iDreamPost
android-app
ios-app

సీడ‌బ్ల్యూసీలో చిత్ర విచిత్రాలు..!

సీడ‌బ్ల్యూసీలో చిత్ర విచిత్రాలు..!

సోమ‌వారం జ‌రిగిన కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ (సీడ‌బ్ల్యూసీ)లో స‌వాళ్లు.. ప్ర‌తి స‌వాళ్ల‌తో పాటు ఎన్నో చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. రాహుల్ వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం వ్యక్తం చేసిన సీనియ‌ర్ నేత‌లే అబ్బే.. అదేం లేదు.. డిలీట్ అంటూ చివ‌ర‌కు ఆ పోస్టులను తీసేశారు. అలాగే సోనియాగాంధీ రాజీనామా అంటూ మ‌రో వార్త హ‌ల్ చ‌ల్ చేసినా.. చివ‌ర‌కు ఆమెనే కొన్నాళ్ల పాటు అధ్య‌క్షురాల‌ని ప్ర‌క‌టించారు. సీడ‌బ్ల్యూసీ అనేది కాంగ్రెస్ కు సంబంధించి ఓ అత్యున్న‌త నిర్ణ‌యాత్మ‌క మండ‌లి. అక్క‌డ ఏ అంశంపై అయినా సీనియ‌ర్లు, జూనియ‌ర్లు అంద‌రూ ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తారు. కానీ.. 135 ఏళ్ల పార్టీ చ‌రిత్ర‌లో ఎన్న‌డూ క‌నీవినీ ఎర‌గ‌ని అస్ప‌ష్ఠత సోమ‌వారం నాటి స‌మావేశంలో క‌నిపించింది. సోనియా గాంధీకి 23 మంది సీనియ‌ర్లు రాసిన లేఖ‌పై చ‌ర్చ సీరియ‌స్ గా మొద‌లై సిల్లీగా ముగిసిన‌ట్లు క‌నిపిస్తోంది.

సీనియ‌ర్ల లేఖ‌.. రాహుల్ వ్యాఖ్య‌…

పార్టీకి స‌మ‌ర్ధ‌వంత‌మైన నాయ‌క‌త్వం ఉండాల‌ని, పూర్తి స్థాయి ప్ర‌క్షాళ‌న అవ‌స‌ర‌మ‌ని 23 మంది సీనియ‌ర్లు సోనియాగాంధీకి లేఖ రాసిన విష‌యం తెలిసిందే. ఈ లేఖ‌పై రాహుల్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. లేఖ విడుద‌లైన టైమింగ్ పై అనుమానాలు వ్య‌క్తం చేస్తూ సీనియ‌ర్ల‌పై ఆరోప‌ణ‌లు చేశారు. ఇటీవ‌ల కాలంలో సీనియ‌ర్లంతా బీజేపీతో మిలాఖ‌త్ అవుతున్నార‌ని, సీనియ‌ర్ల లేఖ కూడా ఆ కుట్ర‌లో భాగం అయి ఉంచొచ్చ‌ని ఆయ‌ర ఆరోపించారు. అస‌మ్మతి పేరుతో బీజేపీ అనుకూల విధానాలు అవ‌లంబిస్తున్నారు. లేఖ న‌న్ను తీవ్రంగా బాధించింద‌ని అన్నారు. రాహుల్ వ్యాఖ్య‌ల‌పై సీనియ‌ర్లలో కొంద‌రు తొలుత అదే రీతిలో తీవ్రంగా స్పందించారు. తాము బీజేపీతో కుమ్మ‌క్క‌య్యామ‌ని ఆధారాల‌తో నిరూపించాల‌ని డిమాండ్ చేశారు. గులాం న‌బీ ఆజాద్, క‌పిల్ సిబ‌ల్ అయితే రాజీనామా చేస్త‌మంటూ స‌వాలు విసిరారు. ఘోరంగా అవ‌మానించారంటూ సిబ‌ల్ ట్టిట్ట‌ర్ ద్వారా కూడా చెప్పేశారు. 30 ఏళ్ల త‌మ రాజ‌కీయ జీవితంలో ఏనాడూ బీజేపీకి అనుకూలంగా ఒక్క మాట కూడా అన‌లేద‌ని అన్నారు. రాజ‌స్థాన్ సంక్షోభంలో పార్టీ త‌ర‌ఫున న్యాయ పోరాటం చేసి, మ‌ణిపూర్ లో పార్టీని కాపాడిన త‌ర్వాత కూడా ఇలా వ్యాఖ్యానించ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. సిబ‌ల్ త‌ర‌హాలోనే ఆజాద్ కూడా రియాక్ట్ అయ్యారు.

మ‌రి ఆ త‌ర్వాత ఏమైందో..

స‌మావేశం ముగిసే నాటికి సీనియ‌ర్ నేత‌ల ట్వీట్ల సారాంశం మారిపోయింది. రాహుల్ గాంధీ సీడబ్ల్యూసీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు తమను ఉద్దేశించి చేసినవి కావని కపిల్ సిబల్, గులాం నబీ ఆజాద్ తెలిపారు. సోనియా అనారోగ్యంగా ఉన్న సమయంలో పార్టీ నాయకత్వాన్ని వేరొకరికి ఇవ్వాలంటూ లేఖలు రాసిన సీనియర్ నేతలపై రాహుల్ విరుచుకుపడ్డారని తొలుత వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలు రాసిన లేఖను లీక్ చేసిన వారిపై రాహుల్ మండిపడ్డారని కూడా వార్తలు వెలువడ్డాయి. దీంతో ఆ వ్యాఖ్యలు తమనుద్దేశించి చేసినవేనని ప్రచారం జరగడంతో కపిల్ సిబల్ సోషల్ మీడియా వేదికగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చివరకు ఇద్దరు నేతలూ సోషల్ మీడియాలో మ‌రోమారు స్పందించారు. రాహుల్ తనతో వ్యక్తిగతంగా మాట్లాడారని, ఆయన వ్యాఖ్యలు తననుద్దేశించి చేసినవి కాదని సిబల్ తెలిపారు. తాను ముందు చేసిన ట్వీట్లను డిలీట్ చేస్తున్నానని ప్రకటించి తొలగించేశారు.