Idream media
Idream media
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తాను ముఖ్యమంత్రి కావడం కన్నా.. కొడుకు లోకేష్ బాబును ఎమ్మెల్యేను చేయడమే తలనొప్పిగా మారింది. దశాబ్దాల చరిత్ర గల పార్టీని లీడ్ చేయాలనుకునే వ్యక్తి కనీసం ఎమ్మెల్యే గా కూడా గెలవలేకపోతే.. అంతకు మించిన దౌర్భాగ్యం ఉండదనే ఆందోళన వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన లోకేష్.. 2024 ఎన్నికల్లో కూడా గెలవకపోతే పరిస్థితి దారుణంగా మారిపోతుంది. ఇప్పటికే జూ ఎన్టీఆర్ పేరును జపం చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో కనీసం ఎమ్మెల్యేగా అయిన గెలిచి తానేంటో నిరూపించుకోలేక పోతే.. లోకేష్ కు రాజకీయ భవిష్యత్ కష్టమే. అందుకే ఆయన కన్నా చంద్రబాబుకు అది పెద్ద టెన్షన్ గా మారింది.
లోకేష్ గెలిచేది ఎక్కడ?
ఎన్నో లెక్కలు, ఎన్నెన్నో సమీకరణాలు వేసుకుంటూ లోకేష్ గెలిచే నియోజకవర్గం కోసం ఎప్పటి నుంచో వెదుకులాడుతున్నారు. శ్రేణులు కలిసొచ్చినా, నాయకులు త్యాగం చేసినా లోకేష్ కు గెలుపు దాదాపు కష్టమనే నివేదికలు అన్ని నియోజకవర్గాల నుంచి వస్తున్నాయి. కచ్చితంగా గెలిచే సెగ్మెంట్ల ను వదులుకోవడానికి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు ఇష్టపడడం లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తన నియోజకవర్గాన్ని త్యాగం చేయక తప్పేలా లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో, రాబోయే గడ్డుకాలాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే.. లోకేష్ కు కుప్పం మినహా మరో ప్రత్యామ్నాయం కనిపించేలా లేదు.
నెరవేరని ఆశ
తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఎమ్మెల్సీ ద్వారా లోకేష్ మంత్రి అయ్యారు. కానీ 2019 ఎన్నికల్లో తండ్రితో కలిసి అసెంబ్లీ గడప తొక్కాలనుకున్న ఆయన ఆశలు మాత్రం తీరలేదు. మంగళగిరిలో ఆయన చిత్తుగా ఓడిపోయారు. అలా అక్కడి ప్రజల తిరస్కారానికి గురైన ఆయన వచ్చే ఎన్నికల కోసం ఓ నియోజకవర్గాన్ని వెతుకుతున్నట్లు తెలిసింది. తనకు విజయావకాశాలు ఉండే నియోజకవర్గంపైనే దృష్టి పెడుతున్నట్లు సమాచారం. ఓ దశలో తన సొంతమామ బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురం వెళ్లాలని పన్నాగం పన్నినా అది కలిసి రాలేదు. దీంతో ఇప్పుడు తన తండ్రి నియోజకవర్గంపై లోకేష్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
కుప్పంలో అయినా గెలుస్తారా?
ఒకవేళ ఆ నియోజకవర్గాన్ని కొడుకు లోకేష్ కు వదిలేస్తే వదిలేస్తే చంద్రబాబు కొత్త నియోజకవర్గాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. బాబుకు అది కష్టమైన పని కానప్పటికీ ఈ వయసులో కొత్త నియోజకవర్గంలో పోటీకి దిగేలా అక్కడి నేతలను ఒప్పించడం ఆయనకు తలకు మించిన భారంగా మారనుంది. ఒకవేళ లోకేష్ను కుప్పం బరిలో నిలిపినా ఆయన గెలుస్తారా అంటే కచ్చితంగా అవునని చెప్పే పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పటికే అక్కడ జూనియర్ ఎన్టీఆర్ పేరు మార్మోగుతోంది. చంద్రబాబు పర్యటనలోనే ఆయన ముందే కార్యకర్తలు జై ఎన్టీఆర్ అనే నినాదాలు చేయడం తెలిసిందే. మరోవైపు కుప్పంలో అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల మెప్పు పొందేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ పరిస్థితుల మధ్యలో లోకేష్ గెలుపు కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబుకు తలనొప్పులు తప్పడం లేదు.