందులో సగానికంటే పైగా అంటే.. ఏడు జెడ్పీ చైర్మన్ పదవులను మహిళలకు కేటాయించారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో మహిళలే జడ్పీ చైర్పర్సన్లు అయ్యారు. మేయర్లుగా కూడా సగం మంది మహిళలే ఉన్నారు. ఇక ఇప్పుడు `దానికి మించి` అన్న తరహాలో నామినేటెడ్ పదవులను మహిళలకు భారీ సంఖ్యలో కేటాయించి సంచలనం సృష్టించారు.
తాజాగా ప్రకటించిన నామినేటెడ్ సీట్లలో మెజారిటీ భాగాన్ని.. అత్యంత కీలకమైన విభాగాలను కూడా మహిళల చేతుల్లోనే పెట్టారు. నిజానికి ఇప్పటి వరకు లైమ్లైట్లో లేని మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారు. నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు 55 శాతం ప్రకటించడం గమనార్హం. మొత్తం 135 పోస్టుల్లో మహిళలకు 68 పురుషులకు 67 పోస్టులు కేటాయించారు. 68 మహిళల్లోనూ ఇప్పటి వరకు పెద్దగా ఇంటి నుంచి బయటకు రాని మహిళలు కూడా ఉండడం గమనార్హం.
ఏపీ గ్రంథాలయ సంస్థ చైర్మన్గా రెడ్డి పద్మావతి ఏపీ ఆర్టీసీ రీజనల్ చైర్మన్గా గేదెల బంగారమ్మ ఏపీ వీఎంఆర్డీఏ చైర్మన్గా అక్కరమాని విజయనిర్మల ఏపీ బుడా చైర్మన్గా ఇంటి పార్వతి మహిళా కో ఆపరేటివ్ ఫైనాన్స్ చైర్మన్గా హేమమాలిని
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బండి పుణ్యసుశీల డీసీఎంఎస్ చైర్మన్గా అవనపు భావన తిరుపతి స్మార్ట్సిటీ కార్పొరేషన్ చైర్మన్గా నరమల్లి పద్మజ సాహిత్య అకాడమీ చైర్పర్సన్గా పిల్లంగొల్ల శ్రీలక్ష్మి పశ్చిమ డెల్టా బోర్డు చైర్మన్గా గంజిమాల దేవి ఏలేశ్వరం డెవలప్మెంట్ బోర్డు చైర్ పర్సన్గా శైలజ వంటివారు కీలక పదవులు దక్కించుకున్నారు.
ఇదంతా గమనిస్తే.. ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఎన్నడూ లేని రీతిలో సమున్నత స్థానం దక్కుతుందన్న విషయం అర్థమవుతోంది. మరోవైపు సామాజికంగా కూడా సాధారణ మహిళలు బలోపేతం అవుతున్నారు. జగన్ అందిస్తున్న పథకాల ద్వారా ఆర్థికంగా స్థిరపడుతున్నారు. రాజన్న బిడ్డ చూపుతున్న ప్రేమకు ఏపీ ఆడపడుచులు జగన్ ను అమితంగా ఆదరిస్తారనడంలో సందేహం లేదు.