Idream media
Idream media
అగ్రనేతలు కలిసికట్టుగా తరలివచ్చి జీహెచ్ఎంసీలో భారతీయ జనతా పార్టీకి గట్టి పునాది వేస్తే.. స్థానిక నేతలు రోడ్డుపై ఘర్షణలకు దిగుతూ పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు. ఎన్నికల ముందే జీహెచ్ఎంసీకి ఆరుగురు అధ్యక్షులను నియమించిన అధిష్ఠానం అంతర్గత విభేదాలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు అప్పట్లో ప్రకటించింది. ఇప్పుడు తాజాగా రోడ్డుపై బీజేపీ నేతల కుమ్ములాల చర్చనీయాంశంగా మారింది.
సికింద్రాబాద్ బీజేపీలో అంతర్గత విభేదాలు తారాస్థాయి చేరాయి. నడి రోడ్డు మీదే బీజేపీ నేతలు ఘర్షనకు దిగారు. తార్నాక డివిజన్ అధ్యక్షుడు రాముపై శారదా మల్లేష్ దాడి చేశారు. దీంతో నేతలిద్దరు రోడ్డుపైనే ఘర్షణకు దిగారు. ఒకరినొకరు దూషించుకుంటూ హంగామా చేశారు. ఈ పంచాయితీ కాస్త బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఇంటికి చేరింది. ఇరువర్గాల కార్యకర్తలు భారీగా రామచంద్రరావు ఇంటికి చేరుకున్నారు. తార్నాక డివిజన్ లాలాపేట్లో జరిగిన బీజేపీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో తార్నాక డివిజన్ అధ్యక్షుడు రాము ప్రోటోకాల్ ప్రకారం తనను స్టేజీపైకి ఆహ్వానించలేదనే కోపంతోనే శారదా మల్లేష్ ఆ దాడికి దిగినట్లు తెలుస్తోంది. గ్రేటర్ బీజేపీ నేతల కుమ్ములాటాలు బజారున పడ్డాయి. తార్నాక డివిజన్లో బీజేపీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. స్టేజీ పైకి పిలవలేదని డివిజన్ అధ్యక్షుడు రామవర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో లాలాపేట్లో బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై కొట్టుకున్నారు. రామవర్మపై లాలాగూడ పీఎస్లో మల్లేష్ ఫిర్యాదు చేశారు.
ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధిష్ఠానం సీరియస్ గా పరిగణించింది. రాష్ట్రంలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న వేళ ఇటువంటి చిన్న చిన్న తగాదాలు కూడా పెను ప్రభావం చూపుతాయని పేర్కొన్నట్లు తెలిసింది. ఇందుకు కారణాలను తెలుసుకుని నివేదిక ఇవ్వాలని సికింద్రాబాద్ నేతలకు సూచించినట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలుసుకున్న అనంతరం బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవశాలు ఉన్నాయి.