iDreamPost
android-app
ios-app

కోస్తాకు పొంచివున్న వాయుగుండం……….

  • Published Oct 13, 2020 | 6:26 AM Updated Updated Oct 13, 2020 | 6:26 AM
కోస్తాకు పొంచివున్న వాయుగుండం……….

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణశాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కోస్తా ఆంధ్ర తీరానికి సమీపంలోకి వస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో విశాఖపట్టణానికి ఆగ్నేయ దిశగా 280 కిలోమీటర్లు, కాకినాడకు తూర్పు ఆగ్నేయ దిశగా 320 కి.మీటర్లు, నర్సాపూర్‌కు తూర్పు ఆగ్నేయ దిశగా 360కి.మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు తెలిపింది. పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపూర్‌-విశాఖపట్నం మధ్య కాకినాడకు సమీపంలో తెల్లవారుఝామున తీరం దాటే అవకాశం ఉందంటున్నారు. దీని కారణంగా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు, ఉభయగోదావరి జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు ఇప్పటికే కురుస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.

రాగల 24గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
పలు ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. వాయుగుండం స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు విపత్తుల శాఖ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు. యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు చెప్పారు.
తీరప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సముద్రం అజలడిగా ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విజ్ఞప్తి చేశారు.

వాయుగుండం ప్రభావంతో ఎక్కడికక్కడే పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి.ఏకధాటిగా కురుస్తున్న వర్షాల దెబ్బకు వారిచేలాల్లోకి ముంపు నీరు చేరింది. నీరు క్రిందికి వెళ్లడంతో అడ్డంకులు ఉన్న చోట రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.
తీరం దాటే సమయంలో మరింతగా వర్షాలు కురుస్తాయన్న అంచనాలు ఉన్నాయి.